పెబ్బేరు, డిసెంబర్ 29 : మత్స్య రంగం అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వంగూరి రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరులోని మత్స్య కళాశాలలో ఎస్సీ యువతకు చేప ఆధారిత మూ ల్యాధిక ఉత్పత్తులు, వాటి వినియోగ ప్రయోజనాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. పశు, పాడి పరిశ్రమలతోపాటు మత్స్య రంగంలో కూడా వివిధ స్వయం ఉపాధి పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే ఉపాధితోపాటు మత్స్య రంగం అభివృద్ధికి దోహద పడినట్లవుతుందని వివరించారు. నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్చార్జి డాక్టర్ బసవరెడ్డి మత్స్య రంగంలో జరుగతున్న పురోగతిని వివరించారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బార్ బుద్ధ, మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తుల్లో వివిధ రకాల పోషకాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. చేపలను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న 25మంది యువతీ, యువకులకు వైస్ చాన్స్లర్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.