Food Trends | బ్రేక్ ఫాస్ట్ కామా లాంటిది. భోజనం ఫుల్స్టాప్ లాంటిది. హఠాత్తుగా వచ్చే పార్టీ పిలుపులు ఆశ్చర్యార్థకాలు. ఇల్లాలు వడ్డించే ఊహించని రుచులు ప్రశ్నార్థకాలు.
– గోద్రెజ్ ఫుడ్ ట్రెండ్స్ రిపోర్ట్ -2023
పొద్దున్నే..
ఇడ్లీ-వడ, మసాలా దోసె, ఉప్మా, కిచిడీ .. ఏదో ఒకటి వండాల్సిందే. నంజుకోడానికి ఏవైనా రెండు చట్నీలు ఉండాల్సిందే. సాంబారు మస్ట్. పక్కనే నేతిగిన్నె ఉంటే బెస్ట్.
మధ్యాహ్నం..
అన్నం, పప్పు, రసం, రెండు కూరలు, రెండు పచ్చళ్లు, ఒక తొక్కు, చల్ల మిరపకాయలు, అప్పడాలు, గడ్డ పెరుగు, పళ్లెం చివరికి పాయసం.. ఏ ఒక్కటి తగ్గినా నాలుక నానా యాగీ చేస్తుంది. నాన్వెజ్ ప్రియులకు ముక్కలు లేకపోతే మనసు చివుక్కుమంటుంది.
సాయంత్రం..
మురుకులు, పేలాలు, అటుకులు, పంటికిందికి మసాలా పల్లీలు.. ప్లేటులో పడాల్సిందే. చివరన వేడివేడి చాయ్ అందాల్సిందే.
రాత్రికి..
జొన్నరొట్టె లేదా చపాతీ ఒకట్రెండు కూరలతో ఆరగించాకే.. నిద్రాదేవి కరుణిస్తుంది.
మన పళ్లెంలో కనిపించేంత వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు, పానీయాలు.. ఎన్ని రుచులు! కొన్ని పండ్ల్లకు పనిచెబుతాయి. కొన్ని పెదాలకు ప్రాజెక్ట్వర్క్ అప్పగిస్తాయి. కొన్ని నాలుకకు న్యాయం చేస్తాయి. కొన్ని కంటికి విందు.
మనం స్వతహాగా భోజన ప్రియులం. పేరుకు మిడిల్క్లాస్ వాళ్లమే అయినా.. తిండి దగ్గర తగ్గేదే లే! వారసత్వంగా ఆస్తిపాస్తులు రాకపోయినా జిహ్వ చాపల్యం మాత్రం జీన్స్లో ఇన్బిల్ట్గా జోడించి పంపాడు బ్రహ్మదేవుడు. గోద్రెజ్ ‘ ఫుడ్ ట్రెండ్స్ రిపోర్ట్-2023’ ఈ విషయాల్ని నిర్ధారిస్తున్నది.
ఎండకాలం, వానకాలం, చలికాలం.. ప్రతి సీజన్కూ ఓ స్నాక్ ఉండాల్సిందే. గెట్ టుగెదర్, కిట్టీపార్టీ, క్యాంటీన్ మీటింగ్.. ప్రతి రీజన్కూ ఓ స్నాక్ కావాల్సిందే. హైదరాబాదీలకు సంబంధించినంత వరకు.. సమోసా ఎప్పుడూ.. సమ్థింగ్ స్పెషల్! ‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం, రాజకీయాల్లో ఈ లాలూ ఉంటాడు’ అని ఓ బిహారీ నేత గొప్పలు చెప్పుకొనేవాడు అప్పట్లో. ఇప్పుడు లాలూ బాబాయ్ జైలూ బెయిలూ అంటూ బతికేస్తున్నాడు. ఆలూ సమోసా మాత్రం.. కార్పొరేట్ స్థాయిని సాధించింది. నిజానికి ఇది మన వంటకం కాదు. టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నాం. టర్కిష్ సంసా .. మన దగ్గరికి వచ్చే సరికి సమోసా అయ్యింది. పన్నెండో శతాబ్దంలో మొఘల్ చక్రవర్తుల వంటశాలలో ఓ వెలుగువెలిగిన మరో టర్కీ వంటకం కబాబ్ కూడా.. ‘బాప్ ఆఫ్ ఆల్ స్నాక్స్’ హోదా సంపాదించింది. చైనీస్ మోమోలు కూడా మంచి పేరే తెచ్చుకున్నాయి. వడాపావ్ ముంబైలో పుట్టి తెలంగాణ బొగ్గుబాయి వరకూ వచ్చేసింది. అశోక్ వైద్య అనే స్ట్రీట్ఫుడ్ వ్యాపారి 1966లో వడాపావ్ను కనిపెట్టాడని అంటారు. పావ్ భాజీ కూడా మనదికాని, మన ఫలహారం. అమెరికా అంతర్యుద్ధ సమయంలో యాదృచ్ఛికంగా పుట్టింది. జన్మస్థానం ఏదైనా.. ఇవన్నీ భారతీయుల అభిమాన రుచుల జాబితాలో చేరిపోయాయి. ఏ దేశానికీ ఇన్నిన్ని ఫలహారాలు లేవు. అందుకే ఈ నివేదిక భారత్ను ‘స్నాకింగ్ నేషన్’గా అభివర్ణించింది.
కరోనా అలవాట్లను మార్చింది. అభిరుచులనూ మార్చింది. ఇల్లంత సుఖం ఎక్కడా లేదనే నిర్ణయానికి వచ్చేశారు భారతీయులు. కొత్త రుచులు ఆస్వాదించాలనుకుంటే.. ఏ స్విగ్గీలోనో, జొమాటో ద్వారానో ఇంటికి తెప్పించుకుంటారు. ‘ఎప్పుడూ బయటి తిండేనా?’ అనుకున్నప్పుడు ఇంట్లోనే ప్రయత్నిస్తారు. అలా అని ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోరు. ఇట్టే తెచ్చి, అట్టే వండేందుకు అనువైన రుచులనే ఎంచుకుంటారు. అన్నిటికి మించి ఆరోగ్యం, పరిశుభ్రత, రుచి, సౌకర్యం.. ఈ నాలుగు అంశాలనూ లక్ష్మణరేఖలుగా భావిస్తున్నారు. దీంతో హోం చెఫ్లకు గిరాకీ పెరిగింది. ఇంటివంటకు గ్లామర్ వచ్చేసింది. ఆ ప్రభావమే కావచ్చు, స్టార్ హోటళ్లు సైతం హోమ్ చెఫ్లను తమ కిచెన్లకు ఆహ్వానిస్తున్నారు. అతిథులు కోరిన రుచులన్నీ వండించి పెడుతున్నారు. ఆరోగ్య స్పృహ అమాంతంగా పెరిగిపోవడంతో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు ఉన్న ఆహారాన్ని మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు.
నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఓ నలుగురూ కూర్చుని చీర్స్ కొడుతున్నారంటే, గ్లాసులు గలగలమనిపిస్తున్నారంటే.. సందేహం లేదు, మందు పార్టీనే అనే నిర్ణయానికి వచ్చేయకండి. అది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అయినా కావచ్చు. ఆయుర్వేద, సిద్ధ విధానాలలో.. అరుదైన వనమూలికలతో తయారుచేసిన పానీయాలకు మార్కెట్లో గిరాకీ పెరుగుతున్నది. దీంతో కాలనీ కో జూస్ బార్ తలుపులు బార్లా తెరుస్తున్నది. అక్కడితో ఆగడంలేదు.. కాఫీ, టీలకు బదులు డిటాక్స్ డ్రింక్స్ ఎంచుకుంటున్నారు. కరోనా తర్వాత ఇమ్యూనిటీ డ్రింక్స్కు ఆదరణ పెరిగింది. అదింకా కొనసాగుతూనే ఉంది. పాలు, పాల ఉత్పత్తులకు బదులుగా.. ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఎంచుకుంటున్నవారి సంఖ్యా తక్కువేం కాదు. వీగనిజం వీరస్థాయిలో విజృభించింది. వందలకు వందలు పోసి ఆల్కలైన్ వాటర్, బ్లాక్ వాటర్.. కొంటున్నారు జనం.
అవును. కుర్చీలు లేకపోతే కూర్చోవడం మానేస్తామా? మధుమేహం పెరిగిపోతున్నంత మాత్రాన మిఠాయిలు ఆపేస్తామా? అల్లుడు అల్లుడే, పేకాట పేకాటే! మిఠాయి మిఠాయే, షుగర్ షుగరే! మరీ ఇబ్బందిగా అనిపిస్తే.. ఇంకో టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. సగటు భారతీయుడు ఇట్లానే ఆలోచిస్తున్నాడు. కాబట్టే, మార్కెట్లో వైన్ షాపులైనా మూత పడతా యేమో కానీ.. మిఠాయిల దుకాణాలు బందైన దాఖలాలు కనిపించడం లేదు. కాకపోతే, పబ్లిక్ డిమాండ్తో.. గతంతో పోలిస్తే స్వీట్ల సైజు తగ్గించారు తయారీదారులు. బెల్లంతో వండే సంప్రదాయ రుచులకు గిరాకీ పెరిగింది. నాణ్యమైన, రుచికరమైన ‘హై ఎండ్’ స్వీట్స్ కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా జనం సిద్ధంగా ఉన్నారు. ఇదే సూత్రం ఐస్క్రీమ్ ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది. ప్రొటీన్ పోర్టిఫైడ్ ఐస్క్రీమ్స్ వస్తున్నాయి. వీగన్ రకాలు సరేసరి. అక్కడక్కడా తాటిబెల్లం ఉపయోగిస్తున్నారు. క్యాలరీల లెక్కలు వేసుకుని ఐస్క్రీమ్స్ ఆర్డర్ చేస్తున్నారు. అన్నట్టు ఐస్క్రీమ్, స్వీట్ కాంబో.. మిఠాయిలూ మార్కెట్ను ఏలేస్తున్నాయి.
జనంలో పర్యావరణ స్పృహ అధికం అవుతున్నది. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకునే సంకుచిత ధోరణి నుంచి సర్వేజనాః సుఖినోభవంతు వైపుగా ఆలోచనల అడుగులు పడుతున్నాయి. రిఫ్రిజిరేటర్ ఎంత కాలుష్యాన్ని వెదజల్లుతుంది, ఏ మేరకు ఓజోన్ పొరను ఛిద్రం చేస్తుంది? అనీ ఆలోచిస్తున్నారు. అత్యవసరమైన పాలు, పెరుగు, కూరగాయలు మొదలైనవాటి కోసం మాత్రమే రిఫ్రిజిరేటర్ వాడుతున్నారు. మంచినీళ్లకు మట్టి కుండలే ఎంచుకుంటున్నారు. పెరటి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెత్తను తడి-పొడిగా విడదీస్తున్నారు. వీలైతే ఆ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారు. అన్నీ పెరట్లో పండించుకోవడం అసాధ్యం కాబట్టి.. నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటే.. అటువైపే మొగ్గు చూపుతున్నారు. వంటింట్లో ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అమలు చేస్తున్నారు. ఇత్తడి, రాగి పాత్రలే కొంటున్నారు. కుక్కర్ పక్కన పెడుతున్నారు. వీలైతే బొగ్గుల పొయ్యి మీద వండుకోడానికి ఇష్టపడుతున్నారు. ఆవు పిడకలు వాడుతున్నవారూ ఉన్నారు. ఇదంతా ‘స్లో ఫుడ్’ ఉద్యమంలో భాగమే. కొందరికి చాదస్తంగా అనిపించినా అనిపించొచ్చు.
పేరుకు హోటలే. కానీ టేబుల్స్ ఉండవు. ‘భోజనం తయార్’ తరహా బోర్డులు ఉండవు. ‘ఆర్డర్ ప్లీజ్’ అనే వెయిటర్లు ఉండరు. కిచెన్లోంచి సుయ్యి సుయ్యి శబ్దాలు ఉండవు. ఉన్నా మనకు వినిపించవు. ‘క్లౌడ్ కిచెన్’ ప్రత్యేకతే ఇది. కాబట్టే వాటిని ‘డార్క్ కిచెన్’, ‘ఘోస్ట్ కిచెన్’ అనీ పిలుస్తారు. ఇవీ హోటళ్లే! కానీ, ‘డెలివరీ ఓన్లీ’ మార్గాన్ని ఎంచుకుంటాయి. ఆన్లైన్లో మాత్రమే ఆర్డర్లు తీసుకుంటాయి. రెస్టారెంట్ రుచులను ఆస్వాదించాలని ఉన్నా.. అంతదూరం వెళ్లి, ఏం కావాలో చెప్పి, తెచ్చేంత వరకూ ఎదురు చూసి, గబగబా తినేసి, బిల్లు కట్టేసి, టిప్పు ఇచ్చేసి.. ఫింగర్ బౌల్లో వేళ్లు అద్దుకుని, టిష్యూ పేపర్తో నోరు తుడుచుకుని.. పార్కింగ్లోని కారు తీసుకుని.. ట్రాఫిక్ను దాటుకుని ఇంటికి వచ్చేంత ఓపిక, సహనంలేని నవతరం కస్టమర్లకు నచ్చిన మార్గం ఇది. కోడింగ్ చేస్తూనే కోడికూర తినేయవచ్చు. ప్రోగ్రామింగ్ రాస్తూనే పాలక్ పనీర్ ఆరగించొచ్చు. ైక్లెంట్ కాల్ అటెండ్ అవుతూనే బరిస్టా కాఫీ తాగేయొచ్చు. జొమాటో, స్విగ్గీతో క్లౌడ్ కిచెన్ ట్రెండ్ ఊపందుకుంది. కమర్షియల్ స్పేస్ అద్దెలు అదిరిపోతున్న పరిస్థితుల్లో అనువైన చోట కిచెన్ తెరుచుకునే వెసులుబాటు ఉంటుంది. సిబ్బంది అవసరమూ తక్కువే. కొన్నిసార్లు ఒంటిచేత్తోనే తయారీ, ప్యాకింగ్ .. రెండూ జరిగిపోతుంటాయి. తిరుగులేని లోకాస్ట్ మాడల్ ఇది. బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్.. క్లౌడ్ కిచెన్ల ఏర్పాటులో దేశంలోనే ముందున్నాయని తాజా నివేదిక చెబుతున్నది.
లోపలి వంటలు ఎంత రుచిగా ఉన్నా.. ప్యాకేజింగ్ను బట్టే ఆకర్షణ. ఈ విషయంలో ఫుడ్ప్రెన్యూర్స్ అస్సలు రాజీపడటం లేదు. కుండలు, వెదురు బుట్టలు, బొంగులు, అరటాకులు, విస్తరాకులు.. ఉపయోగిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించని మెటీరియల్ ఎంచుకుంటున్నారు. కాంబో ఆఫర్లతో ఊరిస్తున్నారు. మిగతా బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకుని డబుల్ ధమాకా ఆఫర్లు కురిపిస్తున్నారు. ముచ్చటైన
ఆ రెండు బాక్సులనూ చూసి కస్టమర్లు మురిసిపోతున్నారు. వేడి తగ్గకుండా, తాజాదనం పోకుండా, సువాసనలు మాయమైపోకుండానే ఇదంతా చేస్తున్నారు. చూడగానే ఆకలి రెట్టింపు అయ్యేంత సృజనా జోడిస్తున్నారు. తిన్న తర్వాత చెత్తలో పడేయకుండా.. శుభ్రంగా కడిగేసి ఏ మొక్కలు నాటుకోడానికో ఉపయోగపడే కుండీల్లాంటి డిజైన్లు కూడా వస్తున్నాయి. పాత న్యూస్పేపరు పొట్లాలతో మొదలైన ప్యాకేజింగ్ పరిశ్రమ ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నదో!
ఒకటిరెండు తరాల క్రితం భారతీయ వంటశాలల నుంచి మాయమైపోయిన సిరిధాన్యాలు మళ్లీ వెనక్కి వచ్చేశాయి. సాధారణ గృహిణుల నుంచి స్టార్ హోటల్ చెఫ్ల వరకూ.. ఎవరికివారు ఆ ముతక గింజలకు రాచమర్యాదలు చేస్తున్నారు. వాటితో కొత్త కొత్త వంటలు కనిపెడుతున్నారు. పాత వంటల్లో విరివిగా వాడుతున్నారు. రాగిజావ, సంకటి, జొన్నరొట్టెలు, ఉలవచారు, కొర్ర పాయసం.. రెస్టారెంట్ల మెనూలలో ప్రత్యక్షం అవుతున్నాయి. మిల్లెట్ బిస్కెట్స్, నూడుల్స్, ఉప్మా మిక్స్, దోసె మిక్స్.. మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. మిల్లెట్స్తో కేకులు చేస్తున్నారు. త్వరలో బీర్ కూడా వస్తున్నది. చాలామంది మిల్లెట్స్ రుచిని ఆస్వాదిస్తూ.. ఆయా దినుసులతో ముడిపడిన తీయని బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. చిరుధాన్యాలను ప్రోత్సహించడం వెనుక సామాజిక కోణమూ ఉంది. ఇవన్నీ మెట్టపంటలు. చినుకులను నమ్ముకుని బతికే
బడుగు రైతులను ప్రోత్సహించినట్టూ ఉంటుంది. వాణిజ్య వ్యవసాయంలో క్రిమిసంహారకాలను గుప్పిస్తారు. దీంతో పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుంది. చిరు పంటలకు ఆ సమస్యే లేదు. దాదాపుగా ఇవి సేంద్రియ ఉత్పత్తులే. గ్లోబలైజేషన్ వల్ల జరిగిన పొరపాట్లను ఇలా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ‘రేపటి గ్లోబల్ సూపర్ ఫుడ్ ఇదే’ అంటున్నది ఫుడ్ ట్రెండ్స్ అధ్యయనం.
పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వెళ్తాం. చారిత్రక ప్రదేశాల సందర్శనకు వెళ్తాం. రుచుల ఆస్వాదనకు మాత్రం ఎందుకు బయల్దేరకూడదు? ఫుడ్ టూర్స్ అలా పుట్టినవే. ఈ ట్రెండ్ గతంలోనే ఉన్నా.. ఇప్పుడు ఊపందుకున్నది. నయా రుచుల అన్వేషణ కోసం అడవుల బాట కూడా పడుతున్నారు. ఆదివాసీల ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. ట్రైబల్ ఫుడ్ లొట్టలేసుకుని తింటున్నారు. స్థానికుల దగ్గర పాకశాస్త్ర పాఠాలు నేర్చుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే హోమ్ స్టే ఆతిథ్యానికే ఇష్టపడుతున్నారు. ఆ కుటుంబంతో కలిసి భోంచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లాంటి చోట్ల ఫుడ్వాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు టూర్ ఆపరేటర్లు. పక్కా లోకల్ రుచులు ఆస్వాదిస్తే కానీ అది ఫుడ్ టూర్ అనిపించుకోదు మరి.
ప్రబంధాల్లో అంగాంగ వర్ణనలే కాదు, అన్నాన్న వర్ణనలూ అనేకం. శ్రీనాథ కవిసార్వభౌముడు, పోతనామాత్యుడు మొదలుకుని ఇప్పటి గరికిపాటి నరసింహారావు వరకు.. ఎవరికివారు శాకపాకాలను సీసాలలోనో, కందాలలనో ఇమిడ్చి మురిసిపోయినవారే. మధ్యలో కాస్త మబ్బుపట్టిన భోజన సాహిత్యానికి మళ్లీ మంచిరోజులొచ్చాయి. ఆహార చరిత్ర గురించి ఎవరు రాసినా బెస్ట్ సెల్లర్స్ జాబితాలో చేరిపోవాల్సిందే. ఫుడ్ బ్లాగర్స్కు సెలెబ్రిటీ హోదా వచ్చేసింది. చెఫ్ పాత్రలు కథానాయకులుగా, నాయికలుగా సినిమాలూ వస్తున్నాయి. తొలి మహిళా చెఫ్గా రికార్డులకెక్కిన తరళా దలాల్ జీవిత కథ ఓటీటీ సినిమాగా రూపుదిద్దుకుంది. మరీ గొప్పగా నడుస్తున్నాయని చెప్పలేం కానీ ఫుడ్ చానెల్స్ కూడా ఉన్నాయి. బుల్లితెర వేదికగా ఫుడ్ చాలెంజ్లూ నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానెల్స్కు అయితే లెక్కేలేదు.
తేనె, పనస, బెల్లం.. తదితర సంప్రదాయ దినుసుల వాడకం మునుపటితో పోలిస్తే పెరిగినట్టే. స్ట్రీట్ఫుడ్.. పునుగుల నుంచి పానీపూరీ వరకూ అన్నీ సూపరే. జనం ఎగబడి తినేస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ రుచులను చూడగానే ఆవురావురుమంటున్నారు. చైనీస్, జపనీస్, థాయ్.. ప్రపంచపటాన్ని నమిలి మింగేట్టున్నారు భోజన ప్రియులు. గోవా, హైదరాబాద్, విజయవాడ.. కొత్త రుచుల రాజధానులుగా పేరు తెచ్చుకుంటున్నాయి. పోషకాలగని మష్రూమ్ చెఫ్ల అభిమాన పదార్థంగా మారింది. మైండ్ఫుల్ ఈటింగ్.. అనే మాట భోజన ప్రియుల ఆహార మంత్రం అయ్యింది. ప్రపంచంలోని ప్రతి రుచీ ఆస్వాదిస్తాం… కాకపోతే, మితమే హితం అంటున్నారు. మంచి మార్పే!