పశ్చిమ చాళుక్య రాజులు వారి పాలనా కాలంలో తెలంగాణలో ఎన్నో ఆలయాలకు, బ్రాహ్మణులకు భూరి దానాలు చేశారు. ఈ వివరాలను చెప్పే శాసనం ఒకటి సిరికొండలో ఉన్నది. సిరికొండ సూర్యాపేట జిల్లా ఖమ్మం వెళ్లే మార్గంలో ఉన్నది. శాసనం ప్రతాప చక్రవర్తి రెండవ జగదేకమల్లుడి పాలనాకాలంలో వేయించబడింది. శాసనకాలం శ.సం. 1070= క్రీ.శ.1149, విభవ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి.
శ్రీచాళుక్య ప్రతాప చక్రవర్తి జగదేక మల్లదేవుడు అఖిల లోక ప్రదంబై రాజ్యం చేస్తుండ గా.. కోడూరు పురవరాధీశ్వరుడు, సూర్యవంశోద్భవ కులతిలకుడైన శ్రీమన్మహా మండలేశ్వరుడు కోడూరి ఒదయన చోడ మహారాజుల మహామాండలికుడైన కేతయ కొండపల్లినాడును శాసనబద్ధంగా పొంది పరిపాలన చేస్తున్నా డు. కేతయ తన తండ్రి జువ్వ నాయకుని పేర గుడులను, అందులో దేవుళ్ళను ఎత్తించి ఆ దేవతల అర్చనాదులకు ధారాపూర్వకంగా అనేక భూములను దానం చేసి శాసనం వేయించాడు.
ఈ శాసనంలో కేతయ .. ‘శ్రీ వేంగి దశ పర మండళ చూఱకాఱ, కాంచీపుర రక్షక, కడువాయి పరఘోషణ, ఖట్వంగ ధ్వజ, మహా వృషభ లాంచ్చన, భారద్వాజస గోత్ర, పల్లవ కుల తిలక పాదాంబుజ సేవిత, గొడ్లుర్పురవరాధీశ్వర, కామకుల కుముదినీ ముఖచంద్ర మన్య దేవేంద్ర, బంధు జనాశ్రయ శరణాగత వజ్రపంజర, చెన్నమన్నియ, బ్రహ్మరాక్షస దుష్టాశ్వమల్ల తురగ రేవంత, శాసనపతి, దేవగురు ద్విజ భక్తులు, నూరు మరజముం డు’ అని ప్రశంసించబడ్డాడు.
కేతయ తన తండ్రి జువ్వనాయకునకు ధర్మంగా ఎత్తించిన గుడులు, దేవరల అర్చనలకు ధారా పూర్వకంగా పర్వతం మీది జువ్వేశ్వర దేవునితో కూడిన పంచ లింగాలకు సిరికొండ తూర్పు భాగంలో 15 పుట్లు పండే భూమిని సమర్పించాడు. అదేవిధంగా భీమేశ్వర దేవరకు, నారాయణ దేవర కు, సుంకముగా భండికి తూమెడు ధాన్యం, భండికి యాబై పోకలు, ఆకు మోపునకు యాబై ఆకులు, నైవేద్యానికి, అఖండ దీపానికి దానం చేశాడు.
కేదార దేవునికి మూడు పుట్లు పండే భూమి, పర్వతం పశ్చిమ దిశలో కేదార దేవునికి పుట్టెడు పండే భూమి, పర్వ తం ఉత్తరంలో సూరసముద్రం కింద మర్తురు,జినదేవుడికి నిరుపుట్టి, బ్రాహ్మ లకు 20 పుట్లు, సంకనికి పుట్టి, పర్వతానికి వాయువ్యాన కేత సముద్రం వెనక పర్వతం మీది పంచలింగాలకు మూడు మర్తుర్లు, భీమేశ్వర దేవునికి రెండు మర్తుర్లు, కేదార దేవునికి రెండు మర్తు ర్లు, జినదేవునికి రెండు మర్తుర్లు, బ్రాహ్మలకు పది మర్తుర్లు ఇచ్చాడు.
సూర సముద్రం, నామ సముద్రం, భీమ సముద్రం అనే మూడు చెరువులు పేర్కొనబడ్డాయి. ఒకే వ్యక్తి ఇన్ని దానా లు చేయడం విశేషంగా చెప్పవచ్చు. శాసనంలో సాధారణంగా ఉండే శాపోక్తులతో పాటు ధర్మం తప్పితే తల్లి, తం డ్రి, బ్రాహ్మణులను ఘోరంగా చంపిన పాపాన్ని పొందుతారని చెప్పబడింది.
– భిన్నూరి మనోహరి