తిమ్మాజిపేట, జూన్ 13 : జూన్ నెల ప్రారంభమైతే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం మొదలవుతోంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త లక్ష్యాలతో పిల్లలు ముందుకు సాగుతుంటే..మరో వైపు తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం ఆందోళన గంటలు మోగుతున్నాయి. కారణం రోజురోజుకూ పెరుగుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల భారం. ఒకప్పుడు విద్యను సేవగా భావించినా విద్యా సంస్థలు, ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లల భవిష్యత్ పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని విద్యాసంస్థలు ప్రత్యేక పుస్తకాల పేరుతో వేల రుపాయలు వసూలు చేస్తున్నాయ ని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫాం, షూస్, స్కూల్ బ్యాగులు కూడా తాము చెప్పిన చోటనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తేస్తున్నారని వారు అంటున్నారు. దీంతో తల్లిదండ్రలకు మరింత భారంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడాల్సిన వివిధ సంఘాలు, ఫీజుల పెంపు సమయంలో ఒకటి రెండు సార్లు ఆందోళన చేయడం.. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని అంటున్నారు. అడ్మిషన్లు పూర్తయిన తర్వాత, ఫీజులు చెల్లించిన తర్వాత ఆందోళన చేస్తే ఫలితం ఏముంటుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ అమలులో ఉన్నది. ఫీజుల పెంపుపై తప్పకుండా పర్యవేక్షణ నిర్వహిస్తూ తల్లిదండ్రుల ఫిర్యాదులను స్వీకరించే కమిటీలు పనిచేస్తున్నాయి. విద్య ను వ్యాపారంగా కాకుండా, హక్కుగా చూడాలనే ఆలోచనలకు అక్కడ ప్రాధాన్యతను ఇస్తున్నారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వాల జోక్యం అవసరం విద్యార్థుల భవిష్యత్, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఫీజుల నియంత్రణపై కఠిన నిబంధనలు తీసుకరావాలని డిమాండ్ తల్లిదండ్రుల నుంచి పెరుగుతోంది. ప్రైవేట్ విద్యాసంస్థలపై పర్యవేక్షణ, పుస్తకాల విక్రయ నియంత్రణ, ఇతర కొనుగోలుపై పారదర్శకత, ఫీజుల వివరాలు బహిరంగా ప్రకటన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యా హక్కుగా ఉండాలా..? వ్యాపారంగా మారలా…? అనే చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా పాలకులు దృష్టి సారించి ఫీజులను నియ ంత్రించాల్సి ఉన్నది.
ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, ల్యాబ్ ఫీజు, ట్రాన్స్ఫోర్ట్ ఫీజు, ప్రత్యేక కోచింగ్ ఫీజు.. ఐఐటీ ఫీజులంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచే సంవత్సరానికి రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. పిల్లలు భవిష్యత్ కోసం ఎంతకష్టమైనా భరించాలనే తల్లిదండ్రుల బలహీనతను కొన్ని పాఠశాలల యజమాన్యాలు అవకాశంగా మలుచుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో రవాణా చార్జీలు అదనంగా మోపుతున్నారు. మరికొందరు వీటి నుంచి తప్పించుకునేందుకు ఆటోలపై ఆధారపడుతున్నారు. ఆటోల్లో కూడా కెపాసిటీకి మించి విద్యార్థులను తీసుకెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.