శర్మిష్ఠ ముఖర్జీ.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు. గతంలో ఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు కూడా. తన తండ్రి అనుభవాల ఆధారంగా ఆమె రాసిన ‘ప్రణబ్, మై ఫాదర్’ వివాదాస్పదమైంది. ఈ పుస్తకానికి తన మరణానంతరమే ఓ రూపం ఇవ్వాలని ప్రణబ్ షరతు పెట్టారట. ఆ కోరిక ప్రకారమే.. రెండేండ్లపాటు శ్రమించి ప్రతి వాక్యంలో తండ్రి హృదయాన్ని ఆవిష్కరించారు శర్మిష్ఠ. గ్రామీణ పశ్చిమ బెంగాల్లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ వరకు
సాగించిన ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. తన తండ్రి రాజకీయ జీవితంలో ఇందిరాగాంధీతో పనిచేయడం ఒక బంగారు అధ్యాయం అంటారామె. ఇందులో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ స్నేహం గురించి కూడా ప్రస్తావించారు.
పీవీ మరణానంతరం ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి అనుమతించకపోవడం తన తండ్రిని ఎంతో బాధపెట్టిందని తెలిపారు. “రాహుల్ గాంధీ తన ఘనమైన వారసత్వానికి గర్విస్తాడు కానీ, అతనిలో నెహ్రూ, ఇందిర, రాజీవ్లో ఉండే సూక్ష్మబుద్ధి , రాజకీయ చతురత లోపించాయి” అని ప్రణబ్ వ్యాఖ్యానించారని ఈ పుస్తకంలో పేర్కొనడం కలకలం రేపింది. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తప్పనిసరి అనేది ప్రణబ్ ఆకాంక్ష అంటారామె. ఈ పుస్తకంలోని అంశాలు వివాదాస్పదం అయితే కావచ్చు కానీ, ప్రణబ్ కూతురిగా శర్మిష్ఠ చిత్తశుద్ధిని, రాతలోని నిజాయతీని శంకించలేం.