అందోల్/వట్పల్లి, ఫిబ్రవరి 20 : వట్పల్లిలోని వెంకట్ఖ్వాజా ఆశ్రమంలో 37వ ఆరాధన (ఉర్సు) ఉత్సవాలకు రెండోరోజు సోమవారం భక్తులు పోట్టెత్తారు. కుల, మతాలకు అతీతంగా సర్వమత సన్నిధిగా పేరొందిన దర్గాను తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్గాలో ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరాధన ఉత్సవాల్లో భాగంగా సోమవారం లక్ష దీపారాధన ఎంతో వైభవంగా సాగింది. లక్షల దీపాల వెలుగులో దర్గా.. ధగ.. ధగా మెరిపోతూ కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రస్టు నిర్వాహకులు భోజన వసతి కల్పించారు. భూ అంతర్భాగంలో ఉన్న అప్పాగారి సమాధిని దర్శించుకునేందుకు భక్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు అప్పగారి భూ అంతర్భాగంలోని సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా జరిగే ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి జాతరతో తిరిగి సందడి చేశారు. మిఠాయి దుకాణాల్లో స్వీట్లు కొనుగోలు చేసి తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐ నాగరాజు దర్గాను దర్శించుకొని ప్రార్థనలు చేశారు. సర్పంచ్ సురేఖా బుద్ధ్దిరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అశోక్గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీ వారిని సన్మానించారు. ఉత్సవాల సందర్భంగా వట్పల్లి, జోగిపేట, పుల్కల్, ఎస్సైలు అంబ్య్రానాయక్, సామ్యానాయక్, విజయ్కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరం చైర్మన్ వీరారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్, పీఎసీఎస్ చైర్మన్ వినోద్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీశైలం, సర్పంచ్లు నందిని వీరారెడ్డి, ఖయ్యుం పాషా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నర్సింహులు, ఎంసీటీసీ ఇందిరాబాయి, కో-ఆప్షన్ సభ్యుడు కుతుబొద్దీన్, నాయకులు బస్వరాజ్, రాజేందర్, కొసిగేశంకర్, మధు, శ్రీనివాస్ గౌడ్, మహేందర్ గౌడ్, మారుతిరావు వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.