Barley | ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ వేడి పెరిగిపోతున్నది. వేసవి తాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకు, తప్పనిసరిగా ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వేసవిలో శరీరానికి అవసరమైన నీటిని అందించే వాటిలో బార్లీ ఒకటి. బార్లీ నీళ్లు సేవిస్తే మన శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.
బార్లీ నీళ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేడి తగ్గుతుంది. వడదెబ్బ తగలకుండా కాపు కాస్తుంది. బార్లీ నీటితో క్యాల్షియం, ఐరన్, జింక్, రాగితోపాటు అనేక రకాలైన మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.
బార్లీ నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. తద్వారా అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. బార్లీలో ఉండే పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ను నివారిస్తుంది. మలబద్ధకం సమస్యను రూపుమాపుతుంది. మధుమేహంతో బాధపడే వారికి కూడా బార్లీ నీళ్లు మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను బార్లీ అదుపులో ఉంచుతుంది.
బార్లీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ బార్లీ నీళ్లు తాగితే.. మహిళలను ఎక్కువగా బాధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యకు కూడా బార్లీ నీళ్లతో చెక్ పెట్టవచ్చు.
ఎలా చేసుకోవాలి?
ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. 15 నుంచి 20 నిమిషాలపాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తబడి.. వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి వెళ్తాయి. కాసేపయ్యాక గింజలను వడగట్టాలి. ఈ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలుపుకొని తాగేయాలి. బార్లీ నీటిలో మజ్జిగ కలుపుకొని తాగినా శరీరంలో వేడి ఇట్టే మాయమవుతుంది.