Sri Rama Navami | సకలగుణ భూషితుడు రామయ్య.. సంపూర్ణ సౌభాగ్యవతి సీతమ్మ. భారతీయ వైవాహిక వ్యవస్థకు తరగని, చెరగని ఉదాహరణ వీరి దాంపత్యం.అవతార ప్రయోజనం కోసం ఎడబాటుకు గురైనా.. వారి అన్యోన్యతలో తడబాటు కనిపించదు. అదే అనురాగం ఈతరం సంసారాల్లోనూ సరిగమలు పలికించాలంటే.. సీతారాముల కల్యాణ వేళ.. వారి జీవితం చెప్పే పాఠాలను ఒకసారి పరికిద్దాం!
రామా వినవేమయా..
వనవాస సమయంలో రుషుల అభ్యర్థనతో అసురులను అంతమొందించడానికి సిద్ధపడతాడు రాముడు. అప్పుడు సీతమ్మ కలగజేసుకొని రాముడికి ఓ కథ చెబుతుంది. ఆశ్రమ జీవనం గడిపేవాళ్లు ఆయుధం పట్టుకుంటే జరిగే అనర్థాన్ని వివరిస్తుంది. తపస్సు చేసుకునే ముని గొడ్డలి కారణంగా కిరాతకుడిగా మారిన వైనాన్ని చెబుతుంది. సీతమ్మను ఊరడించిన రాముడు.. రాజధర్మం పేరుతో రాక్షసులను దండించడానికి వెళ్తాడు. అక్కడ రాముణ్ని శూర్పణఖ చూడటం.. తర్వాత జరిగిన కథంతా మనకు తెలిసిందే! అన్యోన్యతకు ప్రతిరూపాలు సీతారాములు, అయినా.. సీతమ్మ మాట రాముడు జవదాటడంతో ఊహించని కష్టానికి దారితీసింది. అయితే, అదే రామాయణ కథకు మలుపు. పది తలల అహంకారంపై ధర్మం గెలుపునకు నాంది.
‘ఏవండీ! ఒక్కమాట..’ ఈ ఒక్కమాటతో భార్యాభర్తల మధ్య సంప్రదింపులకు తెర తీయొచ్చు. వీరి మాట వారు పట్టించుకోకున్నా.. వారి మాట వీరు పెడచెవిన పెట్టినా.. కాపురాన్ని సమస్యలు చుట్టుముడతాయి. ఒక్క నిర్ణయం జీవితాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. అందుకే ముఖ్యమైన విషయాల్లో దంపతులిద్దరూ చర్చించుకొని ముందడుగు వేయాలి. శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు ఆమె మాటను కొట్టిపారేయరాదు. శ్రీవారంటే గౌరవం ఉన్నవాళ్లు ఆయన నిర్ణయాన్ని అవసరమైతే సవరించి.. గౌరవించాలి. ఇలా ఇద్దరూ అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఆ కాపురం ఆలుమగలు దిద్దుకున్న అనురాగ గోపురమవుతుంది.
శ్రీవారంటే మావారే
వనవాస సమయంలో ఒకసారి సీతారాములు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అత్రి మహర్షి భార్య అనసూయ సీతను సాదరంగా ఆహ్వానిస్తుంది. ‘సీతా! భర్తతో అడవుల వెంట తిరుగుతూ ఎలా కష్టపడుతున్నావమ్మా! నీలాంటి భార్య దొరకడం రాముడి అదృష్టం’ అంటుంది. అప్పుడు సీతమ్మ సమాధానమిస్తూ.. ‘నాపై ఆయన ప్రేమ స్థిరమైనది తల్లీ. ఆయన గుణాలను ఎంత పొగిడినా తక్కువే! అంతటి ప్రేమైక మూర్తి. అమ్మానాన్నలను ఎలాగైతే నిస్వార్థంగా ప్రేమిస్తానో.. రామచంద్రుణ్ని కూడా అంతే ప్రేమిస్తున్నానమ్మా! ఆయన్ను భర్తగా పొందడం నా అదృష్టం’ అంటుంది.
భర్త గురించి ఎంత గొప్పగా చెప్పింది కదా సీతమ్మ! భర్త ఎలాంటి వాడనే సంగతి పక్కన పెడితే.. ఇతరుల ఎదుట భర్తలోని దుర్గుణాలను ఏకరువు పెట్టడం సంసారానికి చేటు చేస్తుంది. మంచి వ్యక్తుల్లోనూ కొన్ని లోపాలు ఉండటం సహజం. కొందరికి కోపం జాస్తిగా ఉండొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు. ఇలాంటి చిన్నచిన్న లోపాలను సమయస్ఫూర్తితో దిద్దుకోవాలి. శ్రీవారంటే మావారే అన్నట్టుగా మార్చుకోవాలి. చిలువలు పలువలు చేసి.. సంసారాన్ని రోడ్డుకు ఈడ్చుకోవద్దు. గోరంత లోపాల్ని.. కొండంతలు చేసి వైవాహిక జీవితాన్ని భారం చేసుకోవద్దు.
నా రాముడొస్తాడు..
వనవాసంలో ఓసారి రాముడు సీతమ్మ ఒడిలో తలపెట్టి పడుకుంటాడు. అప్పుడు కాకాసురుడనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి.. సీతమ్మ వక్షస్థలాన్ని పొడుస్తాడు. రక్తం ధార కట్టి రాముడి నుదుటిపై పడుతుంది. రక్తమోడుతున్న సీతను చూడగానే రాముడు కోపోద్రిక్తుడు అవుతాడు. పక్కనే ఉన్న గడ్డిపరకను పీకి బ్రహ్మాస్త్రం అభిమంత్రించి కాకాసురుడిపై విసురుతాడు. ముల్లోకాలు తిరిగిన కాకాసురుడు తిరిగి రామపాదాలను చేరి శరణు వేడటంతో వదిలేస్తాడు. ఈ దృష్టాంతాన్ని తన అన్వేషణ కోసం లంకకు వచ్చిన హనుమకు చెబుతుంది సీతమ్మ. రాముడు తనను కాపాడతాడన్న నమ్మకాన్ని వెలిబుచ్చుతుంది.
ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే సంసారం
సజావుగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, చిన్నచిన్న కలతలు ప్రతి కుటుంబంలోనూ ఎప్పుడో ఒకప్పుడు తలెత్తుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు అండగా ఉండాలి. ఒత్తిళ్లను చిరునవ్వుతో అధిగమించాలి. అనుమానాలు
పొడ చూపకుండా నమ్మకాన్ని ప్రదర్శించాలి. మనసు విరిగే మాటలొద్దు. మనసు కరిగే మంచి మాటలు చెప్పుకోవాలి. పరిస్థితులు మారిపోతాయి. ఆపత్కాలంలో నమ్మకం సడలకుండా ఉంటే.. మంచి రోజులొచ్చాక మరింత మహోన్నత జీవితం ఉంటుందని గ్రహించండి.
…? కణ్వస