గోలకొండ కవుల సంచికను వెలువరించి.. తెలంగాణలో కవులే లేరనే నింద వ్యాఖ్యలకు దీటైన సమాధానమిచ్చిన దీశాలి, తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బహుముఖీన ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి ఆయన. సమాజ హితం కోసం జీవితాంతం కృషిచేసిన ఉద్యమశీలి సురవరం.
కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి అనేక సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించిన ప్రతాపరెడ్డి జానపద సాహిత్య సేకరణ చేయడమే కాకుండా, ఆంధ్రుల సాంఘిక చరిత్ర వంటి పరిశోధనాత్మక గ్రంథాలను రాశారు. ఇది చరిత్ర రచనకు ఒజ్జ బంతి అయింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన గ్రంథంగా చరిత్ర సృష్టించింది.
‘సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే ఒక మహోన్నత మూర్తి మన కండ్ల ముందు సాక్షాత్కరిస్తారు. బహుముఖ ప్రతిభకు ఆయన నిలువెత్తు ఉదాహరణ. సురవరం మేధాసంపన్నుడు. వాఙ్మయ రంగంలో ఆయన ప్రతిభ, ప్రజ్ఞ కనరాని విభాగమే లేదు. ఆయన గొప్ప విమర్శకులు మాత్రమే కాదు, కవి, పండితుడు, పత్రికా రచయిత, రాజకీయవేత్త కూడా. వీటన్నింటిని మించి మంచి పరిశోధకుడు, హృదయం గల దేశాభిమాని. సకల కళా సాహిత్య సేవా దురంధరుడు’ అని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ రాయడాన్ని బట్టే ప్రతాపరెడ్డి ఎంతటి మహానుభావుడో అర్థం చేసుకోవచ్చు.
నేటి జోగులాంబ జిల్లాలోని గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉన్న బోరవెల్లి గ్రామంలో 28 మే 1896లో సురవరం ప్రతాపరెడ్డి జన్మించారు. ఆయన అసలు పేరు పాపిరెడ్డి. చిన్నప్పటి నుంచే గొప్ప ధారణాశక్తి గలవాడు. అయితే చండశాసనుడైన తన గురువు రఘురామయ్య కఠినత్వంతో చదువుపై ఆయనకు విముఖత పెరిగింది. దాంతో బడి ఎగ్గొట్టి గోటిలాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆయన పిన తండ్రి రామకృష్ణారెడ్డికి తెలిసి కఠినమైన దినచర్యను పాటింపజేశారు. దీంతో సురవరం జీవితం మలుపు తిరిగింది. ప్రతాపరెడ్డి ఐదో తరగతి చదివేటప్పుడే ‘తెలుగులో కవిని కావలెను.
శాశ్వత కీర్తి సంపాదించవలెను. లేకున్నా నా జీవితం వ్యర్థం’ అని అనుకున్నాడట. అనుకుంటే సరిపోదు స్వయంకృషి, సాధన, సంకల్పం అవసరమని ఆయన గ్రహించారు. ఆలోచన కలిగిందే తడవుగా చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు రచనలను సంపాదించుకున్నారు. చామకూర వేంకటకవి విజయ విలాసం, ఇతర ప్రబంధాలను అధ్యయనం చేశారు. ఇలా చదవడం ఒక అలవాటుగా కాకుండా, వ్యసనంగా మారిపోయింది ప్రతాపరెడ్డికి. ఆయన కొన్న పుస్తకాలకు, చదివే పుస్తకాలకు లెక్కే లేదు. కొత్త పుస్తకం వచ్చిందంటే చాలు కొనాల్సిందే, చదువాల్సిందే. ఆషామాషీగా చదువకుండా పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా, విమర్శనాత్మకంగా చదివేవారు.
చదివిన ప్రతి పుస్తకంపై విమర్శ రాసి పెట్టుకునేవారు. ఆ లక్షణమే భవిష్యత్తులో అతన్ని మహా పరిశోధకుడిగా నిలిపింది. ఆ చదువే అతనికి తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ భాషల్లో పట్టు సాధించేటట్టు చేసింది. సంస్కృతం నేర్చుకోవడానికి వేదం వెంకటరాయ శాస్త్రి విధించిన షరతు మేరకు మాంసాహారాన్ని మానివేశారాయన. ఈ విధంగా సురవరం జీవితానికి మలుపును, గెలుపును చదువు తెచ్చిపెట్టింది. చిన్నప్పుడు పాఠశాలలో పట్టుమని పది నిమిషాలు కూడా ప్రసంగించని ప్రతాపరెడ్డి తర్వాతి కాలంలో గంటల తరబడి మాట్లాడగలిగే స్థాయికి ఎదిగారు. ఒక విధంగా చెప్పాలంటే పట్టుదల ముందు ఎటువంటి ప్రతిబంధకాలు అడ్డుకావని నిరూపించారు ప్రతాపరెడ్డి.
‘చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష’ అనుకునేవాడు స్వార్థజీవి. పదిమంది మేలు కోసం పాటుపడేవాడు సార్థక జీవి. తన డబ్బును, అక్షర సంపదను తెలంగాణ శ్రేయస్సు కోసం ధారపోసిన మహాత్యాగి సురవరం. ఆనాటి నిజాం ఉక్కు పాదాల కింద ఉలుకు పలుకు లేని తెలంగాణలో నవ చైతన్యాన్ని నింపడానికి ఆయన నడుం బిగించారు. ‘మూగపడిన తెలంగాణ మూలిగిన తొలినాటి ధ్వని’ అని ప్రతాపరెడ్డిని డాక్టర్ దాశరథి కీర్తించారు. ప్రజా చైతన్య మహోద్యంలో దొరికిన ఏ అవకాశాన్ని సురవరం జారవిడుచుకోలేదు. ఏకకాలంలో విభిన్న రంగాల్లో కృషి చేశారు.
రంగాలు ఏవైనా ఆయన అంతరంగం మాత్రం తెలంగాణ మహాభ్యుదయమే. కొన్ని రోజుల పాటు హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ ద్వారా సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కూడా. విద్యార్థుల దినచర్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. క్రమశిక్షణకు పెద్దపీట వేశారు. విద్యార్థి బాగుపడితే సమాజం బాగుపడుతుందనేది ఆయన ఆలోచన. ‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అన్నది ఆయన అంతర్గత ఆలోచన. అందుకే విద్యార్థుల ఆలోచనల్లో, అధ్యయనాల్లో మార్పు కోసం శ్రీకారం చుట్టారు.
మద్రాసులో చదువుకునే రోజుల్లోనే జాతీయోద్యమం కారణంగా ప్రభావితుడైన ప్రతాపరెడ్డికి ఆనాడే పత్రిక స్థాపించాలన్న ఆలోచన కలిగింది. ‘దేశ బంధు’ అనే పేరు కూడా అనుకున్నారు. కానీ, ఆనాటి నిజాం ప్రభుత్వం అనుమతిచ్చే పరిస్థితి కనిపించలేదు. అందుకే ‘గోలకొండ’ అనే పేరు ఖరారు చేశారు. 1926, మే 10న గోలకొండ పత్రిక పురుడుపోసుకుంది. నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది.
ప్రతాపరెడ్డి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది గోలకొండ పత్రిక. అది ప్రతాపరెడ్డి అక్షరాల కోట. ఎందరో రచయితలకు ప్రోత్సాహమిస్తూ నిష్పక్షపాతంగా 23 ఏండ్ల పాటు పత్రికను నడిపారు. నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లాఖాన్ను నడివీధిలో నరికి చంపిన క్రూరమైన కాలమది. అటువంటి పరిస్థితుల్లో కూడా నిజం దుర్మార్గాలను నిరసిస్తూ అనేక సంపాదకీయాలు, వ్యాసాలు రాసిన సాహసి ప్రతాపరెడ్డి. ‘తెలంగాణలో కవులే లేరు’ అన్న నిందకు నిరసనగా ఎంతో శ్రమకోర్చి ‘గోలకొండ కవుల సంచిక’ను 1935లో ప్రకటించారు. అందులో 183 మంది పూర్వ కవులు, 354 మంది ఆధునిక కవుల రచనలు, పరిచయాలున్నాయి.
ఎలాంటి సాంకేతిక, రవాణా వ్యవస్థలు లేని నాటి రోజుల్లో కవుల, రచయితల సమాచారం సేకరించడం అంత సులువైన విషయం కాదు. మొక్కవోని సంకల్ప శక్తికి, కార్యదక్షతకు మారుపేరుగా వెలువడిన గోలకొండ కవుల సంచిక తెలంగాణ కవిత జయకేతనమని చెప్పవచ్చు. ఇంతటి ఘనకార్యం సాధించిన ప్రతాపరెడ్డి తన సొంత కవితలను సంకలనంగా వేయలేకపోయారు. తన గురించి కాదు, తన సమాజం గురించి ఆలోచించేవాడు ఉత్తముడవుతాడనేది ఆర్యోక్తి. ఆ కోవకు చెందినవారే మన సురవరం ప్రతాపరెడ్డి. పరాయి భాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా కృషిచేస్తూ అనేక సభలు, సమావేశాలతో.. ‘అతడు లేని తెలంగాణ, అలంకరణ లేని జాణ’ అన్న దాశరథి మాటలను నిజం చేశారు సురవరం.
కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి అనేక సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించిన ప్రతాపరెడ్డి జానపద సాహిత్య సేకరణ చేయడమే కాకుండా, ఆంధ్రుల సాంఘిక చరిత్ర వంటి పరిశోధనాత్మక గ్రంథాలను రాశారు. ఇది చరిత్ర రచనకు ఒజ్జ బంతి అయింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన గ్రంథంగా చరిత్ర సృష్టించింది. ‘హిందువుల పండుగలు అనే గ్రంథానికి విపులంగా పీఠిక రాయడానికి నా శక్తి సరిపోదు’ అని నాటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారంటే ఆ గ్రంథం విశిష్టతను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇలా వివిధ భాషలపై పట్టు సాధించిన సురవరం ప్రతాపరెడ్డికి తెలుగంటే ఎంతో ప్రీతి. తెలుగును చిన్నచూపు చూసేవాళ్లను చూస్తే ఆయనకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది. నిఘంటువులకెక్కని పదాలు ఎన్నింటికో అర్థాలను కూడా రాసి పెట్టారు సురవరం. తెలుగు లిపి సంస్కరణ జరగాలని కోరుకున్నారాయన. 28 అక్షరాలతోని వర్ణమాలను రూపొందించి పరిశోధన పటిమను ప్రదర్శించారు. ఆయన కలానికి రెండు వైపులా పదునే. గ్రాంథికం రాయగలరు, వ్యవహారికం వాడగలరు. గద్య రచనల్లో వ్యవహారిక భాషకు పెద్దపీట వేశారు. నిరాడంబరం, నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థం ప్రతాపరెడ్డి జీవ లక్షణాలు. వేషభాషల్లో పరమత ప్రభావం ప్రచండంగా ఉన్న కాలంలో కూడా అచ్చమైన తెలుగువాడిగా జీవించగలిగారు ఆయన.
ఆయనది నిండైన తెలుగు వేషం. అక్షరాలలోనే కాదు, అంకెల్లో కూడా తెలుగును వాడేవారు. ఆయన ఎవరినీ స్తుతించరు, ఆయనను ఎవరైనా స్తుతిస్తే భరించరు. అది ఆయన లక్షణం. మంచి ఎక్కడున్నా గ్రహించే మనస్తత్వం ఆయనది. ఇట్లా ఎందరికో ప్రేరకుడు, ఎన్నో రచనలు రావడానికి కారకుడయ్యారు. కులమతాల పట్టింపులు లేని సంస్కరణ శీలి. జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభలో భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనే అవకాశం కల్పించిన మహనీయుడు ప్రతాపరెడ్డి. 1952లో వనపర్తి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల మనిషి అని నిరూపించుకున్నారు. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాల్లో ప్రభావితం చేసిన ప్రతాపరెడ్డి జీవనం నిజంగా పావనం. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం.
(మే 28న సురవరం ప్రతాపరెడ్డి జయంతి)
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
94415 61655