ప్రొ కబడ్డీ తొమ్మిదో సీజన్.. మొత్తం 22 మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ గెలిచింది కేవలం రెండు మాత్రమే. కబడ్డీనే ప్రాణంగా శ్వాసించే తెలుగు గడ్డపై వరుస పరాజయాలు పంటికింద రాయిలా ఇబ్బందిపెట్టాయి. ‘మనవాళ్లు ఇవాళైనా గెలవకపోతారా?’ అని ప్రతీ మ్యాచ్ను కన్నార్పకుండా చూసే తెలుగు ప్రేక్షకులకు.. తొడకొట్టి, రొమ్మువిరిచి, కాలర్ ఎగరేసే సందర్భాన్ని రుచిచూపించాడు నల్లగొండకు చెందిన హనుమంతు. ప్రొ కబడ్డీ అన్ని సీజన్లలోనూ ఏ తెలుగు ప్లేయర్ సాధించలేని ‘సూపర్ 10’ ఘనతను సాధించిన మొదటి ప్లేయర్గా నిలిచాడు.
‘ఒకే ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అనుకుంటూ.. మెయిన్ సెవన్లో అవకాశం కోసం దాదాపు 19 మ్యాచ్లు ఎదురుచూశాడు హనుమంతు. చివరికి తమిళ్ తలైవాస్తో జరిగే మ్యాచ్లో అవకాశం వచ్చింది. కూతకు వెళ్లిన వాడు.. సింహంలా విరుచుకుపడ్డాడు. రెప్పపాటులో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ పాయింట్లు కొల్లగొట్టాడు. కోర్టులో అతని విశ్వరూపం చూసి తెలుగువాళ్ల కరతాళ ధ్వనులతో గచ్చిబౌలి స్టేడియం ప్రతిధ్వనించింది. ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచుల్లో 24 పాయింట్లు సాధించాడు. సబ్స్టిట్యూట్గా వెళ్లిన మ్యాచుల్లో నాలుగు పాయింట్లు చేజిక్కించుకున్నాడు.
నల్లగొండ నుంచే నేషనల్స్కు..
నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన హనుమంతు తండ్రి సుక్కో నాయక్ ఆర్టీసీలో డ్రైవర్. అమ్మ లక్ష్మి గృహిణి. నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పుడే కబడ్డీపై పట్టు సాధించాడు హనుమంతు. పాఠశాల స్థాయిలోనే గెలుపును తన చిరునామాగా చేసుకున్నాడు. పాఠశాల విద్య పూర్తయ్యాక కబడ్డీ క్లబ్బుల చుట్టూ తిరిగేవాడు. ఇంటర్ చదివాక మూడేండ్లు శ్రమించి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో చేరాక కూడా ఆటపై పట్టు సడలించలేదు. ఒకసారి జూనియర్ నేషనల్, మూడుసార్లు సీనియర్ నేషనల్స్లో ఆడాడు. అయితే జట్టు ఓటమితో హనుమంతు ప్రతిభ వెలుగు చూడలేదు.
పోలీసు జట్టులో..
పోలీసుల ఆటలపోటీల్లో తన సత్తా చాటుతూ వచ్చాడు హనుమంతు. దీంతో ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఎల్బీ స్టేడియంలో ‘నవశక్తి క్రీడా మండలి’ (కబడ్డీ క్లబ్)లో చేరాడు. అక్కడ అంతర్జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు మహేందర్రెడ్డి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం మీర్పేట సీఐగా పనిచేస్తున్న ఆయన హనుమంతుకు గురువయ్యాడు.
ప్రతిభకు సానబెట్టాడు. ఎక్కడ కబడ్డీ పోటీలు జరిగినా పోలీసు జట్టులో హనుమంతు ఉండటం ఖాయం. ఇటీవల జరిగిన ఆలిండియా పోలీస్ కబడ్డీ మీట్లో ప్రీ క్వార్టర్ పైనల్స్ వరకూ వెళ్లారు. తన కబడ్డీ ప్రయాణంలో కాలర్బోన్ విరిగినా.. ఆటను మాత్రం వదులుకోలేదు హనుమంతు.
తొలి సీజన్తోనే కొత్త చరిత్ర
ప్రొ కబడ్డీ 9వ సీజన్ వేలంపాటలో హనుమంతు రూ.10 లక్షలు పలికాడు. కొన్నాళ్లు డగౌట్కే పరిమితమైనా.. టాప్-7లో అవకాశం ఇచ్చిన రెండో మ్యాచ్లోనే సూపర్ 10 సాధించాడు. తెలంగాణ నుంచి ప్రొ కబడ్డీలో సూపర్ టెన్ సాధించిన మొదటి ఆటగాడు హనుమంతే. ‘నా ప్రయాణం ప్రొ కబడ్డీతోనే ఆగిపోకూడదు. భారత
దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాను’ అంటాడు హనుమంతు. ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చదువుతున్న హనుమంతు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రులకు అంకితం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ కబడ్డీ కింగ్కు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం!
…? రవికుమార్ తోటపల్లి
ఎం.గోపీకృష్ణ