రాజాస్థానాల్లో ఊరేగుతున్న కవిత్వాన్ని అట్టడుగు వర్గాల వాడలకు, వివిధ వృత్తుల వద్దకు తీసుకెళ్లి పట్టం గట్టాడు సోమన. అందుకే సోమన తొలి సామాజిక కవి. ద్విపదలో స్వతంత్ర రచనలు చేసిన ఆదికవి.
అచ్చమైన తెలంగాణ దేశికవి సోమన. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో గ్రంథాలను వెలువరించారు. తెలుగులో శతకం, ఉదాహరణ, ద్విపద కావ్యం, రగడ, గద్య మొదలైన సాహిత్య ప్రక్రియలకు పురుడు పోశారు పాల్కుర్కి సోమనాథుడు.. జాను తెలుగుగా కీర్తిని తెచ్చిపెట్టారు.
సోమన రచనల్లో ‘బసవ పురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ ప్రఖ్యాతి చెందిన ద్విపదకావ్యాలు. ‘బసవ పురాణం’లో బసవేశ్వరుని జీవిత చరిత్ర ప్రధానంగా ఉంటుంది. సందర్భానుసారంగా దాదాపు 75 మంది శివభక్తులు బెజ్జ మహా దేవి, గొడగూచి మొదలైన కథలను సరసంగా వర్ణించారు.
‘బసవ పురాణం’ ఏడు ఆశ్వాసాల కావ్యం. ఈ బసవ పురా ణానికి పద ప్రయోగ సూచికను తయారుచేశారు ఏడుగురు సంపాదకులు. దీని నిర్మాణంలో బూర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ తత్వాది ప్రమోద్కుమార్, డాక్టర్ పోగుల విశ్వప్రసాద్, డాక్టర్ కలువకుంట రామకృష్ణ, డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, డాక్టర్ మట్టా సంపత్కుమార్ తదితరులు ఏడు ఆశ్వాసాలను సూచికకు అనుగుణంగా తయారు చేశారు. డాక్టర్ నలిమెల భాస్కర్ మొత్తంగా ఈ పనికి సలహాలు సూచనలిస్తూ సాధ్య మైనంత వరకు ఏక సూత్రత లోపించకుండా పర్యవేక్షించారు. ఈ పుస్తకాన్ని ‘కరీంనగర్ సాహితి’ ప్రచురించింది.
సూచికా నిర్మాణంలో అనుసరించిన పద్ధతులు, పరిమితులు : పాల్కుర్కి సోమనాథుడు తన బసవ పురాణంలో ప్రయోగించిన సంస్కృత సమాసాలను యథాతథంగా చూపించారు. సోమన సంస్కృత సమాస కల్పనా చాతుర్యాన్ని ఉన్నది ఉన్న ట్టు చూపించాలనేదే సంపాదకుల ఉద్దేశం. తెలుగు సమాసాలను సైతం యథారూపాల్లోనే చూపిస్తూ పరపదాలను మాత్రం ఆ పదాలు అకారాది క్రమంలో ఎక్కడ వస్తాయో అక్కడ సూచిం చారు. సామెతలు, జాతీయాలు, నుడి కారాలు, శబ్దపల్లవాల్లోని పదాలను విడివిడిగా చూపలేదు. విడదీస్తే అర్థస్ఫూర్తి కొర వడుతుందనేది సంపాదకుల భావన.
తెలంగాణ పదాలు : సోమన కాలంలో సంస్కృత భాషా ధిక్యత, గ్రాంథిక భాషా ప్రభావం ఎక్కువగా ఉండేది. ఐనా ప్రజల భాషకు పాల్కుర్కి తన గ్రంథాల్లో పెద్దపీట వేశాడు. జనం నోట్లో నానుతున్న పదాలను ఉన్నదున్నట్టుగా వాడటం సోమన నిర్భీతికి నిదర్శనం.
ఉదాహరణలు-అంగడి, అలుకు, ఈడ, పెండ, ఉగ్గులు, ఒల్ల, కసుపు, కుడుక, బంతి (పంక్తి), నక్కులు, మిండడు.
తెలుగు సమాసాలు : సోమనాథుడు అచ్చ తెలుగు పదాలతో చక్కని సమాసాలను ప్రయోగించాడు. కొన్ని సమాసాలు కొత్తగా అనిపిస్తాయి, కొన్ని ఇప్పటికీ వాడుకలో ఉన్నవి కూడా ఉన్నాయి. వాటిలో అచ్చ వెన్నెల, కాకి పడగలు, ఉచ్చు కోకలు, దొప్ప చెవులు, అరవిరి కంటన్, అట్ట చెప్పులున్. దోనె కడుపు దొప్పచెవులు అనే పదబంధం ఇప్పటికీ వ్యవహారంలో ఉన్నది.
మిశ్రమ సమాసాలు : సంస్కృత తెలుగు పదాలను కలిపిన సమాసాలను మిశ్రమ సమాసాలు లేదా వైరి సమాసాలు అంటారు. ఇలాంటి సమాసాలను నన్నయాదులు (జీవగర్ర, ప్రాణగొడ్డము) కూడా ప్రయోగించారు. అలాంటి వాటిని సో మన కూడా బసవపురాణంలో ప్రయోగించారు. తెలుగు సంస్కృత పదాల సమాసాలను కూడా ఉపయోగించారు. రాగి కుండలము, మొద్దు పాదముల్, మంచు పుంజంబు, ముక్కంటి గణము, యమపాఱులన్, దీపకంబంబులు, యష్టి కోలలు మొదలైనవి.
సంస్కృత సమాసాలు: ప్రాచీన కాలంలో సంస్కృత తెలుగు భాషల్లో పాండిత్యముంటేనే గౌరవం ఉండేది. ఆ రెండు భాషల సాహిత్యాల్లో వైదుష్యమున్న విద్వత్కవి సోమన. బసవ పురాణాన్ని శంకరాచార్యులనే కవి, ‘బసవేశవిజయ’మనే పేరుతో సంస్కృతానువాదం చేశాడని డాక్టర్ జి.నాగయ్య తెలిపారు.
స్వేచ్ఛా విహీనకృత్యమున, హృదయాబ్జ మకరంద ధార, అంజలీకృత కరకంజుడు, తత్త సౌఖ్యజలధి, శబ్దాలంకార ప్రతిభ, ధీర మహోదార శూర గంభీర సార గుణస్తోమ దీరేయుడు
గురుభక్తి ఫలసార గుహ్యప్రసాద, వరసేవనా సుఖపరవశ లీల
మరకత నీల నిర్మల పుష్యరాగ వర వజ్ర విద్రుమ వైఢూర్య ముఖ్య
సోమన ఈ కావ్యంలో హొన్న, హొన్నయ్య, హిరియ, వంటి కన్నడ పదాలను కూడా ప్రయోగించారు. పాల్కుర్కి బండి ‘ఱ’ మొదటి అక్షరంగా ఱంకు, ఱంపము, ఱాయి, ఱొమ్ము, ఱాల్ల వాన మొదలైన 26 పదాలను వాడినట్టు ఈ సూచిక ద్వారా తెలుస్తుంది.కొన్ని జంటపదాలను ప్రయోగించారు. నోములు గీములు, నంబియు గింబియు, కసిబిసి, కట్టె గిట్టె మొదలైనవి. ఒకటిరెండు సార్లు మొదలుకొని ఐదు వందల సార్లకు వాడిన పదాలున్నాయి. వందకంటే ఎక్కువ సార్లు ప్రయోగించిన పదాలు ఎల్లి, ఐన, తన, ఎల్లన్, అందు, ఏమి, ఐ అక్షరం, దీనిలో తలమున్కలు, మేలుబంతి, పిల్లిగడ్డంబు మొదలైన జాతీయలెన్నో ఉన్నాయి.
సంపాదకులు ఇందులో పదాలను ఎలా విడదీశారో తెలుసుకునేందుకు ఒక పద్య పాదాన్ని ఉదాహరణగా చూడండి. వీళ్లు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన బసవపురాణ గ్రంథాన్ని తీసుకొని పద్యపాదాలకు సంఖ్యలను వేశారు. బసవపురాణం తృతీయాశ్వాసం లోనిదీ పద్యపాదం.
తల్లిగల్గిన నేల తల జడల్గట్టు
1 2 3 4 5 6
తల్లి అనేపదం ఒకటినుంచి ఏడవ ఆశ్వాసంలో 879 పాద సంఖ్యవరకు 34 సార్లు వచ్చింది అట్లాగే మిగతావి. ఒకేరకమైన పదాలను సందర్భాన్ని శిశేష్యమో, క్రియో, అవ్యయమో సూచిస్తూ, అది ఎన్నిసార్లు వచ్చిందో కూడా తెలిపారు. కన్న (క్రియ), కన్న (విశేషం), కన్న (అవ్యయం), ఇది వీరి లోతైన పరిశీలనకు నిదర్శనం.
సంపాదకులు ఎంతో శ్రమకోర్చి ‘పద ప్రయోగ సూచిక’ను తెచ్చారు. పాల్కుర్కి మీద అభిమానం, ఆరాధనే వీళ్లను ఈ పనికి పురిగొల్పింది. అంతేగాక ఆంధ్ర కవుల కొన్ని గ్రంథాలకు ఇది వరకే పద ప్రయోగ సూచికలు వచ్చాయి. తెలంగాణ ఆదికవి ద్విపద కావ్యానికి లేకపోవడం పెద్దలోటని భావించారు. ఆ లోటును పూడ్చటం కోసం సంస్థలు చేయాల్సిన పనిని, వీళ్లు భుజాని కెత్తుకొని, పూర్తి చేసి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎగుర వేశారు. తెలంగాణ నుంచి తెలంగాణ కావ్యంపై వచ్చిన మొదటి ‘పదప్రయోగ సూచిక’ ఇదే.
– ఎర్రోజు వెంకటేశ్వర్లు 94925 57037