పదిహేనవ శతాబ్దం నుంచి ఐదు వందల ఏండ్లపాటు తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన సంస్థానం దోమకొండ సంస్థానం. ఈ సంస్థానం రాజధాని రథాల రామారెడ్డి పేటలో సంస్థానాధీశుడైన రాజన్నచౌదరి (1715-1765) ఆశ్రయంలో సంస్థానకవిగా విరాజిల్లిన రాపాక లక్ష్మీపతి (1750) రచించిన జంటకావ్యాలు ఈ సంస్థాన సాహిత్య వైభవాన్ని చాటడమే కాకుండా, తెలంగాణకు ఖ్యాతిని సంపాదించిపెట్టాయి. ఈ జంట కావ్యాలలో మొదటిది భద్రాయు రభ్యుదయం, రెండవది శ్రీకృష్ణవిలాసం. ఈ రెండు కావ్యాలను రథాల రామారెడ్డిపేటలోని సంస్థాన నిర్మితాలయాలలో కొలువైన శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామికి, శ్రీసీతారామచంద్రస్వామికి అంకితం చేయుమని రాజన్నచౌదరి ఆదేశించగా, లక్ష్మీపతి ఈ రెండు కావ్యాలనూ మనోజ్ఞంగా రచించి, దేవతామూర్తులకు అంకితం చేసి, ప్రభువు ఆజ్ఞను నెరవేర్చాడని చరిత్ర చెబుతున్నది.
భద్రాయురభ్యుదయం ఐదు ఉల్లాసాలతో కూడిన ప్రబంధం. సాధారణంగా ప్రబంధ కవులు కావ్యాలను ఆశ్వాసాల పేర్లతో విభజించడం చూస్తుంటాం. కానీ లక్ష్మీపతికవి ఈ ప్రబంధంలోని భాగాలను ఉల్లాసాల పేరుతో విభజించడం ఒక ప్రత్యేకత. ఐదు ఉల్లాసాలతో కూడిన ఈ ప్రబంధంలోని కథకు మూలం బ్రహ్మాత్మరఖండం.
అచంచల శివభక్తుడైన భద్రాయువు వృత్తాంతం ఈ కావ్యం లో ప్రధానంగా కబడుతుంది . ఈ కావ్య ప్రారంభంలో ఈ కవి తాను వేదాంతపరమైన అపరోక్షానుభూతికి ఆలవాలమైన ‘ఆచార్య విజయం’ అనే కావ్యాన్ని, జగజ్జన్మకు కారణమైన ’శ్రీమదుపాఖ్యానం’ అనే కావ్యాన్నీ, లలితలలిత పదాలతో చక్కగా అలంకార కల్పనలతో ‘నీళావివాహం’ అనే కావ్యాన్నీ, అంతకు ముందే రాసినట్టు పేర్కొన్నాడు . తన కవిత్వ శక్తిని గూర్చి ‘నవీన జవనకవన ప్రభావనభాషా విశేషునిగా’ చెప్పుకొన్నాడు. ఈ గుణాలకు తగినట్లే లక్ష్మీపతి కవితా వైభవం భద్రాయురభ్యుదయంలో దర్శనమిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాజరాజేశ్వరుణ్ణి స్తుతి స్తూ, లక్ష్మీపతి అల్లిన ఈ అనులోమ విలోమ పద్యం అద్భుతంగా కనబడుతుంది.
‘రాదసారస గోసార సమానానఘకాశికా
కాశికా ఘననామాసరసా గోసరసాదరా ’
సంస్థాన రాజధాని రథాల రామారెడ్డిపేటను వర్ణించే
ఈ పద్యం ఎంత అందంగా ఉందో చూడండి ’
‘తతదరీ చ్యుతఝరీ హితకరీ స్తుతతరీ
గతచరీ తతవరీ వృతధరములు
నతివేల రుతి శీల గతిలోల రతిపాల
హితఖేలదతినీల ధృతిమదలలు’
తనకు ఆశ్రయమిచ్చిన రాజన్నచౌదరి సాహితీ
పిపాస ఎలాంటిదో ఈ పద్యంలో లక్ష్మీపతి ఎంత మనోజ్ఞంగా చెప్పాడో చూడండి –
‘సామాన్యాజ్ఞ, గవీశ్వరుల్ సభకురా షడ్దర్శనీసీమ గోష్ఠీమాధుర్యరసోక్తులంగరపి హర్షింపన్ బ్రవర్తించుచున్ సోమార్కానల విద్యుదుద్ధత కళాస్ఫూర్తి, స్వరూపంబు తా
నై మాహేశ్వర పాదపంకజ సపర్యన్ జెందు నందంబుగా’
రెండవ ప్రబంధం అయిన శ్రీకృష్ణవిలాసం కూడా ఐదు ఉల్లాసాలతో అలరారుతున్నది. ఇందులో ప్రథమోల్లాసం అంతా ఈ సంస్థానానికి మూలమైన కామినేని వంశ చరిత్ర విపులంగా ఉంది. మిగిలిన నాలుగు ఉల్లాసాలలో రుక్మిణీ పరిణయం, సత్యాపరిణయం, కాళిందీ పరిణయం, నరకాసురవధ వంటి వృత్తాంతాలు మనోహర రీతిలో ఉన్నాయి. ఈ ప్రబంధంలోని శైలి ప్రాచీన ప్రబంధాలలోని శైలిని తలపింపజేస్తుంది. శ్రీకృష్ణవిలాసం చతుర్థోల్లాసంలోని ‘చంద్రవర్ణన’ లో తేట తెలుగు పదాల సొంపు ఆస్వాదించవలసిందే ! –
‘గుంపు చీకటి సొంపు సంపాదనము జేయు
తురుముపై చక్కని మెరుగులీను
తొలిదోచులేత చేతులడాలు తళుకొత్తు
మొగలిరేకుల పువ్వులుగ ధరించి
యరుతను పరవుతా కరముల సరములు
గా జేసి మిక్కిలి కళల వెలసి
వెన్నెల లేనవ్వు వన్నె గన్పట్టంగ
ఈ విధంగా ఈ జంట కావ్యాలు తెలంగాణ సాహితీ
జగత్తులో సూర్యచంద్రులవలె వెలుగొందుతున్నాయి.
-డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
94404 68557