హమ్ నే దేఖీ హై ఉన్ ఆంఖోకి మహకతీ ఖుష్బూహాథ్ సే ఛూకె ఇసే రిష్తో కా ఇల్జామ్ న దోసిర్ఫ్ ఎహసాస్ హై యె రూహ్ సె మహసూస్ కరోప్యార్ కో ప్యార్ హీ రహనే దో కొయీ నామ్ న దో
– ‘ఖామోషీ’ చిత్రంలో గుల్జార్ రాసిన పాట ఇది
(నేను ఆ కండ్లల్లో గుబాళిస్తున్న సుగంధాన్ని చూశాను..దానిని చేతులతో తాకి బంధాల దోషాన్ని అంటగట్టవద్దు..ఇదొక అనుభూతి, ఆత్మతో ఆస్వాదించండి..ప్రేమను ప్రేమగానే ఉండనివ్వండి.. దానికి ఏదో ఒక పేరు పెట్టవద్దు)
గుల్జార్ అంటే అందరికీ హిందీ సినిమాల గేయ రచయితగా, దర్శకునిగా మాత్రమే తెలుసు. కానీ, ఆయన ఉర్దూ, హిందీలో అద్భుతమైన కవిత్వాన్ని రాసిన భావుక కవి. సినీకవిగా, దర్శకునిగా పేరుగాంచినా కవితాయానమే ఆయనకు ఇష్టం. జ్ఞాన్పీఠ్ వచ్చిందని తెలిసిన తర్వాత గుల్జార్ స్పందన కూడా దీనినే తెలియజేస్తున్నది. ‘సినీకవిగా గుర్తించారు కానీ, నా కవిత్వాన్ని కాదు కదా’ అనుకునేవారట ఇన్నాళ్లూ. కానీ, ఇప్పుడు జ్ఞాన్పీఠ్ ఇవ్వడంతో ఉర్దూ కవిత్వం, షాయరీలపై జనం ఆసక్తిగానే ఉన్నారని తెలిసి ఎంతో సంతోషం కలిగిందట ఆయనకు. గుల్జార్కు ఉర్దూ కవిత్వమంటే అంత ఇష్టం. సాహిత్యంలో శిఖరాల మీద నుంచి సినిమా గేయరచనా వ్యాసంగంలోకి దూకినవాడు గుల్జార్.. మన శ్రీశ్రీ, కృష్ణశాస్త్రిలాగా. ఆ ఇద్దరి శైలుల మిశ్రమంలా ఉంటుంది ఆయన పాట. సున్నితమైన భావాలను లలిత లలితమైన పదాలతో, కవితామాధురీ మకరందాలతో ఏర్చికూర్చిన కవి, గేయ రచయిత గుల్జార్.
సంపూరణ్సింగ్ కాల్రా ఎవరో ఎవరికీ తెలియదు. కానీ, గుల్జార్ అనగానే టక్కున ఏదో ఒక పాట గుర్తుకువస్తుంది కొద్దోగొప్పో హిందీ సినిమాలు చూసే తెలుగువాళ్లకు. సంపూరణ్సింగ్ దెబ్బతిన్న కార్లకు డెంటింగ్ చేసిన తర్వాత రంగులద్దేవాడు. ఆ రంగులు భావుకుడైన కవిలో ఏవేవో అక్షరాల అల్లికలకు దారితీసేవి. తండ్రి ఠాట్ ‘ఇదేమిటి బతుకుదెరువు చూసుకోమంటే ఈ కవితలేంటి’ అని గర్జిస్తే గుల్జార్ దీన్వీ వెనుక దాక్కున్నాడీ కవి. ఏతావాతా గుల్జార్ గానే స్థిరపడ్డాడు. గుల్జార్ అంటే ఉర్దూలో పూలతోట అని అర్థం. ఈ తోటలో బాల్యం గంతులు వేస్తుంది. యవ్వనం గొంతు సవరించుకుంటుంది. జీవితం తననుతాను అద్దంలో చూసుకుని మురిసిపోతుంది, ముడుచుకుపోతుంది. పన్నీరవుతుంది. కన్నీరు పెడుతుంది. అన్ని రుతువులూ వస్తూపోతూ దాగుడుమూతలాడే ఈ తోటలో విరబూసిన పాటలెన్నో. అన్నీ సుమ కోమలమైనవే, ద్రుమ శ్యామలమైనవే. కర్కశ జీవన వాస్తవికత ముందు ఓ నిట్టూర్పు ఆయన అక్షరం. సుతిమెత్తని హృదయ స్పందనల ఆవిష్కారం.
ఓవైపు పనిచేసుకుంటూ, మరోవైపు చదువుకుంటూ అంచెలంచెలుగా కవిగా గుర్తింపు తెచ్చుకొని, చివరకు ఆ కాలపు కళా సాంస్కృతిక రంగ మేధావులందరిలాగే ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్లో చేరిపోయారు గుల్జార్. ఉర్దూ, పంజాబీలో ఎక్కువగా రాశారాయన. హిందీ మాండలికాలైన బ్రజ్ భాషా, ఖడీబోలీ, హర్యాణ్వీ, మార్వాడీలోనూ రచనలు చేసిన పాలీగ్లాట్ గుల్జార్. హిందీలో ‘త్రివేణి’గా సుప్రసిద్ధమైన ఛందస్సులో కవితలల్లారు. ‘చాంద్ పుఖ్రాజ్ కా’, ‘రాత్ పశ్మినేకీ’, ‘పంద్రా పాంచ్ పచ్చత్తర్’ అనే మూడు సంపుటాల్లో తన కవితలు వెలువరించారు. ‘రావీ పార్’ అనే కథల సంకలనం కూడా వెలువడింది. ఈ సాహిత్య జీవి కోసం సినిమా ఎదురుచూస్తున్నది. శైలేంద్ర ప్రోత్సాహంతో అటుగా అడుగులు కూడా పడ్డాయి. సినిమాకు సాహితీ సుగంధాలద్దిన బిమల్ రాయ్ సినిమా ‘బందినీ’తో గుల్జార్ పాట మొట్టమొదటిసారిగా తెరకెక్కింది. ‘మొర గోర అంగ్ లయిలే..’ అనే పల్లవితో కూడిన ఆ పాటను ఎస్డీ బర్మన్ స్వరాలలో లత గానం చేశారు.
ఆ పాటతో మొదలైన సినీ ప్రయాణం కాలక్రమంలో రసప్రవాహమైంది. ఆ ప్రవాహంలో మనకు దొరికిన ఆణిముత్యాలెన్నో. అందులో మంచివి ఏరడమంటే పెద్ద పనే. ‘తేరే బినా జిందగీ సే కోయీ శికవా నహీ’ (ఆంధీ), ‘ఆనేవాలా పల్ జానేవాలా హై’ (గోల్మాల్), ‘తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ’ (మాసూమ్), ‘మైనె తెరేలియే హీ సాత్ రంగ్కే సప్నే చునే’ (ఆనంద్), ‘ముసాఫిర్ హూ యారో’ (పరిచయ్), ‘నామ్ గుమ్ జాయెగా’ (కినారా) వంటివి వాటిలో మచ్చుకు కొన్ని. ‘రుడాలీ’ని ఏడిపించాలంటే ‘దిల్ హుం హుం’ అనాల్సిందే. భూపేన్ హజారికా దిగిరావాల్సిందే. స్వరాలు కూర్చి పాడాల్సిందే. భూపిందర్ విలక్షణ స్వరం ‘దిల్ ఢూండ్ తా హై’ అని ‘మౌసం’లో కలవరపడాలన్నా గుల్జార్ కలం ఝుళిపించాల్సిందే. ‘ఘరౌందా’ కోసం ‘దో దివానే షహర్ మే’ తిరుగుతూ అన్వేషణానంద విషాదాల్లో మునిగి తేలాలన్నా గుల్జార్ అక్షరాల అండదండలు లేకుండా సాధ్యపడదు. ‘కాబూలీవాలా’ ఆనందాశ్చర్యాలతో ‘గంగా ఆయి కహాసే’ అని గొణుక్కోవాలన్నా, ‘మాసూమ్’ పిల్లలు ‘లకడి కే కాఠీ, కాఠి కే గోడా’ మీద దౌడు తీయాలన్నా గుల్జార్ అక్షరాలు గుర్రమాట ఆడాల్సిందే. అంతెందుకు రెహ్మాన్కు ‘జయహో’ అంటూ ‘ఆస్కార’మిచ్చిందీ తనే. తోడుగా అందుకున్నదీ తనే.
కవితాత్మకమైన పాటలే కాదు, ఎన్నెన్నో మంచిమంచి సినిమాలకు మాటలూ అందించారు గుల్జార్. దర్శకుడిగా ఆణిముత్యాల్లాంటి సినిమాలూ తీశారు. ‘కోశిష్’, ‘ఆంధీ’, ‘నమ్కీన్’, ‘అంగూర్’, ‘పరిచయ్’, ‘ఖుష్బూ’, ‘కినారా’, ‘అచానక్’, ‘లెకిన్’ వాటిలో మచ్చుకు కొన్ని. ఇక మీరా అదో చరిత్ర. హేమామాలిని మీరాగా నటిస్తే మీరా భజనలన్నీ దక్షిణాది గాయని వాణీ జయరాం పాడటం విశేషం. లత పాడాలనుకుని పాడలేకపోయిన పాటలవి. స్వరాలు సమకూర్చింది సితార్ మేస్ట్రో పండిట్ రవిశంకర్.
గుల్జార్ అందుకున్న అవార్డులకు ఓ విశేషముంది. జాతీయ ఉత్తమ గేయ రచయిత నుంచి ఆస్కార్ దాకా ఉన్న అవార్డులన్నీ ఆయనకు దక్కాయి. అన్నిటికి మించి సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను ఆయన ఎప్పుడో అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ్ వరించింది. ఈ రెండూ అందుకున్న వ్యక్తులు ఎవరూ లేరు. ఇక ‘స్లమ్డాగ్ మిలియనీర్’ సినిమాకు ‘జయహో’ పాటతో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో అందుకున్న ఆస్కార్నూ దీనికి కలిపితే ఇది అసాధ్యమైన కలయికే. ఆయన సృజనాత్మక అక్షరయానంలో ఇదొక ‘త్రివేణి’ సంగమం.
-తుమ్మలపల్లి రఘురాములు
91827 77750