మనలో ఏ, బీ, ఏబీ, ఓ అనే నాలుగు బ్లడ్గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్వారూ తమకే ప్రత్యేకమైన ఆహార విధానాన్ని అనుసరిస్తే మంచిదని డాక్టర్ల సలహా. దేశంలో ‘ఓ’ గ్రూప్ వారు 37.12 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 32.26 శాతంతో ‘బీ’, 22.88 శాతంతో ‘ఏ’, 7.74 శాతంతో ‘ఏబీ’ గ్రూప్ వారు రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలుస్తారు.
ఓ గ్రూప్..
ఈ గ్రూపు వారిలో ఆల్కలిన్లు, ఫాస్ఫటేస్, లిపోప్రొటీన్ ఏపీఓబీ48 లాంటి ఉదరకోశ ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్లాల కారణంగా జీర్ణకోశ రుగ్మతలు, గ్యాస్ట్రిక్ అల్సర్లు, థైరాయిడ్ తదితర సమస్యలు వస్తాయి. వీరికి యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్, తక్కువ మసాలాలు ఉన్న ఆహారం ఉత్తమం. కూరగాయలు, పండ్లు, పాల పదార్థాలు, చికెన్, గుడ్లు, చేపలు బాగా తినాలి. కెఫీన్, చాక్లెట్లు, మద్యం తీసుకోకూడదు.
ఏ గ్రూప్..
వీరికి మధుమేహం, ఊబకాయం ముప్పు ఎక్కువ. ఆహారం జీర్ణం కావడానికి, జీవక్రియల చురుకుదనానికి తోడ్పడే ఉదర ఆమ్లాలు తక్కువ మొత్తంలో విడుదల అవుతాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువే. కాబట్టి చేపలు, చిక్కుళ్లు, పప్పులు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, మాంసం తక్కువగా తినాలి.
బీ గ్రూప్..
వీరిలో కార్టిసోల్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. దాంతో ఊబకాయం, మధుమేహం, వాపునకు సంబంధించిన రుగ్మతలు అధికం. రోగ నిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు ఎక్కువ. అందువల్ల ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బొహైడ్రేట్లు, కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవాలి. గుడ్డు తెల్లసొన, చికెన్ వీరికి మంచి ఆహారం. రొయ్యలు, పీతలు లాంటివి తీసుకోకపోతే మంచిది. గొడ్డు మాంసం కూడా శ్రేయస్కరం కాదు. మద్యపానం నిషిద్ధం.
ఏబీ గ్రూప్..
ఈ గ్రూప్ వారి జీర్ణాశయంలో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తక్కువ కొవ్వు ఉన్న పాల పదార్థాలు, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. చిన్నమొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు. అరగడానికి సమయం పట్టే మాంసం, మసాలా రుచులకు దూరంగా ఉండాలి. షరా: ఈ విషయంలో వైద్యులదే తుది నిర్ణయం. ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి.