కపిలవాయి లింగమూర్తి జయంతి సందర్భంగా
నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం చేయించుకున్న ఏకైక సుప్రసిద్ధ కవి, పండితుడు, జ్యోతిష్కుడు, చరిత్రకారుడు, ఉపాధ్యాయుడు కపిలవాయి లింగమూర్తి. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో లింగమూర్తి నిష్ణాతుడిగా ప్రసిద్ధి చెందారు. ఉన్నత ప్రమాణాలను పాటించడంలో, వాస్తవిక ప్రదర్శనను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. సాహిత్యానికి ఎనలేని సేవ చేయడమే కాకుండా, అనేక ప్రాచీన తాళపత్ర శాసన రచనలను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేశారు. ప్రాచీన తెలుగు సాహిత్యం, భాష నుంచి సంస్కృతీ నిర్దిష్ట పదాలు, మాండలికాలను సేకరించి వాటి అర్థాన్ని, వాటి వాడుకను వివరించారాయన. ఈ సంకలనం తెలంగాణ భాషకు కపిలవాయి ప్రసాదించిన నిజమైన వరం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తి కపిలవాయి లింగమూర్తి.
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా (పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం) జినుకుంటలో 1928 మార్చి 31న మాణిక్యమ్మ, కపిలవాయి వెంకటాచలం దంపతులకు లింగమూర్తి జన్మించారు. తన మేనమామ చేవూరి లక్ష్మయ్య పాండిత్యాన్ని చూసి ప్రేరణ పొంది, చిన్నతనం నుంచే ఆయనతో సంభాషించడం ద్వారా శాస్త్ర-చారిత్రక పరిజ్ఞానం, జ్యోతిష నైపుణ్యం, సంస్కృతం-తెలుగు నిఘంటువులపై పట్టు, సాహిత్యంపై అపారమైన ప్రేమను లింగమూర్తి సంపాదించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (తెలుగు సాహిత్యం)లో ఆయన పట్టభద్రుడయ్యారు. 1954లో నాగర్కర్నూల్లోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి, ఆ తర్వాత ఎంఓఎల్ (మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్)లో శిక్షణ పొంది పాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో 1972లో హిస్టరీ లెక్చరర్గా చేరారు. 1983 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. సాహితీవేత్త డాక్టర్ లింగమూర్తి తెలుగు కవిత్వం, తెలుగు గద్యం రెండింటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు. తెలుగు సాహిత్యంలో 100కు పైగా పుస్తకాలు రాశారు.
పాలమూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు చరిత్రాత్మకతకు ప్రసిద్ధి. మహాక్షేత్రం మామిళ్లపల్లి, భైరవకోన మహత్యం, సోమేశ్వర క్షేత్ర మహత్యం మొదలైన రచనల ద్వారా లింగమూర్తి తమ ప్రాంత ప్రాముఖ్యతను తెలియజెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో కొందరు మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలు కూడా రాశారు. సాహిత్య సంపుటిలో ఎంతో అభివృద్ధి చెందిన అవగాహన, చరిత్ర పరిజ్ఞానం, పరిశోధన దృక్పథంతో లింగమూర్తి రాసిన నవలలు అనేకం ఉన్నాయి. ‘ఉప్పునూతల కథ’ అనే నవల ఉప్పునూతల గ్రామ చరిత్ర, అక్కడి
ప్రసిద్ధ కేదారేశ్వర ఆలయం చుట్టూ తిరుగుతుంది. యాత్రా కథనంలా సాగే ఈ నవల హిమాలయాల్లోని కేదారేశ్వరానికి కూడా తీసుకెళ్లి అక్కడి సంస్కృతిని చిత్రిస్తుంది. ఆయన రాసిన గోదాదేవి కథ, మూడుతరాల ముచ్చట, నాగమణి, ఆవంచ తదితర నవలలు.. చరిత్ర, మతం, ఆధ్యాత్మికతల వాస్తవిక బలంతో రూపొందినవి. అందువల్ల అవి ప్రసిద్ధికెక్కాయి.
సమీక్షకుడిగా, వ్యాఖ్యాతగా.. యయాతి చరిత్ర, కావ్యగణపతి అష్టోత్తరం, స్వర్ణ శకలాలు వంటి రచనలకు వివరణాత్మక వ్యాఖ్యానం రాశారాయన. కళ్యాణ తారావళి, రుద్రాధ్యాయం, హనుమత్సహస్రం మొదలైనవి కూడా ఆయన రచనలే. లింగమూర్తి సామాజిక, భక్తి నేపథ్యంలో పదకొండు శతకాలను రచించారు. పాలమూరు జిల్లాలో పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగి సాహిత్యరంగంలో వెలిగిన సాహితీవేత్తలెందరో ఉన్నారు. అలాంటి వారిలో కపిలవాయి లింగమూర్తి ఒకరు. కథారచయితగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, కవిగా, జీవిత చరిత్రకారుడిగా, వ్యాసకర్తగా, సంకీర్తనల స్వరకర్తగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా, వ్యాఖ్యాతగా నిరూపించుకున్న కపిలవాయి లింగమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక విశ్వవిద్యాలయాల సమష్టి కృషితో భారీ పరిశోధన సంస్థను ఆయన రూపొందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఎమ్మెస్కో పబ్లిషర్స్ మొదలైన సంస్థలు లింగమూర్తి రచించిన భారీ సాహిత్య సంకలనాలను ప్రచురించి, ఆయన రచనల ఔన్నత్యాన్ని రుజువు చేశాయి. కపిలవాయి రచించిన 28 విలువైన రచనలు ఇంకా ముద్రణ కావాల్సి ఉంది. పాలమూరు జిల్లాకు చెందిన అనేక సాహితీ సంస్థలకు తన వంతు సహాయ, సహకారాలు అందించారాయన. ఎడిటింగ్తో పాటు రచనలను పరిపూర్ణంగా తీర్చిదిద్దడం ద్వారా చాలా మంది వర్ధమాన రచయితలకు సహాయపడ్డారు. సుమారు 300 పుస్తకాలకు ముందుమాట, సమీక్షలు, విలువైన అభిప్రాయాలు రాశారు.
కవితా కళానిధి, పరిశోధన పంచానన, కవి కేసరి, వేదాంత విశారద, గురు శిరోమణి, సాహిత్య స్వర్ణసౌరభ కేసరి వంటి అనేక బిరుదులను కపిలవాయి లింగమూర్తి పొందారు. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సాహితీ పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరు రుద్రకవి పీఠం పురస్కారం, పాల్కురికి సోమనాథ పీఠం పురస్కారాలను ఆయన అందుకున్నారు.
నాగర్కర్నూల్కు చెందిన వెన్నెల అకాడమీ రూపొందించిన ‘కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి’ డాక్యుమెంటరీ 2011 సంవత్సరానికి గాను రెండో ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికై, ప్రతిష్ఠాత్మక నంది అవార్డును గెలుచుకుంది. సుమారు ఏడు దశాబ్దాల పాటు సాహిత్య రంగానికి కపిలవాయి లింగమూర్తి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2014లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డీలిట్)ను ప్రదానం చేసింది. ఉస్మానియా, మదురై, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్లు పొందారు. లింగమూర్తి సాహిత్య కృషిపై చేసిన రచనల ద్వారా ఆరుగురు పరిశోధక విద్యార్థులు డాక్టరేట్ పట్టాలు పొందారు.
కపిలవాయి లింగమూర్తికి రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆయనను సన్మానించారు. తర్వాత ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆయనను సన్మానించారు.
మాటల ప్రపంచంలో ప్రతి మలుపును, ప్రతి మైలురాయిని ఆస్వాదించే అలుపెరగని యాత్రికుడాయన. వృత్తి, క్రమశిక్షణ, అంకితభావం, దృఢ సంకల్పంతో తన జీవితానికి సంబంధించిన అందమైన రూపును తీర్చిదిద్దుకున్నారు. 70 ఏండ్ల కిందట తన తొలి సాహిత్య ప్రచురణ తర్వాత ఆయన కలాన్ని కిందకు దించలేదు. తెలంగాణ సాహితీ దిగ్గజం కపిలవాయి లింగమూర్తి 2018 నవంబరు 6న కన్నుమూశారు. సాహితీ లోకం మహోన్నత వ్యక్తిని కోల్పోయినా ఆయన అందించిన సాహిత్యం మాత్రం అజరామరం.
తిరుమల తిరుపతి దేవస్థానం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఎమెస్కో పబ్లిషర్స్ మొదలైన సంస్థలు లింగమూర్తి రచించిన భారీ సాహిత్య సంకలనాలను ప్రచురించి, ఆయన రచనల ఔన్నత్యాన్ని రుజువు చేశాయి. కపిలవాయి రచించిన 28 విలువైన రచనలు ఇంకా ముద్రణ కావాల్సి ఉంది. పాలమూరు జిల్లాకు చెందిన అనేక సాహితీ సంస్థలకు తన వంతు సహాయ, సహకారాలు అందించారాయన. ఎడిటింగ్తో పాటు రచనలను పరిపూర్ణంగా తీర్చిదిద్దడం ద్వారా ఆయన చాలా మంది వర్ధమాన రచయితలకు సహాయపడ్డారు. సుమారు 300 పుస్తకాలకు ముందుమాట, సమీక్షలు, విలువైన అభిప్రాయాలు రాశారు.
సాయి లోహిత పులపా