గద్వాల టౌన్, మే 11 : వారు చీకట్లో ఉండి అందరికీ వెలుతురును ఇచ్చేది విద్యుత్ శాఖనే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంతటి ప్రాధాన్యమున్న విద్యుత్ పరిశ్రమతోనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్లో రూ.2 కోట్లతో చేపట్టిన విద్యుత్ శాఖ టీఎస్ఎస్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటయ్యాక 16 వేల పైబడి మెగావాట్ల విద్యుత్ తయారవుతుందని వెల్లడించారు. విద్యుత్ పరిశ్రమ ఎంతో వృద్ధి చెందిందని పేర్కొన్నారు. దీర్ఘ కాలిక ప్రణాళికతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు.
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలో రూ.39 వేల కోట్లు ఖర్చు చేసి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉచిత విద్యుత్తో రూ.10,500 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఎక్కడ లేదని, కేవలం తెలంగాణ ఒక్కటే అన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ విద్యుత్ అధికారుల సేవలను కొనియాడారు. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మంద జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యుత్ సమస్యలు తీరాయని చెప్పారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రెండేండ్లలో జిల్లాలో రూ.39 కోట్ల విద్యుత్ పనులు జరిగాయని తెలిపారు. అన్ని సమయాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుండటం అభినందనీయమని అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డలో నీటి లభ్యత మేరకు విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాలో విద్యుత్కు సంబంధించిన అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామన్గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీధర్గౌడ్, ఎస్ఈ భాస్కర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఏడీ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.