అయిజ, జూన్ 25 : ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరలేదు. దీంతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది. తుంగభద్ర నదీ తీర ప్రాంత రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు వానకాలం పంటల సాగు చేపట్టేందుకు సంశయంలో ఉన్నారు. ప్రతి యేటా మే, జూన్ నెలల్లో వర్షాలు కురిస్తే ఆయకట్టులోని భూములను పంటల సాగుకు సిద్ధం చేసేవారు. ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. ఇప్పటి వరకు అడపాదడపా వర్షాలు కురిసినా తుంగభద్ర నదికి వరద చేరకపోవడం, ఆర్డీఎస్ ఆనకట్టకు సైతం స్వల్పంగా వరద చేరడం, వారం రోజుల వ్యవధిలోనే ఆనకట్టలో నీటి మట్టం క్రమేపీ తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు
. ప్రతి ఏటా జూలై మాసం చివరి నాటికి తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం 75 టీఎంసీలకు చేరగానే నారుమళ్లు సిద్ధం చేసేవారు. తుంగభద్ర జలాశయంలోని 33 క్రస్ట్గేట్లు, చైన్ల మార్పుల కారణంగా గత యాసంగిలో ఆర్డీఎస్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. వానకాలంలో సాగునీరు పుష్కలంగా అందుతుందని ఆశతో ఉన్న ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఎల్నినో ప్రభావం రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. దక్షిణ తెలంగాణ మీద ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఆరుతడి పంటగా సాగు చేసిన పత్తి పంట కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రెండు, మూడు దఫాలుగా పత్తి విత్తనాలు నాటిన రైతులు ప్రస్తుతం వారం రోజులుగా వరుణుడు కరుణించకపోవడంతో పత్తి మొలకలు ఎండుదశకు చేరుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం మూడు రాష్ర్టాలకు వరదాయని. గత ఏడాది టీబీ డ్యాం గేట్ల బిగింపు, చైన్ల ఏర్పాటుతో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు యాసంగి పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ప్రస్తుతం క్రస్ట్గేట్లు, చైన్ల బిగింపు పూర్తి చేసినప్పటికీ ఎగువన వర్షాలు కురవక పోవడంతో తుంగభద్ర డ్యాంలోకి వరద నీరు చేరలేదు. దీంతో తుంగభద్ర డ్యాం అడుగంటింది. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1588 అడుగుల నీటి మట్టం ఉన్నది. 105.788 టీఎంసీల నీటి నిల్వకు గానూ 9.748 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఇన్ఫ్లో నిల్గా నమోదైంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరువకాగానే దిగువకు నీటిని విడుదల చేస్తేనే కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని తుంగభద్ర నదీతీర ప్రాంత రైతులు, ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుంది.
కర్ణాటకలోని ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్సన్ స్కీం) ఆనకట్ట అడుగంటుతున్నది. రెండు వారాలో కిందట ఏపీలోని ఆదోని, ఆలూరు తదితర ప్రాంతాల్లో కురిసిన వానలకు బళ్లారి అగిరి పెద్దవాగు పొంగి ప్రవహించడంతో వారం రోజుల పాటు ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు చేరింది. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో ఆనకట్టలోని నీటి మట్టం క్రమేపీ తగ్గుతోం ది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ప్రధాన కాల్వకు ప్రవా హం పెరిగితే పులికల్, చిన్నతాండ్రపాడు లింగమ్మ చెరువులను నింపాలని జలవనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఆనకట్టలో నీటి మట్టం తగ్గడంతో చెరువుల్లోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంతో వానకాలంలో వర్షాలు కురవకపోతే ఆర్డీఎస్ ఆయకట్టు కింద పంటల సాగు అంతంత మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. 87,500 ఎకరాలకు ఆర్డీఎస్ ఆనకట్ట ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా, వరదలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుణుడి కరుణ కోసం ఆర్డీఎస్, తుంగభద్ర నదీతీర ప్రాంత రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది అతివృష్టి కారణంగా పంటలు సాగు చేసినా దిగుబడులు అంతంత మాత్రం రాగా, యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించడంతో నష్టాలు చవిచూ డాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాలంలో వరుణుడు కరుణిస్తేనే పంటల సాగుతో దిగుబడు లు సాధించి నష్టాలను కొంత వరకు తగ్గించుకోవాలని ఆశపడుతున్నా వరుణుడు కరుణించడంలేదని రైతులు పేర్కొంటు న్నారు.