మహబూబ్ నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 4 : టాస్ మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టులో అక్రమంగా నియమితులైన (జడ్పీహెచ్ఎస్ మూసాపేట ఎస్ఏ ఇంగ్లీష్) ఉపాధ్యాయుడు ఎం.శివయ్యను తొలగించి ప్రభుత్వ యాజమాన్య పరిధిలో అర్హులైన స్కూల్ అసిస్టెంట్ను నియమించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(జీటీఏ) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం ఎదుట వారు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జీటీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.రమేశ్, జంబు కిశోర్, గౌరవ అధ్యక్షుడు నాగం రఘురామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో 1214 తేదీ 12.08.1997 ప్రకారం లోకల్ బాడీ మేనేజ్మెంట్ టీచర్ ఈ పోస్టుకు అనర్హులని తెలిపారు. శివయ్య నియామకం జీవోకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్నే టాస్ కోఆర్డినేటర్గా నియమించాలని నిబంధనలు స్పష్టంగా చేస్తున్నా.. కొందరు అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడి అనర్హులకు పట్టం కడుతున్నారని ఆరోపించారు. విద్యావ్యవస్థను సక్రమంగా నడిపించుటలో బాధ్యతగా కృషిచేయాల్సిన విద్యాశాఖ అధికారులు బాధ్యతారాహితంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ జీవోలకు తిలోదకాలు ఇస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.
టాస్ జిల్లా సమన్వయకర్తకు సంబంధించిన జీవోలను, డైరెక్టర్ ఉత్తర్వులను అన్నింటినీ స్పష్టంగా పేర్కొంటూ వివరిస్తూ వచ్చామని అన్నారు. ప్రజావాణిలో కూడా వినతిపత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు గేటు ధర్నా నిర్వహించామని తెలిపారు. జీవోలు, ప్రొసిడింగ్లు చాలా స్పష్టంగా పేర్కొంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నప్పటికీ అక్రమంగా నియమించబడ్డ శివయ్యను తొలగించేందుకు అధికారులు అలస్యం చేస్తుండటానికి ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో కూడా ఊహించలేకపోతున్నామని మండిపడ్డారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జీవిస్తూ రాజ్యాంగబద్ధ వ్యవస్థలో పొందుపర్చిన ఉత్తర్వులను మనమే గౌరవించుకోనట్లయితే ఈ ప్రభుత్వాలు ఎందుకు.? ఈ వ్యవస్థ ఎందుకు.? అని ప్రశ్నించారు.
మనది నియంతృత్వ ప్రభుత్వమైతే కాదు.. తమ ఇష్టానుసారం వ్యవస్థను నడుపుకోదల్చుకుంటే ఇలాంటి ఉత్తర్వులను అన్నింటిని రద్దు చేయండి.. లేదా ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులే వక్రమార్గాన్ని ఎంచుకుంటే మేము ఎవరికి విన్నవించుకోవాలి..? ఎవరిని ప్రశ్నించాలి.? అని నిలదీశారు. ఇప్పటికైనా విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారులు కండ్లు తెరవాలి.. నిజానిజాలు తెలుసుకోవాలి.. సానుకూలంగా ఆలోచించి ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి అనేక పర్యాయాలు తీసుకొచ్చినా.. పలుకుబడి కలిగిన వ్యక్తుల ఒత్తిళ్లతో చర్యలకు వెనుకంజ వేస్తున్నారన్నారు. అక్రమంగా నియమితులైన టాస్ కోఆర్డినేటర్ నియామక ఉత్తర్వులను రద్దు చేసి ఆ స్థానాన్ని గవర్నమెంట్ మేనేజ్మెంట్లోని స్కూల్ అసిస్టెంట్ను న్యాయబద్ధంగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యక్ష కార్యచరణ కార్యక్రమానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె.నాగరాజు, కమిటీ సభ్యులు చంద్యానాయక్, గోపాల్, శ్రీనివాస్, వేదప్రకాశ్, జి.శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.