Valentines Day Special | ప్రేమ.. మతాలకు అతీతమైన అభిమతం. ప్రేమ.. ఆస్తిపాస్తులను మించిన సంపద. ప్రేమ.. త్యాగాలలోకి అతిపెద్ద త్యాగం. ప్రేమించిన మనిషి ఆలోచనలే ఊపిరిగా బతికారొకరు. ప్రేయసి కోసం ఖండాలు దాటుకుని వెళ్లారొకరు. ఆమె కల నిజం చేయడానికి కలెక్టరు కొలువు కొట్టారొకరు. ఆ శక్తివారికి ప్రేమతోనే వచ్చింది. ఆ విజయం వారికి ప్రేమతోనే సాధ్యమైంది. ప్రేమ.. ప్రపంచాన్ని ఎదిరించే తెగువనిస్తుంది, లక్ష్యాన్ని సాధించే బలాన్నిస్తుంది.
అతనిది భారత్లోని నిరుపేద కుటుంబం. ఆమె ఐరోపా రాజ వంశీయురాలు. కానీ ఒక సన్నివేశం వారిద్దరినీ కలిపింది. ఆమె మళ్లీ తిరిగి తన చిరునామా అయిన ఉత్తర ధ్రువ ప్రాంతానికి వెళ్లిపోయింది. అతని మనసూ ఆమె వెంటే బయల్దేరింది. ఇక, తనది ఆత్మలేని శరీరంలా అనిపించిందతనికి. అందుకే సుదూరాలలోని చెలియను చేరేందుకు తన సెకండ్ హ్యాండ్ సైకిల్నే నమ్ముకున్నాడు. ప్రేయసి కోసం .. డొక్కు సైకిల్ మీదే పది వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆమెను కలిసి ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించాడు. సినిమాను తలపించే ఈ ప్రేమకథ ఒడిశాకు చెందిన ప్రద్యుమ్న కుమార్ మహానందియా, స్వీడన్ దేశీయురాలైన షార్లొత్ వాన్ షెడ్విన్ది.
ప్రద్యుమ్నకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే పిచ్చి. అందుకే ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సంస్థలో చేరి చిత్రలేఖనంలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సహా పలువురి చిత్తరువులు గీసి మెప్పు పొందాడు. గొప్ప చిత్రకారుడిగా పేరు సంపాదించాడు. కానీ అతని దగ్గర ఎప్పుడూ చేతినిండా డబ్బు ఉండేది కాదు. అయితే, అప్పట్లో హిప్పీ ట్రయల్గా పిలిచే ఒక దారిగుండా స్వీడన్ నుంచి భారత్కు వచ్చింది షార్లొత్ వాన్ షెడ్విన్. ఒకసారి అనుకోకుండా ప్రద్యుమ్నను కలిసింది. ఆర్టిస్టు కాబట్టి తన బొమ్మ గీసివ్వమని అడిగింది. తొలి చూపులోనే ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు ప్రద్యుమ్న. ఆమెకోసం మూడు చిత్రాలు గీసిచ్చాడు. ఈ క్రమంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. పెళ్లి కూడా చేసుకున్నారు. రెండు మూడు వారాలు కలిసి ఉన్నారు. అయితే షార్లొత్ తిరిగి స్వీడన్ వెళ్లాల్సివచ్చింది. దీంతో ఆమె ఒక్కతే ప్రయాణమైంది.
ఇద్దరూ ఉత్తరాలు రాసుకుంటూ కొంతకాలం గడిపారు. కానీ ప్రద్యుమ్నకు ఆమె పదేపదే గుర్తొచ్చేది. పోనీ వెళదామంటే అంతదూరం ప్రయాణ ఖర్చులు భరించే స్తోమత లేదు. అప్పుడు, తన సైకిల్ మీద ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడో ఒకచోట వసతి తీసుకుంటూ, ఏకంగా ఎనిమిది దేశాల ఎల్లలు దాటుతూ.. సైకిల్ యాత్రను సాగించాడు. మధ్యలో కొంతదూరం రైలు ప్రయాణం మినహా ఆ ప్రేమయాత్ర మొత్తం రెండు చక్రాల బండి మీదే జరిగింది. అలా నాలుగు నెలలు శ్రమించి తను ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కలిశాడు. ఆ ప్రేమ బంధానికి సరిగ్గా 45 సంవత్సరాలు. ప్రస్తుతం స్వీడన్లోనిబోరాస్లో ఉంటున్నారా దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. స్వీడిష్ జర్నలిస్టు, రచయిత పర్ జె. ఆండర్సన్ ఆ ప్రేమ కథను ‘అమేజింగ్ స్టోరీ ఆఫ్ ద మ్యాన్ హు సైకిల్డ్ ఫ్రమ్ ఇండియా టు యూరప్ ఫర్ లవ్’ పేరిట 2017లో పుస్తకంగా తీసుకొచ్చాడు. ఎల్లలు లేని ప్రేమకు వీరి కథను మించిన గీటురాయేం ఉంటుంది!
ప్రేమ జంట ముచ్చట్లు మొదలుపెడితే.. ఆ మాటల్లో ఓ పది సంవత్సరాల వెనక సంగతులు, ఓ పది సంవత్సరాల ముందు విషయాలూ తగలకుండా పూర్తికావు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకొంటున్న ప్రేమ జంటదీ అదే దారి. కానీ వాళ్ల మాటలు అటూ ఇటూ తిరిగి కోట్ల రూపాయల జీతమొచ్చే కొలువును వదులుకునేలా చేశాయి. అమ్మాయి కోరుకున్నట్టు అబ్బాయిని
ఐఏఎస్ ఆఫీసర్గా నిలిపాయి. ఈ కథ నాలుగేండ్ల క్రితం సివిల్ సర్వీస్ పరీక్షలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన జైపూర్ కుర్రాడు కనిష్క్ కటారియాది. అతను ఐఐటీ ముంబై పట్టభద్రుడు. సోనాల్ చౌహాన్ కూడా అక్కడే చదువుకుంది. ఆ క్యాంపస్ పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయి కొలువుల్లో చేరారు. దక్షిణ కొరియాలో కోట్ల రూపాయల జీతంతో కొలువు వచ్చింది కనిష్క్కి. ఆమె కూడా పెద్ద ఉద్యోగంలోనే చేరింది. ఇద్దరూ, ఓసారి రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచనలు పంచుకున్నారు. ‘కేవలం డబ్బు కోసమే ఇక్కడ పనిచేస్తున్నాం కదా, దేశాభివృద్ధిలో మనపాత్ర ఏమిటి?’ అనే ఆలోచన అతణ్ని వేధించేది. ఆ అపరాధ భావం సోనాల్నూ వెంటాడేదేమో. అందుకే, ‘నన్ను నువ్వెలా చూడాలనుకుంటున్నావ్?’ అని అడిగాడు. ‘సివిల్ సర్వెంట్’గా అంది. ‘అదే నీ కోరికైతే సరే’.. అన్నాడతను. మరుక్షణమే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. భారత్ తిరిగొచ్చాడు. సివిల్స్ పరీక్షలంటే ఎంత కష్టమో తెలుసు కాబట్టి, పూర్తి నిబద్ధతతో చదివాడు. ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించాడు. తన విజయంలో తల్లిదండ్రులతో పాటు గర్ల్ఫ్రెండ్ పాత్ర కూడా ఉందని పత్రికా ముఖంగా ప్రకటించాడు. మరుసటి ఏడాదే ఈ ప్రేమ జంట పెండ్లి చేసుకుంది. విజయ తీరాలు చేరేందుకు ప్రేమ ఎప్పుడూ అడ్డు కాదని వీళ్ల ఉదాహరణ నిరూపించింది.
అతడు, ఆమె ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించారు, పెండ్లి చేసుకున్నారు.. పోనీ పెద్దల్ని ఒప్పించారు, పెండ్లి చేసుకున్నారు. ఇదే ఒక ప్రేమ కథకు ముగింపు అయితే, వీళ్ల ప్రేమకథను ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఈ ప్రేమ అజరామరం అనాల్సిన పనీలేదు. కానీ, కేరళకు చెందిన కాంచనమాల, మొయినుద్దీన్ ప్రేమ వీటన్నిటికీ భిన్నమైన కథ. నమ్మలేనట్టుగా అనిపించే అమర ప్రేమగాథ.
అది 1950వ దశకం. కొజికోడ్ జిల్లా మొక్కం గ్రామం. ఆ ఊరి పిల్లలు చదువుకోవాలంటే.. ఇరువంజిళం నదిని పడవల్లో దాటాలి. అలాగే కాంచనమాల, మొయినుద్దీన్ కూడా కలిసి వెళ్లేవారు. అప్పట్లో పుస్తకాలే కాలక్షేపాలు. అందుకే, మొయినుద్దీన్ కాంచనకు నవలలు, కవిత్వ సంకలనాలు ఇచ్చేవాడు. ఆ క్రమంలో ఒకరోజు కవితల పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ప్రేమకు సంబంధించిన కొన్ని పంక్తుల కింద గీత గీసి ఉండటం చూసిందామె. ఆ సంగతే అతణ్ని అడిగింది. సమాధానంగా ఓ చిరునవ్వు రువ్వాడు. మరునాటి నుంచీ పుస్తకాలతోపాటు ప్రేమ కవితలు నింపిన ఉత్తరాలూ అందాయామెకు. ఇద్దరి మధ్యా వలపు తలుపులు తెరుచుకున్నాయి. ఆ పడవ ప్రయాణం కోసం పగలూ రాత్రీ ఎదురు చూసేవారిద్దరూ. దారంతా బోలెడన్ని ఊసులు. రేపటి కోసం లెక్కలేనన్ని ఊహలు. ఒక్కరోజు కూడా ఒకర్ని చూడకుండా ఒకరు ఉండలేని స్థితి. అంతలోనే, ఓ రోజు కాంచన పుస్తకాలను సర్దుతూ వాళ్లమ్మ ప్రేమలేఖల్ని చదివింది. ఇద్దరివీ ఉన్నత కుటుంబాలే. కానీ వేరువేరు మతాలు. వెంటనే, ఆమెను ఇంట్లో బందీ చేశారు.
మతాంతర వివాహం చేసుకుంటే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వమని అతణ్ని ఇంటినుంచి తరిమేశారు. దీంతో మొయినుద్దీన్ సమాజ సేవలో లీనమయ్యాడు. ఏదో ఒకరోజు ఆమె వస్తుందన్న ఆశ. మొయినుద్దీన్ అప్పుడప్పుడూ తన తల్లిని చూసేందుకు ఇంటికెళ్లేవాడు. ఆ సమయంలో.. హద్దులు తెలియని కోపంతో తండ్రి తుపాకి గురిపెట్టాడు. బుల్లెట్ గాయాలతో మొయినుద్దీన్ మరణం చివరి అంచులదాకా వెళ్లొచ్చాడు. ఆమెనూ ఇంట్లోవాళ్లు అష్టకష్టాల పాలు చేశారు. పెండ్లి సంబంధాలతో బంధిద్దామనుకున్నారు. ఆమె కరగలేదు. అతనూ చెదరలేదు. ఇద్దరూ కలిసి మలయాళ అక్షరాలతో తమకు మాత్రమే అర్థమయ్యే ప్రత్యేక భాషను రూపొందించుకున్నారు. ఆ రహస్య భాషలో ఉత్తరాలు రాసుకున్నారు. ఇంట్లోని పనివాళ్లే ప్రేమ రాయబారులుగా నిలిచారు. అంతలోనే పదేళ్లు గడిచాయి. ఆమె అతణ్ని ఒక్కసారి మాత్రమే చూసింది. అది కూడా అతను పడవ మీద వెళ్తున్నప్పుడు. గాలివాటానికి మొయినుద్దీన్ మాట్లాడిన నాలుగు ముక్కలు అస్పష్టంగా చెవిన పడ్డప్పుడు. ఎన్నోసార్లు ఇల్లు దాటివెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కుటుంబ పరిస్థితులు అడ్డొచ్చి ఆగిపోయారు. అలా ఆమెకు 41, అతనికి 44… తమ జీవితంలో వసంతం తరలి రాకపోతుందా… అన్నది ఇద్దరి ఆశ.
ఒక వానకాలం వాళ్లిద్దరినీ కలిపిన ఇరువంజిళం నదిమీద వర్షం పడుతున్నది. కిటికీ లోంచి ఆమె ఆ చినుకుల్ని ఆస్వాదిస్తున్నది. కానీ ఆ నదిమీద వెళ్తున్న ఓ పడవ బోర్లా పడింది. ఆ ప్రమాదంలో ఎందరో చనిపోయారు. వాళ్లను కాపాడుతూ మొయినుద్దీన్ కూడా సుడిగుండంలో చిక్కుకుపోయి ఊపిరికోసం పోరాడుతున్నాడు. ఇక, అదే అతని చివరి వాన. విషయం తెలుసుకున్న ఆమెకు ప్రపంచం చీకటిమయం అయిపోయింది. ఆరుసార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. విషయం తెలిసి మొయినుద్దీన్ తల్లి వచ్చింది. తన ఇంటికి తీసుకుపోయింది. అతని ఆశయాల సాధనకోసం బతకమంది. దీంతో కాంచనమాల ‘మొయినుద్దీన్ సేవా మందిర్’ స్థాపించి ఉచితంగా ఈత నేర్పుతున్నది. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నది కూడా. వీళ్ల కథ మలయాళంలో ‘ఎన్ను నింటే మొయినుద్దీన్’ పేరిట సినిమాగా తెరకెక్కింది. కాంచనమాల.. ఇప్పటికీ ఓ వితంతువుగా ఒంటరి జీవనం సాగిస్తున్నది.
టాటూలతో జ్ఞాపకాలు పదిలం : గ్రాండ్పేరెంట్స్కు ఘన నివాళి