చందమామ రావే.. జాబిల్లిరావే.. కొండెక్కి రావే.. గోగుపూలు తేవే.. అంటూ చిన్న పిల్లలకు జాబిల్లి పాటలతో గోగుపూలకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పేవాళ్లు. శిశిర రుతువులో అన్ని చెట్ల ఆకులు, పూలు రాలిపోతుంటే మోదుగ విరగబూసి, వసంత రుతువుకు స్వాగతం పలుకుతుంది. అరుణ వర్ణంలో పూచే ఈ పూలను అగ్గిపూలు, ఎర్రపూలు, మోదుగ పూలుగా పిలుస్తారు. ఈ పూలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. గోగుపువ్వు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదని, శివరాత్రి రోజు ఈ పూలతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.
గోగుపూలను ఉడకబెడితే సహజ రంగు వస్తుంది. ఇది హోలీ రోజు చల్లుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. సాహిత్యంలోనూ మోదుగపూలకు ప్రత్యేక స్థానం ఉన్నది. దాశరథి రంగాచార్యులు లాంటి అనేక మంది కవులు ఈ పూలకు తమ రచనల్లో పెద్దపీట వేశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు శివారులోని అడవి కన్య సిగలో హొయలు పోతున్న మోదుగ పూలు బాటసారుల మనసు దోచేస్తున్నాయి.
– మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 2: