సారంగు తమ్మయ ‘వైజయంతి విలాపం’ అనీ శృంగార ప్రబంధం రచించాడు. దీనికి ‘విప్ర నారాయణ చరిత్ర’ అని కూడా పేరు. ఇది నాలుగు ఆశ్వాసాల గ్రంథం. ఈ కవి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కుమారుడైన మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో (క్రీ.శ.1580-1612) గోలకొండ ‘కరణం’గా పనిచేశాడు. ఈ కవి తన కావ్యాన్ని తన ఇష్ట దైవం శ్రీరామునికి అంకితంగా ఇచ్చాడు. తమ్మయ సంస్కృతంలో ఉన్న ‘దివ్యసూరి చరితం’ను అనుసరించి తన ‘వైజయంతి విలాపం’ను రచించాడు. కవి ఈ కావ్యంలో పాత్రలను సహజంగా చిత్రించాడు. అక్కడక్కడ ఔచిత్యాన్ని మించిన శృంగార వర్ణనలున్నాయి. తమ్మయ ‘విశిష్టాద్వైత’ మతాన్ని అనుసరించినవాడు కాబట్టి
అక్కడక్కడా వైష్ణవ సంప్రదాయాలను వర్ణించాడు.
కు
తుబ్షాహీల కాలంలోని వాడే భక్త రామదాసు. రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న (క్రీ.శ.1620- 80). అక్కన్న, మాదన్నలు అతని మేనమామలు. గోల్కొండ రాజుల్లో చివరివాడైన అబుల్ హసన్ తానీషా (క్రీ.శ. 1672-1686) దగ్గర వారు మంత్రులుగా ఉన్నారు. వాళ్ల ప్రభావంతోనే గోపన్న భద్రాచలం తహశీల్దార్గా నియమింపబడ్డాడు అంటారు. గోపన్న బాల్యం నుంచే రామభక్తుడు. భట్టరాచార్యులు అతని గురువు.
రానురాను అతనికి రామభక్తి ఇనుమడించి రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. భక్తి, భగవత్ కైంకర్యం, అతిథి పూజలతో అతని ఆస్తి కరిగిపోయింది.
అది పోగా సర్కారు ఖజానా నుంచి డబ్బు తీసుకొని ఖర్చుచేశాడు.
భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయం కట్టించడమేగాక శ్రీరామునికి, సీతకు బంగారు నగలు చేయించి అలంకరించాడు. ఖజానా డబ్బు ఖర్చు కావడంతో రాజు తానీషా కోపగించి రామదాసును జైల్లో బంధించాడు. రామదాసు జైలులో ఉన్నప్పుడే భక్తి పారవశ్యంతో ఎన్నో కీర్తనలను రాశాడు. అతని భక్తికి మెచ్చి రామలక్ష్మణులు స్వయంగా వచ్చి సుల్తానుకు డబ్బు చెల్లించి రామదాసును విడిపించారని, రామదాసు భక్తి మహిమను తెలుసుకొని, అతడిని బంధించినందుకు రాజు పశ్చాత్తాపపడినాడని ఐతిహ్యం. అసలైతే గోల్కొండను ఔరంగజేబు ఆక్రమించుకున్నప్పుడు జైలులో ఉన్న బందీలను విడిచిపెట్టాడని అందు లో రామదాసు కూడా ఉన్నాడని చరిత్రకారుల అభిప్రాయం.
రామదాసు పన్నెండేండ్లు జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో రామున్ని భక్తితో తనను రక్షించమని అడుగుతూ.. ఒక్కొక్కసారి రాముని మీద అలుగుతూ, కోపగిస్తూ, అనునయిస్తూ సరళమైన భాషా భావాలతో కీర్తనలు రాశాడు. నిరాడంబరమైన అతని భావాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి.
రామదాసు తెలుగే కాక నాటి రాజభాష అయిన పారశీ, ఉర్దూ భాషలో కూడా పాండిత్యం సంపాదించాడు. అతడు పండితుడైనా అతని కీర్తనలు
నిత్య వ్యవహార తెలుగు భాషకు దగ్గరగా ఉన్నాయి. రామదాసు మొత్తం ఎన్ని కీర్తనలు రాశాడో చెప్పలేం. అవి నూరో, నూటాయాభయో ఉంటాయని
పండితుల అభిప్రాయం.
ఆయన రాసిన కీర్తనల్లో లభించినవి తక్కువే అయినా, అవి తెలుగు నుడికారంతో సరళమైన భక్తిభావాలతో అలరిస్తూ ఉంటాయి. ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య ఎంతోదూరంలో ఉండి కూడా రామదాసును కీర్తించాడు. దాన్నిబట్టి రామదాసు కీర్తనలు ఎంత ప్రసిద్ధమైనవో తెలుస్తున్నది. తెలంగాణలో ఉన్న రామదాసును త్యాగయ్య ఎన్నోసార్లు స్తుతించాడంటే త్యాగయ్య కుటుంబం తెలంగాణ నుంచే దక్షిణ దేశానికి వలసపోయి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. రామదాసు కీర్తనలనే గాక ‘దాశరథీ కరుణాపయోనిధి భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ..’ అనే మకుటంతో ‘దాశరథి శతకం’ను రచించాడు. ఏటా రామకోటి రాసి భద్రాచలరామునికి అర్పిం చేవాడట. ‘దాశరథి శతకం’ భక్తిమయమై సరళమైన శైలిలో సాగింది. చాలా వ్యాప్తిలో ఉన్న భక్తి శతకం ఇది. రామదాసు కీర్తనల్లోగానీ, శతకంలోగానీ.. ఆర్తి, శరణాగతి, దాస్యభక్తి కనిపిస్తాయి. అతని రచనల్లో భావ తీవ్రత కనిపిస్తుంది. అందుకే నేటికిని అతని కీర్తనలు, శతక పద్యాలు ప్రజల నాలుకలపై ఉన్నాయి.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606