ఓ పాతికేండ్ల క్రితం చిన్న పట్టణాల్లో బైక్ నడిపే మహిళలను చిత్రంగా చూసేవారు. అదే, కాలేజి అమ్మాయి అయితే ‘టామ్బాయ్’ అని పిలిచేవాళ్లు. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన శశికళకు కూడా అలాంటి వ్యాఖ్యలు కొత్తకాదు. కానీ, అవేవీ పట్టించుకోలేదామె. మగరాయుళ్లతో సమానంగా బైక్ నడిపేది. కట్స్ కొట్టేది. ఆ అనుభవంతోనే.. ఓ డ్రైవింగ్ స్కూల్లో మహిళలకు ద్విచక్ర వాహనాలు నడపడం నేర్పిస్తున్నది.
ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటి వరకు 300 మందికిపైగా బైక్ డ్రైవింగ్ నేర్పింది శశికళ. ఆమెకు 40 ఏండ్లు పైబడ్డాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాయచూరు జిల్లాలో యునైటెడ్నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్-సాప్ల్యాబ్స్ భాగస్వామ్యంలో ‘ఉన్నతి సఖి’ అనే కార్యక్రమం నడుస్తున్నది. ఈ పథకం కింద మహిళలకు ఆంత్రప్రెన్యూర్షిప్లో శిక్షణ ఇస్తారు. ఈ విషయం శశికళకు తెలిసింది. వెళ్లి చేరింది. ఆ నైపుణ్యంతో డ్రైవింగ్ శిక్షణకు అనుబంధంగా.. మసాలాలు, పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించింది. ద్విచక్రవాహనం మీద తానే డెలివరీ ఇస్తున్నది. ఏదో ఒకరోజు అంబులెన్స్ నడిపి పుట్టిపెరిగిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నది ఆమె ఆలోచన.