నేడు పట్రా మరియన్న వర్ధంతి
కవుల రత్నగర్భం వంటి తెలంగాణ మాగాణంలో మరుగున పడ్డ మరో కవి రత్నం పట్రా మరియన్న. కడు పేదరికంతో కష్టపడి చదివి, నాటి తెలుగు ఉపాధ్యాయులు చేసిన బోధనా మాధుర్యంలోని పాండిత్యాన్ని వంట పట్టించుకున్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఖండ కావ్యాలు దొరికినంతవరకు ఆమూలాగ్రం చదివి సాధనతో సహజ కవిగా తనలోని భావాలకు పద్యరూపం అందించారు కవి పట్రా మరియన్న.
మరియన్నలో ఒక మహత్తర గుణం ఉండేది. ఆయన రాసిన పద్యాలు అన్నీ కంఠతః చెప్పేసేవారు. అంతటి ధారణ గలవారు కావడం వల్లే ఆయన పద్యాల్లో చక్కని నడక సరళత కనిపిస్తాయి. ఈ నిరుపేద ఉపాధ్యాయ కవి రాసుకున్న పద్యాలన్నీ పాత నోటు పుస్తకానికే పరిమితమైపోయాయి. పుస్తక రూపమంటే ఆకాశపుష్పమే అయింది! అయినా తను చూసిన విషయాలు, తనకు కలిగిన భావాలను అందమైన పద్యాలుగా రాసుకోవడం మాత్రం మానలేదు, అలా రాసుకున్న వందల పద్యాలన్నీ 1986లో సంభవించిన గోదావరి వరదల్లో గంగపాలయ్యాయి. కవితల కాగితాలు నీటి పాలు కావడంతో కన్నీటి పర్యంతమై ఆప్తులను కోల్పోయిన తీరున వలవల ఏడ్చారు.
నిత్యం సాహితీ స్నేహితులతో సాంగత్యం చేస్తూ సమావేశాల్లో పాల్గొంటూ తన సాహితీ వ్యసనాన్ని వీడలేదు. కొడిగట్టిన దీపంలా తనలోని కవితాపద్య జ్యోతి మిణుకుమిణుకు మంటూనే ఉండేది. భద్రాచలంలో విద్యాలయాల అధిపతి సామాజిక ఆధ్యాత్మిక సేవా భావాలు గల డాక్టర్ ఎస్.పాల్రాజ్ ఆదరణతో ఆయననే కృతిభర్తగా చేస్తూ తనలో గూడు కట్టుకున్న కవితా భావాలను ఆవేదన పేరుతో కావ్య కన్యకగా తయారుచేశారు. గోదావరి వరదల్లో కలిసిన తన పద్యాలను సైతం దేవుడు తనకు ఇచ్చిన ధారణ శక్తితో మళ్లీ అక్షరబద్ధం చేసుకున్నారు. ‘వ్యత్యయాలు, గోవిలాపం, నైతిక పతనం, కాకులు’ అనే పేర్లతో నాలుగు ఖండాలు గల ఈ దీర్ఘ కవితల ఖండకావ్యం 1998 ఫిబ్రవరిలో తెలుగు సాహితీ క్షేత్రంలో అడుగిడి నాటి ప్రముఖ పండితుల ప్రశంసలందుకున్నది.
కోడి పిల్లలను ఎత్తుకుపోతున్న గద్ద ముఖచిత్రంతో ముస్తాబైన ‘ఆవేదన’ ఖండకావ్యంలో వస్తు వైవిధ్యం కనిపించిన భావ సారూప్యత మాత్రం ఒక్కటే. ధనిక, పేద తారతమ్యాలను బేరీజు వేస్తూ సమాజంలో పేదలు అనుభవిస్తున్న దారిద్య్రాన్ని స్వానుభవంతో తన పద్యాల సాయంగా కళ్లకు కట్టారు. మరియన్న పద్యాలలో కరుణ రసంతో పాటు ధర్మాగ్రహపు రౌద్ర రసం ఉంటుంది, సంభాషణలు ఉంటాయి, చమత్కారాలు కనిపిస్తాయి కథా కథనాలతో పాఠకులకు మధురానుభూతులు పంచారు మరియన్న. సాధారణ చదువరి అయిన మరియన్నలో అంతటి సాహితీ పట్టు అక్షర పుష్టి ఎలా వచ్చాయని ఆశ్చర్యం కలగక మానదు.
‘వ్యత్యయము’ అనే తొలి ఖండంలో ఒక ధనవంతుని కుమార్తె పుష్పవతి అయిన సందర్భంగా అతని గృహాన్ని అందమైన విద్యుత్తు దీపాలతో ఎలా అలంకరించారో చెప్తూనే.. అదే ప్రాంతంలోని ఒక పూరి గుడిసెలోని అనాథ బాలికల్లో ఒక బాలిక పుష్పవతి అవ్వగా చీకటిలో నిదురించరాదనే నియమంతో ఊరంతా తిరిగినా ఎక్కడా ఒక దీపం కూడా దానంగా దొరకని హృదయ విదారక దృశ్యాన్ని హృద్యంగా అక్షరీకరించారు మరియన్న కవి.
‘కరమున్ జాటు చేసి కన్నీరు గార్చుచు/ శిరము వంచి యెరిగి దరికి తిరిగి/ అక్క పుష్పవతిగ నయ్యె నటంచును/ చెప్పె చిన్న పిల్ల సిగ్గుపడుచు..’ అక్కడ ధనవంతుడి గృహం, ఇక్కడ పేదవాని గుడిసె చేసే పని ఒక్కటే. కానీ, అందులో అంతుబట్టని వ్యత్యాసం కనిపిస్తుంది.
స్వార్థపరులైన కొందరు ధనికులు, పేదలకు కర్మసిద్ధాంతం అంటగట్టి అణగదొక్కుతున్నారు కానీ ప్రజలు చైతన్యవంతులై ప్రగతి పథంలో పయనించే రోజులు వస్తాయని దొరతనం సాగదని తనదైన ఆశాభావం వ్యక్తపరుస్తారు. ఇలా సామాజిక సమస్యలనే తన కవితా వస్తువులుగా తీసుకొని అందమైన పద్యాలు అల్లిన ఈ అజ్ఞాత తెలంగాణ దళితకవి 1937 ఏప్రిల్ 1న తొలి శ్వాసతో ఈ లోకానికి వచ్చి, 2000 ఏప్రిల్ 15న ఆఖరి శ్వాస విడిచారు. ఈ భద్రగిరి పద్యకవి పట్రా మరియన్న తన ఏకైక పద్యకావ్యం ‘ఆవేదన’ ద్వారా సదా అక్షర చిరంజీవిగా వర్ధిల్లుతారు.
డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు
77298 83223