ప్రపంచంలో లక్షలాది సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ తీవ్రమైన లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న వారు, అందునా ఐసీయూలో చికిత్స పొందాల్సిన పరిస్థితి మాత్రం చాలా తక్కువ మందికే కలుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? అంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్లే అని సమాధానం వినిపిస్తోంది. కానీ అదొక్కటే కారణం కాదట.
తాజాగా చేసిన పరిశోధనల్లో మరో అంశం కూడా కరోనా తీవ్రతను పెంచి, పేషెంట్లు ఐసీయూలో చేరేలా చేస్తోందని తేలింది. దాన్నే డిస్ఫంక్షనల్ ఎండోథీలియం (ఎండోథీలియం పనిచేయకపోవడం) అంటారట. ఇలా జరగడానికి కారణం కరోనా వైరస్ కాదు. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తీవ్రమైన కరోనా కేసుల్లో ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు దెబ్బతినడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి పలు లక్షణాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రధాన కారణం కూడా ఎండోథీలియమే అని తెలుస్తోంది. ‘మా పరిశోధనలో ఏ ఇమ్యూన్ కణాలు యాక్టివేట్ అవుతున్నాయి? అలాగే ఎండోథీలియన్ అంటే రక్తనాళాలు యాక్టివేట్ అవడం వల్ల కలిగే ప్రభావం ఏంటి? అని అధ్యయనం చేశాం’ అని హానోవర్ మెడికల్ స్కూల్, జర్మన్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్లలో ప్రొఫెసర్గా ఉన్న క్రిస్టీన్ ఫాక్ తెలిపారు.
ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అండ్ టార్గెటెడ్ థెరపీ జర్నల్’లో ప్రచురితం అయ్యాయి. రక్త నాళాల్లోని రక్తం.. చుట్టూ ఉండే కళజాలాన్ని తాకకుండా అడ్డుగా ఉండే కణాల పొరను ‘ఎండోథీలియం’ అంటారు. కరోనా కారణంగా రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితం అవడంతోపాటు ఊపిరితిత్తుల్లోని ఎండోథీలియల్ కణాలు కూడా చాలా బలంగా రియాక్ట్ అవుతున్నాయట. దీంతో పలురకాల ప్లాస్మా ప్రొటీన్లు విడుదలవుతున్నాయి.
వీటిలో కొన్ని ఎండోథీలియం పొరకు నష్టం చేయడంతో ఆ పొర పనిచేయడం లేదు. ఈ కారణంగా ఊపిరితిత్తుల్లో ఉండే అల్వేలీ (చిన్ని చిన్ని గాలి సంచుల్లాంటివి), వాటి చుట్టూ ఉండే నాళాల మధ్య ఎటువంటి రక్షణా లేకుండా పోతుంది. దీనివల్ల కరోనా తీవ్రత మరింత ఎక్కువై బాధితులు మంచాన పడుతున్నారు. ఈ పొర మళ్లీ బాగైతే కరోనా పేషెంట్లు నెమ్మదిగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే రోగ నిరోధక వ్యవస్థలోని ఏ మూలకాలు ఈ ఎండోథీలియంపై ప్రభావం చూపుతున్నాయో ఇంకా తెలియలేదు. దీనిపై క్రిస్టీన్ ఫాక్ బృందం ఇంకా పరిశోధనలు చేస్తోంది. అలాగే కరోనా నుంచి కోలుకునే సమయంలో ఇమ్యూన్ కణాల్లో కొన్ని మార్పులు కనిపస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. వీటికి లాంగ్ కొవిడ్ కేసులు పెరగడానికి సంబంధం ఉందేమో అని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అయితే రూఢీగా చెప్పడానికి ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదు.