హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పోషకాహార సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని ఆరోగ్యలక్ష్మి, బాలామృతం ఆహార పంపిణీ (టేక్హోం రేషన్)కి విఘాతం కలుగకుండా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోనున్నది. రాష్ట్రంలోని 149 ప్రాజెక్టుల పరిధిలోని 35,700 (3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలతో సహ) అంగన్వాడీ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి ఆరేండ్ల వయసున్న 16,31,600 మంది పిల్లలు, 4,39,826 మంది బాలింతలు, గర్భిణులు ఇలా మొత్తం 20,71,426 మందికి ప్రభుత్వం క్రమం తప్పకుండా పోషకాహారం అందిస్తున్నది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ ఫుడ్స్ గోదాము నుంచి (బాలామృతం, బాలామృతం ప్లస్), ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఇతర వస్తువులను సరఫరా చేయటానికి ఆర్టీసీ కార్గో సేవల్ని విరివిగా వినియోగించుకొంటున్నది. ఈ మేరకు ఆర్టీసీ కార్గో సేవలను మరింత సమర్థంగా వాడుకోవాలని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
లాక్డౌన్ కారణంగా ఏ ఆడబిడ్డ, ఏ పసిబిడ్డ పౌష్టికాహార సమస్యతో ఇబ్బంది పడకూడదని అన్ని చర్యలు తీసుకుం టున్నట్టు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోనే కాకుండా మారుమూ ల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పౌష్ఠికాహారాన్ని చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదటి లాక్డౌన్ సమయంలో అంగన్వాడీలు తమ సేవాగుణాన్ని ప్రదర్శిం చి దేశం మనసును గెలుచుకున్నారని, మళ్లీ అదే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం టేకులగూడేనికి చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ గత ఏడాది రాష్ట్రపతి అవార్డు పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.