భారతదేశం వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలకు ఆలవాలం. వాటిని చూస్తేనే అనిర్వచనీయ ఆధ్యాత్మికానుభూతికి గురవుతారు చాలామంది. అలాంటి కోవెలలకు అధికారిక చిహ్నాలుగా కనిపిస్తాయి రాజ గోపురాలు. ఇప్పుడు ఆ గోపుర నమూనాలు ఇంటీరియర్లో భాగంగా మారుతున్నాయి. పండుగలు వరుసకట్టే వేళ వీటితో ఇల్లు మరింత శోభాయమానంగా కనిపిస్తుంది.
ఇంట్లో ఒక్కో గదికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వంటిల్లు, పడకగది, దేవుడిల్లు… ఇలా ఒక్కో దాన్నీ ఒక్కోలా వినియోగిస్తాం. ఆయా చోట్లకు సంబంధించిన అలంకరణలూ ఎంచుకుంటాం. అయితే ఇంట్లోకి రాగానే ఒక సానుకూల అనుభూతి కలగాలంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన రూపాలు అమర్చాలి. అలాంటి వాటిలో ముందుంటాయి దేవాలయ గోపురాలను పోలిన ఈ నమూనాలు. ఇక, పూజా మందిరాలకైతే ఇవి మరింత చక్కని ఎంపిక.
అందం అలంకారం
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎక్కువ. ఆ తర్వాత గణపతి నవరాత్రులు, మరి కొద్ది రోజుల్లో దేవీ నవరాత్రులు వరుసకడతాయి. వీటన్నింటికీ కలశాలు పెట్టుకోవాలన్నా, పూజ చేయాలన్నా చక్కగా ఇంటినీ మంటపాన్నీ అలంకరించుకుంటాం. దాని బ్యాక్గ్రౌండ్గా ఈ దేవాలయ గోపురాలను ఉంచితే సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా వేదిక సిద్ధమవుతుంది. అంతేకాదు, ఇంట్లో దేవుడి మందిరంపై ఉంచడానికీ ఇవి బాగుంటాయి. కొంతమంది ఈశాన్యం మూలను అలంకరించడానికి వీటిని వినియోగిస్తున్నారు. లివింగ్ రూమ్ని కళాత్మాకంగా తీర్చిదిద్దాలనుకునే వారికీ ఇవి మంచి ఎంపిక. చెక్కతో చేసి, రంగులు వేసి ముస్తాబు చేసిన మోడళ్లు ఎక్కువగా దొరుకుతున్నా, ఇత్తడివీ మెటల్తో చేసినవీ కూడా వీటిలో చాలా రకాలు తయారవుతున్నాయి.
పూర్తి గోపురం, కేవలం శిఖరం… ఇలా విభిన్న వెరైటీలూ వస్తున్నాయి. అచ్చం గోపురాల మీద ఉన్నట్టే శిల్పాలు, ఏనుగులు, సింహాలు, లతల్లాంటివన్నీ చూడచక్కగా తీర్చిదిద్దుతున్నారిందులో. వీటి మీద అద్దాలు అమర్చడం వల్ల కాంతి పడ్డప్పుడు వెలుగులు విరజిమ్ముతూ నిజమైన దేవాలయ గోపురాలను ప్రతిబింబిస్తుంటాయి. ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్లతో పాటు, హస్త కళాకారులకు చెందిన వివిధ ఇన్స్టాగ్రామ్ పేజీల్లోనూ ఈ తరహా గోపురాలను అమ్ముతున్నారు. మన ఇష్టాన్నీ, ఇంటీరియర్నూ బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఇంటికి సంప్రదాయ, ఆధ్యాత్మిక శోభను తెచ్చుకోవచ్చు!