వనపర్తి టౌన్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహామేధావి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో.. బీఆర్ 132వ జయంతిలో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వమానవుడని.. ఆయన జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంబేద్కర్ నేటి తరానికి, భావితరాలకు చిరస్మరణీయంగా నిలిచారన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. హైదరాబాద్లోని విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనువడు ప్రకాశ్అంబేడ్కర్ రావడం సంతోషమన్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరినా.. బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. దేశంలో వనరులు, సంపద దేశ ప్రజలకు దోహదపడాలన్నదే అంబేద్కర్ ఆలోచన అని.. కానీ ఆయన ఆలోచనలు, ఆకాంక్షలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్పరం చేసి జాతి సంపదను సంపన్నులకు దోచిపెడుతుందని మండిపడ్డారు. అంబేద్కర్ పేరును తలిచే అర్హత కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, దళితులు పాల్గొన్నారు.
వనపర్తి, ఏప్రిల్ 14 : మండలంలోని కిష్టగిరిలో కాంగ్రెస్కు చెందిన ఉపసర్పంచ్ మహేశ్నాయుడు, నాయకులు చెన్నయ్య నాయుడు, విష్ణు, మహేశ్ బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో పార్టీ శిక్షణా తరగతుల జిల్లా కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, మండలాధ్యక్షుడు మాణిక్యం, యువజన సంఘం అధ్యక్షుడు రాము, ఎంపీటీసీ ధర్మానాయక్, కిష్టగిరి మాజీ సర్పంచ్ వెంకటయ్య, శతృనాయక్, అంజినాయుడు తదితరులు పాల్గొన్నారు.