Friendship Day Special | మన మాటల్ని వినేవాడు.. మన ఆకలిని పట్టించుకునేవాడు.. మన ఏడుపునకు స్పందించేవాడు.. మన ఆనందానికి మురిసిపోయేవాడు. ఒక్క స్నేహితుడే. ఆ బంధాన్ని దూరం చేసుకోవద్దు.
స్నేహం అనే రెండక్షరాల పదాన్ని ఒక్కసారి తలుచుకుని చూడండి. కళ్ల ముందు ఎంతమంది గుర్తుకొస్తారో! మనసులో ఎన్ని కథలు మెదులుతాయో! ఎంత సాహిత్యం, ఎన్ని జ్ఞాపకాలు వెల్లువెత్తుతాయో. స్నేహం అనే మాటను కనుక తీసేస్తే… మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని తొలగించేసినట్టే! అందుకే వేదాల్లో స్నేహగుణానికి ‘మిత్ర’ అనే ఒక ప్రత్యేకమైన పేరు ఆపాదించారు. మన బతుకుబండి సాగేందుకు సాయపడే సూర్యుడిని ‘మిత్రాయనమః’ అంటూ గౌరవించారు. ఇది మన దేశం, సంస్కృతి కథ కాదు. లోకంలో మనిషి ఎక్కడుంటే… అక్కడ అతనికి భరోసాగా స్నేహం ఉండాల్సిందే. నాగరికతలో అడుగడుగునా స్నేహం కనిపిస్తూనే ఉంటుంది. కానీ, ఇప్పుడు మాత్రం కాస్త శ్రద్ధగా గమనించాల్సిందే. సోషల్ మీడియానే నిజమైన లోకమనే భ్రాంతిలో లైక్స్ను ఆస్తులుగా, షేర్లను పంపకాలుగా భావించే చిత్రమైన పరిస్థితుల్లో… స్నేహాన్ని నిలుపుకోవడం ఎలా అన్నది ఆలోచించాల్సిన సమస్యే! అలా అని మార్పును ఎదిరించలేం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూనే… స్నేహం విలువను పలుచన చేయకుండా ఉంచే ప్రయత్నమే ఇది.
‘ఫాదర్స్ డే’ వెనకాల ఓ విషాదకరమైన నేపథ్యం ఉంది. ఓ గని ప్రమాదంలో చనిపోయిన కుటుంబాల పెద్దల గౌరవార్థం మొదలైనట్టు చరిత్ర చెబుతున్నది. ‘మదర్స్ డే’కి కూడా ఓ కథ ఉంది. సమాజ సేవకురాలైన తన తల్లి జ్ఞాపకంగా అన్నా జార్విస్ అనే మహిళ వందేండ్ల క్రితం మొదలుపెట్టిన రోజు ఇది. కానీ ‘ఫ్రెండ్షిప్ డే’ అలా కాదు. దాని వెనకాల ప్రత్యేకమైన పరిస్థితులేవీ లేవు. ఆ మాటకొస్తే, గ్రీటింగ్ కార్డుల అమ్మకాలను ప్రోత్సహించేందుకే ఈ రోజును మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. కానీ స్వచ్ఛమైన స్నేహాన్ని తలుచుకునేందుకు, మన జీవితానికి విలువను ఆపాదించే నేస్తాలకు కృతజ్ఞత చెప్పుకొనేందుకు ఈ సందర్భాన్ని బాగానే వినియోగించుకున్నాం. అయితే ఈసారి ఫ్రెండ్షిప్ డే కాస్త భిన్నంగా కనిపిస్తున్నది. వాట్సాప్లో గ్రీటింగ్స్, ఫేస్బుక్ పోస్ట్, ఇన్స్టా రీల్… ఇవే స్నేహానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. నాలుగు కూడళ్ల మధ్య చెరో టీ కప్పు పట్టుకుని, భుజాల మీద చేతులు వేసుకుని చెప్పుకొనే కబుర్లకు బదులు.. చాట్ హిస్టరీనే స్నేహ భాషణగా నిలవబోతున్నది. ఈ మార్పును ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇదే అతిపెద్ద ప్రశ్న.
దాదాపు పదేండ్ల క్రితమే సోషల్ మీడియా మన స్నేహాలను ప్రభావితం చేయనున్నదని గమనించింది.. పీయీడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్. ఆ వాస్తవానికి మద్దతుగా సదరు సంస్థ చేసిన సర్వే, విభ్రాంతికరమైన వాస్తవాలను కళ్లకు కట్టింది. 76 శాతం యువత ఏదో ఒక సోషల్ మీడియా వేదికను వాడుతున్నారనీ, వారిలో చాలామంది కొత్త మిత్రుల కోసం సామాజిక మాధ్యమాల మీదే ఆధారపడుతున్నారనీ తేల్చింది. తమ స్నేహితుల వ్యక్తిత్వం, వాళ్ల జీవితంలోని నిత్య పరిణామాలు తెలుసుకొనేందుకు కూడా 83 శాతం మంది సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. నేటి ఉరుకుల
పరుగుల జీవితంలో ఇది తప్పనిసరి మార్పుగా కనిపించవచ్చు. కానీ సోషల్ మీడియా బంధాలనేవి భౌతిక స్నేహాలకు ప్రత్యామ్నాయం కానేకాదని బల్లగుద్ది చెబుతున్నారు నిపుణులు. అందుకు వాళ్లు చెప్పే కారణాలు..
సామాజిక శాస్త్రంలో డన్బర్ సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. మనుషులు గరిష్ఠంగా ఎంతమందితో సామాజిక బంధాలను నిలబెట్టుకోగలరు అనే లెక్క ఇది. బంధం అంటే ఓ వ్యక్తి పేరు మాత్రమే కాదు. ఆ పేరుతో ఉన్న జ్ఞాపకాలు, ఆ వ్యక్తిపట్ల అభిప్రాయాలు, ఉద్వేగాలు. కాబట్టి, ‘ఓ వ్యక్తి మెదడుకు 150 మందితో బంధాన్ని ఏర్పరుచుకునేందుకు అవసరమైన సామర్థ్యం మాత్రమే ఉంటుంది’ అంటాడు డన్బర్. ఈ సంఖ్య గురించీ, దాన్ని నిర్ధారించడం గురించీ ఎన్నో వాదనలు ఉన్నా… అనుబంధాల సంఖ్యకు పరిమితి ఉందని మాత్రం చాలామంది ఒప్పుకొంటారు. మన సోషల్ మీడియా ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. గాఢత కంటే సంఖ్యకే ఇక్కడ ప్రాధాన్యం. ఓ అంచనా ప్రకారం ఒక్క ఫేస్బుక్లోనే, ఓ వ్యక్తికి సగటున 300 మంది స్నేహితులు ఉంటారు. ప్రతి ఒక్కరూ ‘గుంపులో గోవింద’ అన్నమాట!
కొంతమందికి ఏదైనా కష్టం వస్తే నలుగురూ బిలబిలా పరిగెత్తుకుంటూ వస్తారు. దీనికి కారణం ఆ వ్యక్తి ‘కలుపుగోలుతనం’. పొరుగింటివారి నుంచి, దుకాణదారుడి వరకూ.. ఎవరు ఎదురుపడినా చిరునవ్వుతో పలకరించడం, ఓ రెండు మాటలు ప్రేమగా మాట్లాడటం.. ఈ మాత్రం చొరవ చాలు, మన బంధాలు మెరుగుపరచడానికి. ఈ బంధాలన్నింటినీ మైక్రో-
ఫ్రెండ్స్గాను, ఈ పలకరింపులను మైక్రో-ఇంటరాక్షన్స్గానూ పేర్కొంటారు. ఎమోజీలే పలకరింపులుగా మారిన ఆన్లైన్ రాజ్యంలో ‘కలుపుగోలుతనం’ పలచబడిపోతున్నది. మనిషి ఒంటరివాడవుతున్నాడు.
నచ్చిన ఫుడ్ తినాలి అంటే స్విగ్గీ లేదా జొమాటో. మంచి సినిమా చూడాలి అంటే ఓటీటీ. షాపింగ్ నుంచి సినిమా టికెట్ల వరకూ అంతా ఆన్లైనే. ఒకప్పుడు సినిమాకు బయల్దేరాలంటే.. గుంపు గుంపుగా వెళ్లాల్సిందే. టిఫిన్ చేయడానికైనా ఓ మంద ఉండాల్సిందే. ఇప్పుడు ఆ అవసరమే లేదు! కొన్నాళ్లకు దోస్తుల పెళ్లికి కూడా వర్చువల్ రియాలిటీలో పాల్గొనే కాలం వచ్చేస్తుంది. కానుకల్ని ఇ-గిఫ్ట్ రూపంలో పంపేస్తాం. ఇది సౌలభ్యం కాదు… దురదృష్టకర పరిణామం అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. ఎందుకంటే, ‘షేర్డ్ యాక్టివిటీస్’ వల్ల మనకు తెలియకుండానే బంధాలు మెరుగుపడతాయి. మరొకరి ఇష్టాలు, అయిష్టాలు అర్థమైపోతాయి. వాటికి తగినట్టే నడుచుకుంటాం. ఇక్కడా అవకాశం లేదు.
ఆన్లైన్ స్నేహం కంటే భౌతిక బంధాలే దృఢమని తేలిపోయింది. పోనీ సోషల్ మీడియా అయినా స్నేహాన్ని సాఫీగా నడుపుతున్నదా అంటే.. అదీ అనుమానమే. ఇందుకు స్పష్టమైన ఉదంతాలు కనిపిస్తున్నాయి.
ఫోన్లో నోటిఫికేషన్ శబ్దం వినిపిస్తుంది. అదేమిటో చూసేంతవరకూ నిద్ర పట్టదు. వాటిలో చాలావరకు పనికిరానివని తెలిసినా సరే.. తొంగి చూడకుండా ఉండలేం. ఏది ముఖ్యమో, ఏది కాదో చూస్తేనే కదా తెలిసేది. FOMO- మన ఎరుక, నిజజీవిత బంధాలు, విశ్లేషణా సామర్థ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్నది.
ఎవరి జీవితం బాగుంది, ఎవరు ఎక్కువ విజయం సాధించారు, ఎవరు తెలివైనవారు.. ఇలాంటి పోలికలు ఉన్నచోట స్నేహం వెనకబడుతుంది. కానీ తమ జీవితం బాగుందని లోకానికి చూపించాలనే తాపత్రయంలో సోషల్ మీడియాలో మనం పెట్టే ‘స్టేటస్’లు, ఇన్స్టా ఫీడ్లు, ఫేస్బుక్ పోస్టులు.. తప్పనిసరిగా పోలిక తెస్తాయి. యువతలో ఆత్మన్యూనతకు కారణం అవుతున్నాయి. ఓ సర్వేలో.. ఇలాంటి పోస్టులు తమ ైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నాయని 21 శాతం మంది వాపోయారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వారిలో సగానికి పైగా యువత.. తమకు మాటమాత్రంగా అయినా చెప్పకుండా ఆత్మీయులు ఘనంగా జరుపుకొన్న వేడుకల తాలూకు ఫొటోలు కనిపిస్తూ ఉంటాయని ఓ సర్వేలో వాపోయారు. ఆ తర్వాత ఎప్పుడో మాటల సందర్భంలో మనల్ని పిలవకపోవడానికి కారణం తెలుస్తుంది. మనమూ పరిస్థితిని అర్థం చేసుకుంటాం. ఆ అవకాశం సోషల్ మీడియాలో లేదు. దీంతో ఆత్మీయుల మధ్య దూరాలు పెరుగుతాయి.
సోషల్ మీడియా చూసేందుకు ఇన్ఫార్మల్గా కనిపిస్తుంది. కానీ అందులో ప్రతి చర్యా ఇతరుల అభిప్రాయాల మీద ప్రభావం చూపిస్తుంది. ఓ వ్యక్తి పోస్టులకు లైక్ చేయడం మానేస్తేనో, సరైన ఎమోజీ పెట్టకపోతేనో, ఏదో హడావుడిలో తేలికచేసే కామెంట్ చేస్తేనో… అది అపార్థాలకే కాదు, గొడవలకు కూడా దారితీస్తుంది. ఇలాంటి సంఘటనలతో తమ నేస్తాలతో గొడవపడ్డామంటూ 31 శాతం మంది యూజర్స్ ఓ సర్వేలో చెప్పుకొచ్చారు.
తల్లిదండ్రులతో ఏం పంచుకోవాలి, నేస్తాలతో ఏం షేర్ చేసుకోవాలి, బంధువులకు ఎంతవరకు చెప్పాలి.. ఒకప్పుడు ఇలాంటి పరిమితులు తెలిసేవి. ఇప్పుడు అంతా బట్టబయలే! ప్రేమ నుంచి ద్వేషం వరకూ అంతా తేటతెల్లమే. నేస్తాలకి ఉండే ఆ ఎక్స్క్లూజివ్నెస్ ఇక మిగలనట్టే కదా!
సోషల్ మీడియా మన స్నేహాల్ని హరిస్తున్న విషయం తెలుసుకోవడం ఎలా? ఇంట్లో పిల్లలు కావచ్చు లేదా మనమే కావచ్చు.. సోషల్ మీడియాకు స్నేహాన్ని పణంగా పెడుతున్నాం అనే విషయాన్ని బేరీజు వేసేందుకు కొన్ని సూచనలు..
ఇంటాబయటా, సామాజిక మాధ్యమాల్లో ఎంతోమంది స్నేహితులు ఉన్నా కూడా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని, తనను దూరం పెడుతున్నారనీ బాధపడటం! ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ, చీటికీమాటికీ ఇలాంటి ఆలోచన వస్తున్నదంటే మాత్రం సమస్య మూలాలు వెతకాల్సిందే.
‘వాడిని బాగా నమ్మాను.. కానీ తప్పు చేశాడు’, ‘స్నేహితుల పేరుతో దొంగలు ఉంటారు జాగ్రత్త’.. ఇలా పరోక్షంగా తిట్ల దండకాలతో పోస్ట్ చేయడాన్ని ఇన్డైరెక్ట్ పోస్ట్ లేదా సబ్ ట్వీట్ అంటారు. బంధాల్లో ఉండే చిన్నచిన్న అపార్థాలను నేరుగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా, సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కడం వల్ల మన బాధ తగ్గదు, బంధం గాడినపడదు… పైగా మనలోని ప్రతికూల భావనలు బయటపడతాయి.
జన్మదిన శుభాకాంక్షల దగ్గర నుంచి, ఆప్తుల మరణాల ఓదార్పు వరకూ.. స్నేహితులతో కూడా ఆన్లైన్ ద్వారానే మన సందేశాలు పంపుతూ ఉంటే, కచ్చితంగా తేడా ఉన్నట్టే! మనిషిని పలకరించే సౌలభ్యం ఉన్నా, సాధారణ సంభాషణలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే జరగడం అనర్థమే!
సామాజిక మాధ్యమాలు ఒక వ్యసనంగా మారితే, స్నేహంతో పాటుగా జీవితంలోని ప్రతి అంశమూ ప్రభావితం అవుతుంది. ప్రతి వ్యసనమూ డోపమైన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. తాత్కాలిక సంతోషాన్ని అందించే ఆ హార్మోన్.. మళ్లీమళ్లీ అదే పని చేసేందుకు ప్రేరేపిస్తుంది. సోషల్ మీడియా కూడా ఆ కోవలోకే వస్తుంది. మాటిమాటికీ అకౌంట్ ఓపెన్ చేసి చూడటం, గంటల తరబడి స్క్రీన్కు అతుక్కుపోవడం, సోషల్ మీడియా చూడనప్పుడు చిరాకు పడటం, నెట్ అందుబాటులో లేకపోతే విలవిల్లాడటం… అన్నీ ఈ వ్యసనానికి సూచనలే!
అయిందేదో అయిపోయింది. సోషల్ మీడియా కొత్తగా, ఓ ప్రభంజనంలా విరుచుకుపడిన సాంకేతికత కాబట్టి, అది మన జీవితాల్ని కమ్మేసింది. మరీ ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైనప్పుడు పిల్లలతోపాటే మొబైల్ ఫోన్లకు అలవాటుపడి.. దాని ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడేం చేయాలన్నదే ప్రశ్న. ఈ సవాలుకు కూడా జవాబు స్నేహితుడే. దోస్తులతో మాట్లాడండి. దోస్తులతో దెబ్బలాడండి. దోస్తులతో రాజీపడండి.
టెక్సాస్కి చెందిన షేడన్ వాకర్ పదకొండేండ్ల కుర్రాడు. తనకు మానసిక సమస్యలు ఉండటంతో, ఎవరూ స్నేహానికి ఇష్టపడేవారు కాదు. పైగా చాలామంది విపరీతంగా ఏడిపించేవాళ్లు (బుల్లీయింగ్) కూడా. ఓ రోజు తన పక్కింటి తలుపు తట్టి… ‘మీ ఇంట్లో నాతో స్నేహం చేయడానికి ఎవరైనా పిల్లలు ఉన్నారా?’ అని జాలిగా అడిగాడు షేడన్. ఈ సంభాషణ రికార్డు చేసిన ఆ ఇంటాయన దాన్ని టిక్టాక్లో పెట్టగానే 7 కోట్ల మంది, ఆ వీడియో చూశారు. ఎంతోమంది తనతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతేనా! స్థానికులంతా కలిసి బుల్లీయింగ్కు వ్యతిరేకంగా, షేడన్కు మద్దతుగా ‘షైన్ లైక్ షేడన్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తనకు నచ్చింది కొనుక్కునేందుకు ‘గో ఫండ్ మీ’లో వేల డాలర్లు సేకరించారు. గమనించాలే కానీ సామాజిక మాధ్యమాలు చేసే ఇలాంటి అద్భుతాలెన్నో! తాము కష్టంలో ఉన్నామని ఒక సందేశం పెడితే, ఎవరో ఒక నేస్తం ఆదుకునేందుకు ముందుకు వస్తాడని ప్రతి పదిమందిలో ఏడుగురు ఒప్పుకొంటున్నారు. కానీ సమస్యల్లా… భౌతికమైన బంధాలను కోల్పోకుండా, సామాజిక మాధ్యమాలను మన బలంగా మార్చుకోవడమే!
గొంతు, రూపం.. ఓ మనిషితో ఎంత దగ్గరగా ఉండాలో నిర్ణయిస్తాయి. అందుకే సందేశంతో సరిపెట్టుకోకుండా నేరుగా ఫోన్ చేయండి. దూరమైన నేస్తంతో అయినా మొహమాటం వద్దు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మళ్లీ మాటలు కలిపేద్దాం.
బతుకు వేగం పెరిగిపోయింది. మన గురించి మనమే ఆలోచించలేకపోతున్నాం. అలా అని మిత్రులను మర్చిపోతే దూరం ఇంకా పెరిగిపోతుంది. సందర్భం ఉన్నా లేకున్నా… వారానికో, నెలకో, కనీసం ఆరునెలలకు ఓసారైనా పలకరించాలి. దగ్గరగా ఉంటే నేరుగా, దూరంగా ఉంటే వీడియో కాల్ ద్వారా వివరాలు కనుక్కోవాలి.
గుర్తింపును మించిన బహుమతి లేదు. పుట్టినరోజునో, ఫ్రెండ్షిప్ డే సందర్భంగానో విష్ చేస్తే సంబురపడిపోయే అల్పసంతోషులే నేస్తాలంతా! కాస్త ఓపిక చేసుకుని వారి జీవితంలో ముఖ్యమైన రోజులకు అభినందిద్దాం. ఇష్టాయిష్టాలను గుర్తుంచుకుందాం.
స్నేహంలో చటుక్కున మాటామాటా పెరిగిపోవచ్చు. తిరిగి అనేటప్పుడు కాస్త ఓర్చుకోవడం, ఒకవేళ పొరపాటు జరిగితే తప్పు ఒప్పుకోవడం ముఖ్యం. స్నేహమా, అహమా అన్నది చాలాసార్లు నిర్ణయించుకోవాల్సిన విషయం.
అండగా విజయాన్ని పంచుకునేందుకు ప్రతిఒక్కరూ సిద్ధపడతారు. సుఖాల్లో, విలాసాల్లో ఎవరైనా తోడుంటారు. చెప్పకుండానే నేస్తం కష్టంలో ఉన్నాడని తెలుసుకోవడం, మనకు తోచిన సాయం చేయడమే నిజమైన స్నేహం.
హోదాల్లో తేడాలు ఉండవచ్చు, స్తోమతలో తేడాలు ఉండవచ్చు. కానీ స్నేహం మాత్రం… నేస్తాలంతా సమానమే అనే ప్రాతిపదిక మీద ఉంటుంది.
ఇప్పటికి ఇంతే. మున్ముందు ఇంకెలాంటి మార్పులు వస్తాయో. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్దే రాజ్యం అని తేలిపోతున్న సందర్భంలో రోబోలే నేస్తాలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి లాక్డౌన్లో ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. భౌతిక స్నేహాల విలువ తెలుసుకోగలిగితే.. ఇలాంటి సవాళ్లు ఎన్ని ఎదురైనా అలవోకగా దాటేయవచ్చు. కాకపోతే ఒక్క కథను మాత్రం గుర్తుచేసుకుని స్నేహాల పరిమితిని కూడా తల్చుకుందాం. అనగనగా ఓ గురువుగారు. ఆయనకో గురుకులం. ఒక విద్యార్థి ఆయన దగ్గరికి వచ్చి ‘ఓ వ్యక్తికి ఎంతమంది స్నేహితులు ఉండాలంటారు’ అని అడిగాడు. దానికి గురువుగారు ఎదురుగా ఉన్న జామచెట్టును చూపించి… ‘నీ నేస్తాల సాయంతో ఆ చెట్టు చిటారు కొమ్మన ఉండే ఫలాన్ని తెంపగలవా?’ అని అడిగాడు. ఆ పరీక్ష వెనకాల ఉన్న మర్మం తెలియని విద్యార్థి… తన నేస్తాలందరినీ పిలిచాడు. ఒకరి మీద ఒకరు నిలబడ్డారు, ఉట్టి కొడుతున్నట్టు త్రిభుజాకారంగా మారారు. అయినా, అంత ఎత్తును చేరలేకపోయారు. ఇదంతా చూస్తున్న ఓ నేస్తం తన విల్లును ఎక్కుపెట్టి, ఆ కాయను తెంపేశాడు. గురువుగారు నవ్వుతూ…. ‘నీకు ఎంతమంది స్నేహితులు ఉండాలి అన్నది నీ ఇష్టం. అది నీ స్వభావం, అనుభవాలను బట్టి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో! ఎందరు స్నేహితులు ఉన్నా, వారిలో ఒక్కరైనా సమయస్ఫూర్తి కలవాడు, ఆపదలో ఆదుకునేవాడు అయి ఉండాలి’ అని చెప్పారు.
చర్చిస్తూ పోతే చాలా విషయాలే తడతాయి. కాకపోతే ఓ రెండు అంశాల్ని మాత్రం మనం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. జీవితం ఎంత బిజీగా సాగుతున్నా, ఎన్ని విజయాలు సాధించినా… స్నేహితులు లేకపోతే అది అసంపూర్ణమని గ్రహించాలి. నిజాయతీ స్నేహానికి పునాది అని గమనించాలి.