పల్లెలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్అండ్బీ డివిజన్ పరిధిలో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని గ్రామాలకు కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు మరమ్మతుల కోసం సర్వే చేసిన అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. జహీరాబాద్-చించోళి, కంకోల్-కప్పాడు, జహీరాబాద్-బోనాస్పూర్, కోహీర్-గోటిగార్పల్లి, గోపన్పల్లి- గోటిగార్పల్లి గ్రామాల మధ్య బీటీ రెన్యువల్ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. రాయికోడ్ మండలంలోని సిరూర్-రాయిపల్లి రోడ్డుకు రూ. 9 కోట్లు, జహీరాబాద్ బైపాస్ రోడ్డు నుంచి అల్గోల్ వెళ్లే రోడ్డుపై భరత్నగర్-బైపాస్ మధ్య వాగుపై కల్వర్టు నిర్మాణానికి రూ.90లక్షలు, బీటీ రోడ్డు రెన్యువల్కు రూ. 80 లక్షల నిధులు మంజూరయ్యాయి.
జహీరాబాద్, డిసెంబర్ 4: ప్రయాణికులు, వాహనదారులకు మెరుగైన రోడ్డు సౌకర్యం కలిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని బీటీ రోడ్లను రెన్యువల్ చేసేందుకు ఆర్ఆండ్బీ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. తజహీరాబాద్ ఆర్ఆండ్బీ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్, మునిపల్లి మండలంలోని పలు రోడ్లుకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. భారీ వర్షాలతో రోడ్లు గుంతలమయంగా మారిపోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం ముగియడంతో రోడ్లుకు మరమ్మతులు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేశారు. ఏ రోడ్డుకు ఎన్ని నిధులు కావాల్లో ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే టెండర్లు వేసి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
జహీరాబాద్-చించోలి (మొగుడంపల్లి) రోడ్డు 4.1కిలోమీటర్లకు రూ.1.35 కోట్లు, కంకోల్- కప్పాడు 6.4 కి.మీ రూ.1.95 కోట్లు, జహీరాబాద్- బోనాస్పూర్ (తాండూర్) 7.6 కి.మీ రూ.2.31 కోట్లు, కోహీర్- గోటిగార్పల్లి కిలోమీటర్కు రూ.1.30 కోట్లు, గోపన్పల్లి- గోటిగార్పల్లి (వయా గోపన్పల్లి) 5.6 కి.మీ రూ.92 లక్షలతో రెన్యువల్ చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు.
రాయికోడ్ మండలంలోని సిరూర్-రాయిపల్లి రోడ్డుకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసింది. గతంలో బీటీ రెన్యువల్ చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారీ వర్షాలు కురియడంతో ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతులు చేయలేదు.రోడ్లు పూర్తిగా గుంతల మయంగా కావడంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిరూర్ నుంచి రాయిపల్లి బ్రిడ్జి వరకు రోడ్డును నల్లరేగడి మట్టి వరకు తీసి కంకరా వేసి నిర్మించేందుకు సర్వే చేశారు. 2.2 కి.మీ బీటీ రోడ్డు నిర్మించేందుకు సిరూర్ -రాయిపల్లి బ్రిడ్జి వరకు సర్వే చేశారు.
జహీరాబాద్ బైపాస్ రోడ్డు నుంచి అల్గోల్ వెళ్లే రోడ్డుపై భరత్నగర్- బైపాస్ రోడ్డు మధ్య వాగుపై కల్వర్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఇందుకు రూ.90 లక్షలు మంజూరు చేసింది. కల్వర్టుతో పాటు బీటీ రోడ్డు రెన్యూవల్ చేసేందుకు రూ.80 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.
జహీరాబాద్ ఆర్అండ్బీ డివిజన్లో రోడ్ల మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొన్ని రోడ్లకు బీటీ రెన్యువల్ చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఆమోదించి నిధులు మంజూరు చేయగానే పనులు ప్రారంభిస్తాం. జహీరాబాద్ – తాండూర్, జహీరాబాద్- చించోలి, కప్పాడు, కంకోల్, కోహీర్, గోటిగార్పల్లి, సత్వార్ చౌరస్తా నుంచి గోటిగార్పల్లి వరకు బీటీ రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదించాం. రాయికోడ్ మండలంలోని సిరూర్ నుంచి రాయిపల్లి బ్రిడ్జి వరకు బీటీ రోడ్డు నిర్మించేందుకు రూ.9 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అల్గోల్ రోడ్డుపై కల్వర్టు నిర్మిస్తాం. డివిజన్లో ఉన్న ఆర్అండ్బీ రోడ్లను మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. – సంధ్య, ఏఈఈ ఆర్అండ్బీ జహీరాబాద్ డివిజన్