మనం తరుచుగా సకల మానవ సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవం, సామాజిక స్పృహ, మానవతావాదం, జాతీయవాదం అనే పదాలు వింటుంటాం. అత్యున్నతమైన ఈ ఆదర్శాలన్నీ మన పూర్వకాలం నుంచి ఉన్నాయి. వీటికి మూలం రామాయణం. రామాయణం గురించి అనేక వ్యాఖ్యానాలూ, వాదాలు, చర్చలూ, వాదోపవాదాలు వచ్చాయి.
రామాయణంలో వాల్మీకి, రాముణ్ణి మానవుడిగానే చిత్రించాడు. మనిషిలో ఉండే అన్నిరకాల సహజ లక్షణాలను రాముడిలో, ఇతర పాత్రలలో చూపించాడు. ప్రపంచ సాహిత్యంలో రామాయణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మనిషి తానొక ఉత్తమవ్యక్తిగా, కుటుంబంలో ఉత్తమ సభ్యుడిగా, మంచి కొడుకుగా, మంచి సోదరుడిగా, మంచి మిత్రుడుగా, చివరకు మంచి శత్రువుగా ఎలా జీవించవచ్చో చెప్తుంది రామాయణ కావ్యం.
‘మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్’ అని అరిస్టాటిల్ అన్నాడు. ‘మ్యాన్ ఈజ్ ఏ ఫెరోషియస్ యానిమల్’ అని బ్రిటీషు తత్వవేత్త ధామస్ వొచ్చెస్ అన్నాడు. ఈ రెండు విషయాలూ సత్యమే. ఈ రెండు ప్రవృత్తులకూ మూల కారణం ఒకటుంది అది మనిషిలోని స్వార్ధపరత్వం. మనిషిలో సహజంగా ఉన్న ఈ స్వార్థ పరత్వాన్ని అణచి వేయాలంటే, మనిషి మనసును మార్చే మంచి మార్గదర్శనం కావాలి. ఈ సన్మార్గ దర్శనం మంచి మనసులో, పాజిటివ్ మైండ్తో రామాయణ పఠనం ద్వారా లభ్యమవుతుంది. ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శలు చేసినా, నేటి మన భారతీయ సమాజం- రామాయణ ప్రామాణికంగానే సాగుతున్నది. మనం చెప్పేనీతి సూత్రాలన్నీ
రామాయణం లోనివే.
వ్యక్తిత్వ వికాసం, పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ కూడా మనసుకు హత్తుకునే విధంగా రామాయణం చెప్తుంది. ఇవన్నీ పాశ్చాత్యులకు ఇటీవల కాలంలో తెలిసిన విషయాలు. మనదేశంలో కొత్తగా కనిపెట్టలేదు. రామాయణంలో నిక్షిప్తమైన విషయాలే. మన యువత, ఈ విషయాలను తెలుసుకోవాలి. ఒకసారి రామాయణం చదివితే కమ్యూనికేషన్ స్కిల్స్, రోల్ మాడల్, పాజిటివ్ థింకింగ్ ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి.
శ్రీ రాముడికి తెల్లారితే పట్టాభిషేకం అనుకున్నారందరూ. కానీ మరునాడు దశరథుడు రాముడిని అరణ్యవాసానికి వెళ్లమని ఆదేశించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆగ్రహంతో తండ్రి మాటను ధిక్కరించమని అన్న అయిన రాముడితో అంటాడు. లక్ష్మణుడితో రాముడు‘ ఈ రోజు నాకు పట్టాభిషేకమని చెప్పింది మన తండ్రిగారే. కానల కేగమని చెప్పినది వారే! కనుక దీంట్లో తండ్రి తప్పులేదనీ, అంతా కాలమహిమ ’ అని చాలా ప్రశాంతంగా లక్ష్మణుడికి చెప్పి తండ్రి ఆజ్ఞ శిరసావహించడానికి బయలుదేరుతాడు. దీనివల్ల మనం సుఖ, దుఃఖాలను సమభావంతో చూడాలని, సుఖానికి పొంగిపోక, దుఃఖానికి కుంగిపోక సంయమనం పాటించాలని తెలుసుకుంటాం.
రాముడు అడవికి బయలుదేరుతూ తల్లి కౌసల్య ఆశీస్సుల కోసం వచ్చినప్పుడు రాముడితో కౌసల్య అం టుంది ‘రామా ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అతిక్రమించకు, అనుకూల పరిస్థితుల్లో ధర్మంగా ప్రవర్తించడం తేలిక కానీ నీవు వెళ్లేది అడవికి, అక్కడ ఉండే వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టకు. అదే ధర్మాచరణంటే, అని రాముడికి ఉద్బోధిస్తుంది. ఇది నాటికీ, నేటికీ, ఏనాటికీ చెక్కుచెదరని ధర్మసూత్రం. ఈనాటి తల్లిదండ్రులు, పిల్లలను పెద్ద చదువులకుగానీ, ఉద్యోగాలకుగానీ, కొత్త ప్రదేశాలకు, విదేశాలకూ పంపేటప్పుడు చెప్పవలసిన ఆణిముత్యాల్లాంటి మాటలు.
రామాయణంలో దాంపత్యబంధం ఎంతో బాగా చిత్రీకరించా రు. దాంపత్య సంబంధం కుటుంబ జీవితంలో శాంతికి మూలం. ఈ రోజున నాగరికతకు పరాకాష్ఠ అనుకుంటూ చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. ఈనాటికీ భార్యాభర్తలను దీవించేటప్పుడు ‘సీతారాముల్లా వర్థిల్లండి’ అని దీవిస్తారు వారి దాంపత్యబంధం అటువంటిది.
సీతాపహరణానంతరం, ఒక వ్యక్తిగా సీతకోసం రాముడు విలపించాడు, కానీ ధర్మపాలనకోసం, ఒక రాజుగా సీతను కానలకు పంపాడు. ఇది నేటి పాలకులందరూ తెలుసుకోవలసిన విష యం. న్యాయంగా పరిపాలించాలంటే, బంధుప్రీతి పనికిరాదని తెలియ చేస్తుంది ఈ సంఘటన.
హనుమంతుడు లంకలో సీతాదేవి దుఃఖాన్ని పోగొట్టడానికి ‘మరణిస్తే ఏమొస్తుంది? జీవించి ఉన్నట్లైతే ఎప్పటికైనా మంచిని చూస్తాం’ అంటూ ఆమెను ఆశావాదం వైపు మళ్లిస్తాడు. నిరాశాంధకారంలో కొట్టు మిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడే యువతకు జ్ఞానబోధ, పాజిటివ్ థింకింగ్ వైపు ఆలోచింప చేసే ఉపదేశ మంత్రం ఇది.
హనుమంతుడు లంకకు చేరడానికి నూరు యోజనాల దూ రం సముద్రాన్ని లంఘించాలి. తనబలం తనకు తెలియదు. కానీ రామకార్యం కోసం సముద్ర లంఘనం కావించాలని సంకల్పించాడు. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, లక్ష్యం వైపునకు దూసుకుపోయాడు. ఇది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విషయం. చిన్నపెద్దా, యువత అందరూ కూడా, ఒక లక్ష్యం సాధించాలంటే, ముందు సంకల్పం ఉండాలి, ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమిస్తూ, లక్ష్యం వైపునకు దూసుకుపోవాలి. నేడు మనం వింటున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అఛీవింగ్ గోల్ అన్నీ రామాయణంలోని సుందరకాండలో ఉన్నాయి.
అలాగే హనుమంతుడు లంకలో సీత జాడ కనుక్కొని ఆ శుభవార్త రామునికి చేరవేసేటప్పుడు ఆతృతగా ఎదురుచూస్తున్న రాముడికి ‘చూశాను సీతను’ అని చెప్పా డు. అంతే కానీ ‘సీతను చూశాను’ అనలేదు. ‘సీత’ అన్నమాట ముం దు వినపడగానే ప్రాణాలు పోయేటంత ఆతృతగా ఉన్నాడు రాముడు. చూశాను అన్న మాట వినగానే ప్రాణం నిలబడింది ఆయనకు. ఒక చిన్న మాట ఎంతటి ఓదార్పు నిచ్చింది! అదే ‘గుడ్ కమ్యూనికేషన్ స్కిల్’. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం స్పెషల్ కోచింగ్ క్లాసులకి వెళ్తున్నారు. ఇలాంటి విషయాలు రామాయణంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇవన్నీ, దేశ కాల, జాతి, మత, కుల భేదాలేవీ లేకుండా ప్రతి మనిషికీ ఉపకరించే సన్మార్గ దారి దీపాలు.
ప్రపంచ వ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న సామాజిక రుగ్మతలకూ, నైతిక పతనానికీ ఔషధ గుళికలు రామాయణంలో చాలా ఉన్నాయి. రామాయణం చదివితే, వ్యక్తి తనను తాను చక్కదిద్దుకొనడమే కాకుండా, కుటుంబాన్నీ చక్కదిద్దుకోగలుగుతాడు. అప్పుడు సమాజమూ, దేశమూ, ప్రపంచమూ వాటంతటవే చక్కబడతాయి.
తండ్రి మాట జవదాటకూడదు, ఇంటికి పెద్దవాడికి బాధ్యతలు ఎక్కువ. తమ్ముళ్లు అన్నను గౌరవించాలి. వదిన తల్లి లాంటిది. భార్య భర్తను అనుసరించాలి. స్నేహం చేస్తే ప్రాణప్రదంగా చూసుకోవాలి, ఆడినమాట తప్ప కూడదు, కుండెడు పాలల్లో ఒక్క విషపు చుక్కపడినా పాలన్నీ విషమయినట్టు, వంద మంచి గుణాలున్నా, పరస్త్రీ వ్యామోహం అనే ఒక్కటి చాలు, దుర్మార్గుడిగా జమ కట్టడానికి. ఇవన్నీ ఈనాటికీ మన సమాజంలో చెలామణీలో ఉన్న నీతి సూత్రాలే.
నేటి సమాజంలో ఉన్న మానవతావాదం, జాతీయవాదం, స్త్రీవాదం వగైరా వాదాలు.. సామాజిక స్పృహ, విశ్వజనీనం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం… ఒకటేమిటి అన్నీ రామాయణంలో ఉన్నాయి. ఎక్కడికో వెళ్లి డబ్బు ఖర్చుపెట్టుకుని పర్సనాలటీ డెవలప్మెంట్ క్లాసుకెళ్లక్కరలేదు. రామాయణం ఒక్కసారి చదివితే చా లు. నవరసాలు రమ్యంగా చిత్రీకరించబడిన వ్యక్తిత్వ, సామాజిక, విశ్వజనీనమైన రామాయణం అందరూ చదవాల్సిన పుస్తకం. ఒక్కొ క్క కవి రుచి ఒక్కోరకంగా ఉంటుంది. రసరమ్యం ఆస్వాదించిన కొద్దీ రుచి అధికమవుతుంది.