పాలమూరు సిగలోకి మరో నగ రానున్నది. దివిటిపల్లి ఐటీ కారిడార్లో అమర్రాజా లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. 250 ఎకరాల్లో.. రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అగ్రిమెంట్ పూర్తయింది. ప్రత్యక్షంగా 10 వేల మందికి.. పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వలసలు పూర్తిగా నిలిచి ఉపాధి కల్పించే జిల్లాగా ఏర్పడిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 2 ( నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : దివిటిపల్లి ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్లో అతి పెద్ద కంపెనీ ఏర్పాటు కానున్నది. అమర్రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పనున్నది. శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్) పూర్తయింది.
తొలి దశలో సుమారు 5,000 మందికి క్రమంగా 10 వేల మంది వరకు ఉద్యోగావకాశాలు కల్పించేలా పరిశ్రమను ఏర్పాటు కానున్నది. కంపెనీని మహబూబ్నగర్లో ఏర్పాటు అయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేసే విధంగా నిర్మించిన ఐటీ టవర్ పనులు దాదాపు పూర్తి కావచ్చయని తెలిపారు. త్వరలో ఈ టవర్ను ప్రారంభిస్తామని మంత్రి వివరించారు.
హన్వాడ సమీపంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫుడ్పార్కుతో మహబూబ్నగర్ పెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు మీదుగా పలు జాతీయ రహదారులు, రైల్వే డబుల్లేన్నతో చక్కని రవాణా వసతి సౌకర్యం ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి మరింత అవకాశం ఉన్నదన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉండడం, ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నదని చెప్పారు. భవిష్యత్లో పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, దీంతో మహబూబ్నగర్ దశ మారనున్నదని మంతి పేర్కొన్నారు.