పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసి ప్రేక్షకులని అలరించాడు. కాని ఎప్పుడు చారిత్రాత్మక చిత్రంలో నటించలేదు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే టైటిల్తో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల శకం నేపథ్యంలో జరిగిన కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని 150 కోట్ల బడ్జెట్తో మేకర్స్ రూపొందిస్తున్నారు. పవన్ కెరీర్లోనే ఇంత భారీ బడ్జెట్తో రూపొందిన సినిమా హరిహర వీరమల్లు కావడం విశేషం.
ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం చార్మినార్, రెడ్ఫోర్ట్, మచిలీపట్నం ఫోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించినట్టు దర్శకుడు తెలిపారు. నలభైశాతం చిత్రీకరణ పూర్తి కాగా, జూలై నాటికి చిత్రీకరణ పూర్తిచేస్తాం. వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఆరు నెలల సమయాన్ని కేటాయించాల్సి ఉంది అని నిర్మాతలు తెలియజేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రం విడుదల కానుంది.