Kothakota Dayakar Reddy | దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలో రాజకీయపరంగా ఓ వెలుగు వెలిగిన దంపతులు ‘కొత్త’డ్రామాలకు తెరలేపుతున్నారు. కాలం కలిసిరాక తికమకపడుతున్నారు. క్యాడర్ లేకపోవడంతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా లాభం లేకపోయింది. వరుసగా రెండు సార్లు ఓటమి చవిచూశారు. ‘సైకిల్’ దిగలేక.., ‘చేయి’ చాచలేక.. ‘కమలం’ చాటుకు వెళ్లలేక సతమతమవుతున్నారు. పార్టీలు మారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామంటే ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కాంగ్రెస్లోకి వెళ్దామనుకుంటే ఆ పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడడంతో అధిష్టానం వారి రాకను నిలిపివేసింది. పోనీ బీజేపీలో చేరుదామంటే.. పార్టీ పరువుపోతుందని రాష్ట్ర నేతలు అడ్డుకట్ట వేశారు. ఆరోగ్యం బాగాలేదంటే సానుభూతి వస్తుందని భావించినా.. చివరికి చుక్కెదురైంది. దీంతో చేసేదేమీలేక నియోజకవర్గాల పూర్వవైభవం కోసం రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల పేరిట సొంతంగా పోస్టర్లు అతికించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో మరి..
మహబూబ్నగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పి రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొత్తకోట దంపతులకు కాలం కలిసి రావడం లేదు. ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఉన్న క్యాడర్ అంతా ఇతర పార్టీల్లోకి బిచాణా ఎత్తేశారు. 2014లో, 2018లో ఎన్నికల్లో జిమ్మిక్కులు చేసి పోటీ చేసినా ఓటమే వరించింది. ఇప్పుడు పార్టీలు మారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామంటే ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఏ పార్టీలోనూ ఎంట్రీ దొరక్క తెగ మదన పడిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించి.. టీడీపీలోనే కొనసా గి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరం గా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ నాయక త్వం బీసీల చేతుల్లోకి వెళ్లిపోవడంతో పార్టీ మార డం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది.
బీఆర్ఎస్లో చేరుతున్నట్లు సొంత డబ్బా కొట్టుకున్నారు. ఇక రేవంత్ పీసీసీ చీఫ్ కాగానే పాత టీడీపీ నేతలైన తమకు ఎంట్రీ దొరుకుతుందని ఆశించి భంగపడ్డారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరగగానే మక్తల్, దేవరకద్రలో కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి రాజీనామాకు సిద్దపడ్డారు. దీంతో ఖంగుతిన్న అధిష్టానం నో ఎంట్రీ అనేసింది. ఇక బీజేపీలో చేరుదామన్న వాళ్ల ఆశలు గల్లంతయ్యాయి. ఆ పార్టీ రాష్ట్ర నేతలు వీరి రాకకు అడ్డుకట్ట వేశారు. వాళ్లను చేర్చుకుంటే పార్టీ పరువుపోతుందని, ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనే జిల్లా నేతలు తేల్చిచెప్పడంతో ఖంగుతిన్నారు. ఇక నియోజకవర్గాల పూర్వవైభవం కోసం రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల పేరు మీద సొంతంగా పోస్టర్లు అతికించుకోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన కొత్తకోట దయాకర్రెడ్డి, సీతమ్మ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ టికెట్ ఇస్తుందో ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తకోట దయాకర్రెడ్డి దంపతులకు ఏ పార్టీ గడపతొక్కినా చుక్కెదురవుతున్నది. తెలంగాణ వచ్చాక ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైనది. 2014 నుంచి వరుస ఓటములు కుంగదీస్తున్నాయి. తాజాగా ఏ పార్టీకూడా వీరిని చేర్చుకుందామనుకునే లోపే అక్కడి స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. దీంతో వీళ్ల ఎంట్రీకి బ్రేక్ పడుతుంది. రెండుసార్లు ఆత్మకూర్, మక్తల్ ఎమ్మెల్యేగా దయాకర్రెడ్డి గెలుపొందితే, సీతమ్మ ఉమ్మడి పాలమూరు జెడ్పీచైర్మన్గా, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందింది. 2009లో భార్యాభర్తలు మక్తల్, దేవరకద్ర నుంచి గెలిచి అసెంబ్లీలో కాలుపెట్టారు. ఇదే వాళ్లకు చివరి ఎంట్రీగా మారింది. తెలంగాణ వచ్చాక 2014లో మహాకూటమితో పొత్తుతో దయాకర్రెడ్డి మక్తల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా, 2018లో బీజేపీతో పొత్తుతో పోటీ చేసి వరుస ఓటములు మూటగట్టుకున్నారు. ఈ రెండు ఎన్నికల్లో కూడా స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఓడిపోవడం గమనార్హం. ఇద్దరికీ చుక్కెదురైంది. తిరిగి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీకి దిగి పోగొట్టుకున్న డబ్బులు మూట గట్టుకున్నట్లు టీడీపీ నేతలే ప్రచారం చేశారు.
మాజీ ఎమ్మెల్యేలు అయిన వీరిని చేర్చుకునేందుకు మూడు పార్టీల అధినేతలు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఈ ఇద్దరు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు కార్యకర్తల సమావేశాలు నిర్వహించి లీక్లు ఇచ్చారు. హరీశ్రావు సమక్షంలో చేరుతారని సోషల్మీడియాలో ప్రచారం చేశారు. చివరికి ఇది వట్టిదేనని తేలింది. రేవంత్రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి టీపీసీసీ చీఫ్ కావడంతో వీరి ఆశలు చిగురించాయి. ఇక, కాంగ్రెస్లో ఎంట్రీ ఖాయంగా కనిపించింది. దేవరకద్ర, మక్తల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టి మళ్లీ హల్చల్ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయాల పేరిట, బర్త్డేల పేరిట సమావేశాలు, ఫ్లెక్సీలు కట్టించారు. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు.
ఈ ఇద్దరిని చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని బెదిరించారు. దీంతో ఖంగుతిన్న కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ నుంచి ఫోన్లు చేయడమే మానేశారు. చివరికి ఇక బీజేపీయే దిక్కని భావించి ఢిల్లీకి వెళ్లారు. అక్కడినుంచి ఇక్కడి నేతలకు బీజేపీ అధిష్టానం పిలిచిందని.. చర్చలు జరుపుతుందని ప్రచారం చేయించారు. చివరకు అక్కడ కూడా నో అనడంతో ఖంగుతిన్నారు. మూడు పార్టీలు రిక్తహస్తం చూపించడంతో ఖంగుతిన్నారు. ఆయా పార్టీలు వీళ్లకు క్యాడరే వెనుక లేదని ఉన్నోళ్లంతా ఇతర పార్టీల్లో చేరి పదవులు అనుభవిస్తున్నారని, చేర్చుకుంటే వ్యతిరేకత మూట గట్టుకోవాల్సి వస్తుందనే నిరాకరించినట్లు వాళ్ల అనుచరులే అంటున్నారు.
ప్రధాన పార్టీల్లో ఎంట్రీలు విఫలం కావడంతో ‘కొత్త’ డ్రామాకు తెరలేపారు. కొత్తకోట దయాకర్రెడ్డికి ఆరోగ్యం బాగాలేదని విస్తృత ప్రచారం చేశారు. దీంతో సానుభూతి వస్తుందని, కార్యకర్తలు, ముఖ్య నేతలు పరామర్శల పేర హైదరాబాద్ వస్తారని.. ఇది ప్రచారానికి ఉపయోగపడుతుందని ఎత్తుగడ వేశారు. చివరకు సీన్ రివర్స్ అయింది. నారాయణపేట నియోజకవర్గాల నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా పరామర్శించేందుకు వెళ్లలేదు. నియోజకవర్గాల్లో కూడా దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేయాలని చెప్పినా ఒక్కరు కూడా కొబ్బరికాయ కొట్టలేదు. చివరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే ప్రచారం జోరందుకున్నది. దీంతో ఖంగుతిన్న దయాకర్రెడ్డి తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టడం గమనార్హం. మొత్తంమీద కొత్తకోట దంపతుల రీ ఎంట్రీ అనేక మలుపులు తిరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.