చౌటకూర్, ఏప్రిల్ 10: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఈనెల 16న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. సభ నిర్వహణ కోసం సింగూరు చౌర స్తా వద్ద సుల్తాన్పూర్ గ్రామ శివారులో 45 ఎకరాల పట్టా స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సభా స్థలాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పట్లోళ్ల జైపాల్రెడ్డి, ఇతర నేతలు బుధవారం పరిశీలించారు. ఎన్నికల సభ కావడంతో ఈ స్థలానికి సంబంధించి రైతుల వద్ద నుంచి ఎన్వోసీ సైతం తీసుకుంటున్నారు. జహీరాబాద్, మెదక్ లోక్సభ నియోజకవర్గాల స్థానాల పరిధిలోకి వచ్చే అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, నర్సాపూర్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపుగా లక్ష మంది జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల్లో హ్యాట్రిక్ సాధించి సత్తాచాటాలని బీఆర్ఎస్ కృతనిశ్చయంతో ఉన్నది.
జహీరాబాద్ స్థానానికి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్కుమార్ను బరిలో నిలిపారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ బరిలో నిలిపింది. వీరిద్దరు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాగా, భారీ బహిరంగ సభ నిర్వహించి, అధికార కాంగ్రెస్, బీజేపీ వెన్నులో వణుకు పుట్టించేలా రంగం సిద్ధం చేసింది. సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్, సభా వేదిక, కళాకారుల వేదిక తదితర ఏర్పాట్లపై నాయకులు ఆరాతీశారు. సభా స్థలాన్ని పరిశీలించిన వారిలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పట్లోళ్ల నరహరిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మామిళ్ల రాజేందర్ ముదిరాజ్, మాసానిపల్లి నారాయణముదిరాజ్, చౌకంపల్లి శివకుమార్, పైతర సాయికుమార్, పట్లోళ్ల వెంకట్రామ్రెడ్డి, మాణిక్రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు.