జనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ అన్నారు. మంగళవారం జనగామలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 11వ పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం సీఎం కేసీఆర్ ఉద్యోగుల పట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు నిదర్శనమన్నారు. 9,17,479 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన ముఖ్యమంత్రికి టీఎన్జీవోస్ రుణపడి ఉంటుందని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడం గొప్పవిషయమని కొనియాడారు. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా బుధవారం నాగార్జున సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్టు రాజేందర్ పేర్కొన్నారు. ఈ యాత్ర తెలంగాణలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి రాయకంటి ప్రతాప్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోల రాజేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, కార్యదర్శి రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.