సాహిత్యంలో ఏ రచన అయినా పాఠకుడు మానసికంగా అనుభూతి పొందక పోతే అది వ్యర్థమే. అది కవిత్వమైతే మరింత క్లిష్టతరమవుతుంది. కవులు/రచయితలు కూడా నాలుగు కాలాల పాటు మనగలగాలనుకుంటే ఖచ్చితంగా పాఠకుడి మనసును చదివి అలరించే రచన చేయాల్సిందే. అయితే ఈ వాదనను చాలామంది సాహిత్యకారులు/కవులు ఒప్పుకోక పోవచ్చు ఎందుకంటే కవిత్వం /కథ రాసేది తమ మానసిక ఆనందం కోసమే, అది అర్థం చేసుకొనేవాళ్ళు ఉంటే చాలనుకునేవారు కూడా ఉన్నారు. క్లిష్టమైన రచనను అర్థం చేసుకునే వారే నిజమైన పాఠకులు అవుతారు.
నిజమైన పాఠకుడు అని ఎవరిని సంబోధించవచ్చు? నేటి బిజీ ప్రపంచంలో, చాలా మందికి చదవడానికి సమయం కేటాయించడం కష్టం. కాబట్టి, నిజమైన పాఠకులు దీన్ని ఎలా చేస్తారు? నిజమైన పాఠకులు ఎక్కువ సమయాన్ని చదవడానికి ఎంచుకుంటారు. ఒక పుస్తక పాఠకుడు చనిపోయేలోపు వెయ్యి జీవితాలను గడుపుతాడు, ఎప్పుడూ చదువని మనిషి ఒక్కటే జీవితాన్ని గడుపుతాడు.
ఒక పాఠకుడు కథ/నవలకు కనెక్ట్ అయినంతగా త్వరగా కవిత్వానికి కనెక్ట్ కాలేడు. కారణం ఏంటంటే చాలావరకు కవిత్వపు పరిభాష తెలియకపోవడం మొదటి కారణమైతే, రెండవది సంక్లిష్టత కావొచ్చు. పాఠకుడు దేనివైపు ఉండాలనేది వ్యక్తిగత ఎంపిక. అభ్యుదయ, విప్లవ, భావా, పద్య, కాల్పనిక ఇలా కవిత్వపు రకా ల్లో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. కవిత్వానికి దగ్గర కావాలంటే ఖచ్చితంగా వాటిపై అవగాహన ఉండాలి. అప్పుడు కానీ కవిత్వా న్ని అర్థ్ధం చేసుకోలేడు. కొంచెం పాతకాలంలోకి వెళ్తే సాధారణ పాఠకుడు కూడా అద్భుతమైన కవిత్వాన్ని ఆస్వాదించాడు. అయితే అది కూడా ఒక స్థాయి సాహిత్య పరిచయమున్న పాఠకుడిని మాత్రమే అలరించేవి. మరీ సంక్లిష్ట కవిత్వాన్ని మాత్రం కవితా పరిభాష తెలిసిన వాళ్ళు మాత్రమే ఆస్వాదించేవారు.
రచన ఏదైనా దాని ప్రధాన లక్ష్యం పాఠకుడిని అలరించడమే. భిన్న సంఘటనల్ని వస్తువులుగా స్వీకరించి రచయిత తన రచనను జనరంజకంగా తయారు చేస్తారు. అయితే చదవటం మొదలుపెట్టి చివరిదాకా చదివించే గుణం ఉన్నదే ఉత్తమ రచన.
కవి నిత్యం జరిగే సంఘటనలు/వాస్తవికత దృక్పథంతో సమస్యకు పరిష్కారం చూపుతాడు. అయితే సమాజపు నవీన పోకడ లు, సమస్యలను కవిత్వంగా మలచడంలో ఒక్కోకవి ఒక్కోరకంగా స్పందిస్తాడు. తాను ఎంచుకున్న వస్తువును వివిధ అలంకారిక సాధనాలతో కవితగా మలుస్తాడు. అది పాఠకుడికి చేరేలా చేయడంలో సఫలమవుతాడు. కానీ అది పాఠకుడిని అలరించాలంటే అర్థమవ్వాలి. అర్థం కానీ ఏ కావ్యమైనా పక్కన పడేసి ముందుకు వెళ్లిపోయే సౌలభ్యం పాఠకుడికి ఉన్నది.
కుందుర్తి తాను నిర్దేశించిన అభిప్రాయాలకనుగుణంగానే, తన కవిత్వమంతటినీ రాశాడు. ప్రజా సంబంధమైనవస్తువు, భావన, భాష, అలంకారం – ఇవన్నీ ఆయనను సంపూర్ణ ప్రజాకవిగా మలిచాయి. ఉదాహరణకి ‘నగరంలో వాన’ నుంచి కొన్ని పంక్తులు.
‘నగరంలో వాన
కవిత్వం నా ఊహాంచుల్లో కదలాడినట్లు
జల్లులు జల్లులై కురుస్తోంది
ఆశుకవితతో నగర ప్రజలకు
ఆశీస్సులు పలుకుతున్నట్లు’
చూడండి ఎంత సరళత ఉన్నదో. కుందుర్తి కవిత్వంలో సరళతతోపాటు లోతు ఉన్నది. వైవి ధ్యం వస్తురూపాల్లో ఉన్నది. అన్నీ వెరసి అద్భు త భావాత్మక లయ శిల్పంతో తనదైన శైలిలో కొనసాగుతుంది. వస్తువులో ప్రాకృతిక, వైయుక్తిక, నగర సంక్లిష్టత, ట్రావెలోగ్, ఎలిజీ లాంటివి అనేకం ఉన్నా యి. ఇలాంటి కవితల్లో సందర్భం ఏమిటన్నది ఇట్టే తెలిసి పోతుం ది. శ్రీ శ్రీ కవితలు కూడా సూటిగా పాఠకుల మనస్సులోకి వెళ్లాయంటే సరళత/సామాన్య భాషా/వాడుక పదాలు అని చెప్పొ చ్చు. అలాగే ఆరుద్ర కూడా ‘కూనలమ్మ పదాలు’ పేరుతో విశేషమైన పేరు సంపాదించారు. అదే విధంగా, మినీ కవిత్వంతో అలిశెట్టి ప్రభాకర్ అలరించారు. కొద్ది పదాల్లోనే అద్భుతమైన భావాన్ని వెలువరించి జనాల్లో ముఖ్యంగా పాఠకుల మనసులో చెరగని ముద్ర వేసిన వీరు ఎప్పటికీ గుర్తుంటారు.
కవిత్వంలో భాష అనుభూతుల్ని ప్రభావితం చేస్తుందని రిచర్డ్ అభిప్రాయం. అందుకే కవి తాను రాసే కవిత్వంలో పాఠకుడి మనసును హత్తుకునేలా అనుభూతుల్ని స్పృశించగలిగితే తప్పకుండ విజయం సాధిస్తాడు. పూర్వ కాలపు కవుల రచనలు ఇప్పటికీ చదు వటానికి, చదివించటానికి గల కారణాలు అవే. ఇప్పటి నవతరం కవులు ఎక్కువగా అనుభూతి వాద కవిత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే కవిత్వం ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ను చక్కగా తమ కవితల్లో ఉండేలా చూసుకుంటున్నారు.
కళారూపంలో అనుభూతులు వ్యక్తం చేయటానికి ఒకే ఒక మార్గం బాహ్యంశాన్ని కనిపెట్టడమే. ఇంకొక రకంగా చెప్పాలంటే కొన్ని వస్తువులు గాని, ఒక సన్నివేశం గాని, కొన్ని సంఘటనల సమాహారం గాని, ఒకానొక నిర్దిష్టమైన అనుభూతికి సూత్రం అవ్వాలి. అంటే బాహ్య వాస్తవాలు చెప్పగానే వెంటనే అనుభూతి పుట్టుకు రావాలి. సంబంధిత బాహ్యంశం అంటే కవి అనుభవించి వ్యక్తపరిచే అనుభూతిని సమానంగా పాఠకుడిలో కలిగించడానికి కవిత్వంలో ప్రయోగించే ఒక పద్ధతి. అందుకని కవి ఒక సంఘటనను తాను అనుభవించి. అనుభూతి చెందిన వాటిని కవిత్వంలో ప్రతిఫలిస్తే కవి అనుభవించిన అనుభూతి అచ్చంగా పాఠకుడికి కలుగాలి అప్పుడే ఆ రచనతో పాఠకుడు ప్రయాణిస్తాడు.
నిజమైన పాఠకుడు అన్ని రచనలను సమదృష్టితో ఎలాంటి పక్షపాతం చూపకుండా చదివి అందులోని రసానుభూతిని ఆస్వాదిస్తాడు. పాఠకుడి స్వేచ్ఛను గౌరవించినప్పుడు మాత్రమే సాహి త్యం పరిపుష్టి అవుతుంది. రచయిత -రచన-పాఠకుడు ఇది ఒకవృత్తం. నిరంతరం పరస్పరం అర్థ్ధం చేసుకొని ముందుకు సాగితేనే సాహిత్యం పరిఢవిల్లుతుంది. అసలు పాఠకుడనే వాడు లేకుం టే రచయిత ఎక్కడ ఉంటారు? అని ప్రశ్న వేసుకుంటే కొంచెం కష్టమైనా చేదు వాస్తవమే.
-పుష్యమీ సాగర్
79970 72896