తెలుగు సాహిత్యం బృహత్కథ, గాథాసప్తశతిలతో ప్రారంభమై, దాదాపు రెండు వేల ఏండ్ల చరిత్రతో అఖండ గోదారిలా సాగిపోతున్నది. సంస్కృతాధిపత్యంలోంచి సాహిత్యాన్ని తెలుగు మార్గం వైపు మళ్లించడంలో ఒక ఆరంభాన్ని పలికినవారు నన్నయ్య. దేశీ భాషలో దేశీయులే పాత్రధారులుగా, అతి సామాన్యులను కథానాయకులుగా, సాహిత్య సృష్టి చేసి, సాహిత్యాన్ని జనమార్గం పట్టించినవాడు పాల్కుర్కి సోమనాథుడు. అల్పాక్షరాలతో అనల్పార్థ రచన కావించి తుమ్మెద పదాలు, ‘ఆనంద పదాలు’, ‘గొచ్చిపదాలు’, ‘వెన్నెల పదాల్లాంటి దేశీరీతులను వెలుగులోకి తెచ్చాడు పాల్కుర్కి సోమనాథుడు.
‘ద్విపద’ కవితా రూపానికి రూపశిల్పి సోమనాథుడు. ఈయన ప్రారంభించిన శతక పద్యరూపాన్ని పోతన, వేమనలు సమర్థవంతంగా పోషించారు. పద్యాలు కూడా లఘు కవితా రూపాలే! అయితే ఇవి చంధోబద్ధంగా, గ్రాంథిక భాషలో ఉండటం వల్ల సామాన్యుడి గ్రాహ్యానికి అందడం కొంత కష్టంగా ఉం డేది. పోతనామాత్యుడి దగ్గరకొచ్చేసరికి పద్య భాష కొంత సరళత్వం పొందింది.
‘చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేవి
దయయు సత్యంబు లోనుగా తలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపుచేటు’..
ఇలా ఈ పద్యంలోని భావం తేలికగా అర్థమయ్యే విధంగా రాశారు పోతనామాత్యుడు. ఇలా గాథా సప్తశతి గాథల నుంచి, పద్యరూపం మీదుగా కవిత్వం, వచనరూపం సంతరించుకున్నది. ఆధునిక భావోద్యమానికి పద్యం సరైన రూపం కాదని, కుందుర్తి వచన కవితను ప్రచారం చేసి ఒక ఉద్యమం నడిపించాడు. ఈ వచన కవితా రూపమే, అభ్యుదయ, స్త్రీవాద, విప్లవ, దళిత, ఉద్యమ కవిత్వంగా రూపొందింది.
వచన కవిత్వం ప్రాంతీయ, అస్తిత్వవాద ఉద్యమా న్ని ప్రతిబింబిస్తూ ‘దీర్ఘ కవిత’గా ఆవిర్భవించింది. ఈ దీర్ఘకవితలో ఒకే వస్తువు విషయం 30-40 పేజీల వరకు సాగుతుంది. ఈ దీర్ఘకవిత మరీ దీర్ఘమై, కొంత కాలానికి స్తబ్ధత ఆవరించింది. ఆ సమయంలో కవిత్వం మినీ కవితారూపం ధరించింది. మినీ కవితల్లో సామాజికత, ప్రధానంగా రూపుదిద్దుకుంటుంది. ఈ రూపం బహుళ ప్రాచుర్యం పొంది, అనేక మంది కవులు మినీ కవితా సంపుటాలు వెలువరించారు.
‘సిసింద్రీలు’ అనే మినీ కవితా సంకలనం వెలువరించిన రాజ్యశ్రీ కవిత్వంలో ఒక కవిత…
‘నువ్వు నడిచే దారిలో
ఎన్నో పిచ్చిమొక్కలు
వాటిని తొక్కకుండా
పక్కకి జరిగి పలకరించి చూడు పాదాలను ముద్దు పెట్టుకుంటాయి తలలు వంచి నమస్కరిస్తాయి’
ఈ మినీ కవితా రూపం ఒక ప్రభంజనంలా కవితా లోకాన్ని ఊపేసింది. ఇలా ఎంతోమంది కవులు మినీ కవితా పుస్తకాలు వెలువరించారు.
ఇక్కడి నుంచి మినీ కవిత, లఘు కవితారూపం సంతరించుకొని, వివిధ రూపాలు ధరిస్తూ, ప్రపంచ పదులు, గజళ్లు. హైకూలు, నానీలు, రెక్కలు, చుక్క లు, ముక్తకాలు, మెరుపులు ఇంకా అనేక రూపాలతో విస్తరిస్తూ, సాహితీ ప్రియులను అలరిస్తున్నది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ‘ప్రపంచ పదులు’ అనే కొత్త కవితా రూపాన్ని ఆవిష్కరించారు. జపాన్ నుంచి వచ్చిన హైకూలు ఎంతోమంది కవులను ఆకర్షించాయి.
‘అరటి చెట్టు తొలకరి కోసం పంట పొలాలు
అతిథుల కోసమే చకోర పక్షుల్లాగా తలలూ ఊపుతయి
‘ఆకులేసింది’ ‘అన్నదాతలు’. ‘చిరుగాలికి’
ఇలా ఎందరో ఆధునిక కవులు హైకూలు రాసి, పుస్తకాలు వెలువరించారు.
అలాగే మరో లఘు కవితా ప్రక్రియ గజళ్ళు. 1966 ప్రాంతంలో దాశరథి కృష్ణమాచార్యులు తెలు గు గజళ్ల రచనకు శ్రీకారం చుట్టి 11 గజళ్లు రాశారు.
‘రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచిరానా
నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు దాటి రానా’
‘పగబూని కరకు వారు బంధించి ఉంచినారు
ఏనాటికైనగానీ ఈ గోడ పొడచిరానా!!’
ఈ గజళ్ళు మొట్టమొదటి తెలుగు గజళ్ళుగా భావించవచ్చని డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యులు ‘దాశర థి రుబాయిలు-గజళ్ళు’ అన్న గ్రంథంలో పేర్కొన్నారు. దాశరథి గజళ్లలో చంధో వైవిధ్యం కనిపిస్తుంది.
డాక్టర్ పోతుకూచి సాంబశివ
‘చుక్కలు’ అనే లఘు కవితా
ప్రక్రియకు రూపశిల్పులు.
డాక్టర్ పోతుకూచి చుక్కల ప్రక్రియలో రాసిన పుస్తకాల నుంచి మచ్చుకు ఒకటి.
‘చుక్క చుక్క రాల
చెరువయ్యే
చెరువులాక్రమించె నేతలు
వారు పీతలైరి నల్లధనం
బొరియల్లో
కలికాలం సర్వత్రా
కనకం కోరికలే’
లఘు కవితారూపాల్లో ముక్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ ముక్తకాల ప్రక్రియలో భావస్ఫోరకంగా నిరంతరం సాహిత్య సృష్టి చేస్తున్నవారెందరో ఉన్నా రు. కవిత్వాన్ని పరిపుష్ఠం చేసినవారిలో స్వర్గీయ తిరునగరి, డాక్టర్ కె.రాజ్యశ్రీ మొదలైన వారున్నారు.
తిరునగరి ఆలోచింపజేసే ముక్తకాల్లో ఇలా!
‘తెలుగు విద్యార్థికి
సంస్కృతం ఐచ్ఛికం
తెలుగెందుకు తీసుకోలేదంటే
మార్కులు రావని సమాధానం’.
లఘు కవితా రూపాలలో ‘రెక్కల’ ప్రక్రియ ఒకటి. ఈ ప్రక్రియ రూపశిల్పి ప్రముఖ కవి స్వర్గీయ యం.కె. సుగమాబాబు. శతాధిక గ్రంథాలు రెక్కల ప్రక్రియలో వచ్చి సాహితీలోకాన్ని విశేషంగా ఆకర్షించాయి.
బుద్ధుని ఆలోచనా ధారకు ఆలంబనమైన ‘ధమ్మపదం’, భగవానుని బోధన భగవద్గీత రెక్కల్లో ‘గీతామృతం’గా, చాణక్య నీతి, గీతాంజలి మొదలైన వందకు పైగా పుస్తకాలు రెక్కల ప్రక్రియలో కొన్ని మచ్చుతునకలు.
కొన్ని రెక్కలు:
బాహ్య ప్రపంచం అప్పటిదాకా నీ కిటికీ ఎదుట
చాలా చిన్నది అది చిత్రాన్నం పువ్వులతో
అంతుపట్టనిది నివేదన కాగానే తుమ్మెదల
అంతరంగం అయింది ప్రసాదం సయ్యాట
తర్వాత బహుళ ప్రచారం పొంది అనేకమందిని కవులుగా మార్చిన ఆధునిక లఘు ప్రక్రియ: ‘నానీ లు’. ఈ నానీలు ప్రక్రియకు రూపశిల్పి డాక్టర్ ఎన్. గోపీ. ఆయన మాటల్లో నానీలంటే నావీ, నీవీ వెరసి మనవి అని అర్థం.
భావగర్భితమైన గోపీ నానీ:
కుండ ముక్కలైందా/ కుమిలిపోకు
మట్టి మరో రూపం కోసం/ సిద్ధమౌతుంది.
దాస్యం సేనాధిపతి నానీ,
పూలదండను చూసి/ మురిసింది మేక
కాసేపట్లో/ చివరి కేక…
తెలుగు గజళ్లు ప్రక్రియను డాక్టర్ సి. నారాయణరెడ్డి విశ్వవిఖ్యాతం చేశారు.
1986లో ‘తెలుగు గజళ్లు’, 1995లో ‘సినారె గజళ్లు’ అనే పుస్తకాలు ప్రచురితమైనాయి.
‘ఎదురుగా క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం; కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం’ అదృశ్య శక్తులు జీవిత గతులను అవరోధిస్తుంటే కాలాన్ని జయించాలని సినారె ‘కలానికి దాహం’ ఇటువంటి అద్భుత కవిత్వం సినారె గజల్స్లో ఆస్వాదించవచ్చు.
రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న లఘు కవితా ప్రక్రియలలో ‘మెరుపులు’ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రక్రియ రూపశిల్పి డాక్టర్ కె.రాజ్యశ్రీ.
సముద్ర మథనంలోంచి/ అమృతం
మేధోమథనంలోంచి/ కవిత్వం
సృజన లోంచే/ ఆలోచనామృతం
అలాగే లఘురూప కవిత్వానికి కొత్తగా ‘అణువులు’, ‘విస్మయాలు’ అనే ప్రక్రియలకు నూతక్కి రాఘవేంద్రరావు, ‘రవ్వులు’ అనే లఘు కవితా రూపానికి విశ్వేశ్వర వర్మ భూపతిరాజు శ్రీకారం చుట్టి పుస్తకాలు వెలువరించారు.
ఇలా ఆధునిక కవిత్వ ప్రక్రియలైన ముక్తకాలు, గజళ్లు, హైకూలు, చుక్కలు, రెక్కలు, నానీలు, వ్యంజకాలు, మెరుపులు, రవ్వలు, విస్మయాలు మొదలైన లఘు కవితా రూపాలు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేస్తూ, ఎంతోమందిని కవిత్వం వైపు ఆకర్షితులను చేస్తున్నా యి. కొద్ది పాదాలలో, హిమాలయ పర్వతంలాంటి భావాన్ని మడిచి పెట్టడమనేది గొప్ప ప్రతిభ. అందుకే ఆధునిక కవితా ప్రక్రియలు బహుళ ప్రజాదరణ పొందుతున్నాయి. సాహితీ సరస్వతిని సుసంపన్నం చేస్తున్నాయి.
-డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ
85001 21990