రాజ్యాంగం.. భారతీయత అంతరాత్మ! స్వేచ్ఛకు పట్టం కట్టింది.సమానత్వానికి సమున్నత పీఠం వేసింది. సౌభ్రాతృత్వానికి బ్రహ్మరథం పట్టింది. రెండువందల తొంభై తొమ్మిది మంది సభ్యుల ఆలోచనల సమాహారంగా.. ప్రాణంపోసుకుంది. అందులో పదిహేనుమంది మహిళలు. ఆ స్వరాలు ప్రశ్నించాయి, పట్టుబట్టాయి. మెప్పించాయి, ఒప్పించాయి . 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రచనలో మహిళల పాత్రను స్మరించుకుందాం.
కమలా చౌదరి
కమలా చౌదరి లక్నోలో జన్మించారు. ఆడపిల్లల చదువు విషయంలో కుటుంబ కట్టుబాట్లను అధిగమించి హిందీ సాహిత్యంలో రత్న, ప్రభాకర్ పరీక్షలు పాసయ్యారు. భారత స్త్రీలు నిత్య జీవితంలో ఎదుర్కొనే అంశాలపై అనేక రచనలు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్లో చురుగ్గా పనిచేశారు. యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఖాదీ, కుటీర పరిశ్రమల స్థాపన దిశగా దృష్టి సారించారు కమల. శాసనోల్లంఘనలో పాల్గొన్నారు. ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు. 1946లో యునైటెడ్ ప్రావిన్సెస్ (ఉత్తరప్రదేశ్) నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1947 1952 మధ్యకాలంలో ప్రొవిజనల్ పార్లమెంట్లో సభ్యురాలిగా ఉన్నారు. 1962లో ఉత్తరప్రదేశ్లోని హాపుర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆంఖే ఖులీ, సూరియా, స్వప్న, సాధనా కా ఉన్మాద్, ఉన్మాద్, పిక్నిక్, యాత్ర తదితరాలు కమలా చౌదరి ప్రసిద్ధ రచనలు.
మాలతీ చౌదరి
కలకత్తాలో జన్మించారు. పదహారో ఏట బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో చేరడానికి నిరాకరించారు. శాంతినికేతన్లో చేరారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ ప్రభావం మాలతి మీద అపారం. అణగారిన వర్గాలకు సేవ చేయడానికి ఒరిస్సాకు చేరుకున్నారు. స్వతహాగా ఆమె మార్క్సిస్ట్. స్వాతంత్య్ర పోరాటంలో పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. భర్త నబకృష్ణ చౌదరితో కలిసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఒరిస్సా శాఖను నిర్వహించారు. 1934లో గాంధీజీ ఒరిస్సా పాదయాత్రలో భాగ మయ్యారు. జమీందారులు, వడ్డీ వ్యాపారుల పీడనకు వ్యతిరేకంగా రైతుల తరఫున కృషక్ ఆందోళన్కు నాయకత్వం చేపట్టారు. ఒరిస్సా రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. జమీందారీ వ్యవస్థ రద్దు కోసం కృషి చేశారు. ఒరిస్సా నుంచి కాంగ్రెస్ తరఫున మాలతీ చౌదరి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. అయితే అదే ఏడాది తన రాజ్యాంగ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
సుచేతా కృపలానీ
భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు సుచేతా కృపలానీ. తను హర్యానాలోని అంబాలాలో జన్మించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చరిత్ర బోధించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య జేబీ కృపలానీని పెళ్లి చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక ఏడాదిపాటు నిర్బంధానికి గురయ్యారు. యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. జాతీయ పతాకం కోసం నియమించిన సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. ఈ సంఘమే రాజ్యాంగ సభకు మొదటగా జాతీయ పతాకాన్ని నిర్ణయించి, ప్రదర్శించింది. దేశ విభజన సమయంలో బెంగాల్లో అల్లర్లు జరిగినప్పుడు గాంధీజీ వెంట అక్కడికి వెళ్లారు సుచేత. దేశ విభజనలో నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడానికి కృషిచేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ‘సుచేత-ఎన్ అన్ ఫినిష్డ్ ఆటోబయోగ్రఫీ’ ఆమె ఆత్మకథ.
లీలా రాయ్
స్ఫూర్తిదాయక మహిళ.. లీలా రాయ్. అస్సాంలోని గోల్పాడాలో జన్మించారామె. ఢాకా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే చేసిన తొలి మహిళ తనే. లీల చొరవతోనే ఢాకా యూనివర్సిటీలో మహిళలకు సాయంకాలం తరగతులు ప్రారంభించారు. భారత స్వాతంత్య్రోద్యమంలో, ఇతర సామాజిక, రాజకీయ పోరాటాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రేరేపించారు. మహిళల కోసం ప్రత్యేక విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారు. 1923లో దీపాలీ సంఘం స్థాపించారు. ఇందులో మహిళలకు నాయకత్వ నైపుణ్యాలు బోధించారు, శారీరక దృఢత్వ శిక్షణ ఇప్పించారు. మహిళలు ఖద్దరు వడకడానికే పరిమితం కాకుండా ఉద్యమంతో మరింతగా మమేకం కావాలని కోరుకున్నారు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కార్యవర్గంలో సభ్యురాలయ్యారు. బెంగాల్ శాసన సభ నుంచి లీలా రాయ్ రాజ్యాంగసభకు ఎన్నికయ్యారు. అయితే, దేశ విభజనకు నిరసనగా తన సభ్యత్వానికి రాజీనామా చేశారామె.
దుర్గాబాయి దేశ్ముఖ్
స్వాతంత్య్ర పోరాటంలో మహిళలు అనగానే.. తెలుగువారికి వెంటనే గుర్తుకొచ్చే పేరు దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడిదల దుర్గాబాయి రాజమండ్రిలో జన్మించారు. పన్నెండో ఏట నుంచే స్వాతంత్య్ర పోరాటంలో భాగమయ్యారు. పద్నాలుగో ఏట కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో వలంటీర్గా చురుగ్గా పనిచేశారు. 1930లో మద్రాసులో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఫలితంగా, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసింది. జైలులో ఉన్నప్పుడే ఇంగ్లిష్ మీద పట్టు సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. కొన్నాళ్లు అక్కడే ప్రాక్టిస్ చేశారు. తెలుగు యువతులకు విద్యతోపాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ‘ఆంధ్ర మహిళ’ అనే పత్రికను కూడా నడిపారు. 1946లో మద్రాసు ప్రావిన్స్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. జాతీయ భాష, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, మానవ అక్రమ రవాణా మొదలైన విషయాల్లో రాజ్యాంగ సభ చర్చల్లో తనదైన ముద్రవేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వుమెన్స్ ఎడ్యుకేషన్, ప్లానింగ్ కమిషన్ మొదలైన కీలకమైన సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు.
హంసా జీవరాజ్ మెహతా
1947 ఆగస్టు 15.. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన సమావేశంలో రాజ్యాంగ సభకు జాతీయ పతాకాన్ని అందించిన వ్యక్తిగా హంసా జీవరాజ్ మెహతా
చరిత్రలో నిలిచిపోయారు. హంస గుజరాత్లో జన్మించారు. బరోడా కాలేజీలో తత్వశాస్త్రం అభ్యసించారు. ఇంగ్లండ్లో జర్నలిజం, సోషియాలజీ చదివారు. సరోజినీ నాయుడు స్వయంగా హంసా మెహతాను మహాత్మా గాంధీకి పరిచయం చేశారు 1937లో బొంబాయి శాసన మండలికి ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాన్ని కాదని, జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం హంస ఆత్మవిశ్వాసాన్ని చాటుతుంది. ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షురాలిగానూ బాధ్యతలు స్వీకరించారు. సమానత్వం, పురుషులతో సమాన హక్కులు డిమాండ్ చేశారు. బొంబాయిలోని ఎస్ఎన్డీటీ మహిళా విశ్వ విద్యాలయానికి తొలి మహిళా ఉపకులపతిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బొంబాయి నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. మహిళల హక్కులు, ఉమ్మడి పౌర స్మృతి, రిజర్వేషన్లు తదితర అంశాలపై రాజ్యాంగ సభలో చర్చించారు.
అమ్ము స్వామినాథన్
కేరళలోని పాలక్కాడ్లో జన్మించారు. ఇంగ్లిష్ నేర్చుకుని మద్రాస్ వెళ్లిపోయారు. అక్కడే రాజకీయాలు, మహిళల హక్కుల ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ‘మద్రాసులో వుమెన్స్ ఇండియా అసోసియేషన్’ స్థాపనలో కమలాదేవి ఛటోపాధ్యాయ, అనీబిసెంట్, ముత్తులక్ష్మి రెడ్డియార్తో కలిసి పనిచేశారు. వుమెన్స్ ఇండియా అసోసియేషన్.. బాల్య వివాహాలు, దేవదాసీ వ్యవస్థ లాంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా కృషిచేశారు. పురుషులతో సమానంగా స్త్రీలకూ ఓటు హక్కు కల్పించాలంటూ మాంటేగ్ చెమ్స్ఫర్డ్ కమిషన్, సౌత్బరో కమిషన్లకు విజ్ఞాపనలు సమర్పించారు. అమ్ము స్వామినాథన్ క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత, మద్రాస్ నియోజకవర్గం నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. సభలో ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల గురించి విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత కూడా రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
దాక్షాయణీ వేలాయుధన్
దళిత హక్కుల నాయకురాలు దాక్షాయణి కేరళలోని కొచ్చిన్ సమీపంలో ఉన్న బోల్గట్టి దీవిలో జన్మించారు. తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొన్న పులయ కులంలో పుట్టిన దాక్షాయణి.. ఆ సమూహం నుంచి విద్యావంతురాలైన తొలి మహిళ. పై వస్త్రం ధరించిన తొలి మహిళ కూడా ఆమే. త్రిస్సూర్లో ఉపాధ్యాయు రాలిగానూ పనిచేశారు దాక్షాయణి. ఉప్పు సత్యాగ్రహంతో స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితురాలయ్యారు. ట్రావెన్కోర్ ప్రభుత్వం దాక్షాయణిని కొచ్చిన్ నుంచి రాజ్యాంగ సభకు నామినేట్ చేసింది. నాటి సభలో ఆమె ఏకైక దళిత మహిళ. అప్పటికి తనకు 34 ఏండ్లే. దళితులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు దాక్షాయణి డాక్టర్ అంబేద్కర్కు బాసటగా నిలిచారు. అంటరానితనం, రిజర్వేషన్లు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు మొదలైన విషయాల గురించి విలువైన సూచనలు చేశారు. ఎన్నికలు జరిగి తొలి లోక్సభ ఏర్పడే వరకు దాక్షాయణి, ఆమె భర్త వేలాయుధన్ ప్రొవిజనల్ పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్లో సభ్యులైన తొలి దళిత దంపతులు వీరిద్దరే. మహిళా సాధికారతకు కృషి చేసిన వారికి కేరళ ప్రభుత్వం దాక్షాయణీ వేలాయుధన్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది.
సరోజినీ నాయుడు
స్వాతంత్య్ర సమర యోధురాలు, కవయిత్రి సరోజినీ నాయుడు. ఆమె హైదరాబాద్లో జన్మించారు. లండన్లో ఉన్నత విద్య అభ్యసించారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించారు. 1925లో కాంగ్రెస్ తొలి భారతీయ మహిళా అధ్యక్షులుగా వ్యవహరించారు. హోమ్రూల్, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్లారు. బీహార్ నుంచి రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ రూపకల్పనలో.. జాతీయ పతాకం విషయంలో ఏర్పాటైన ఉప సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. సభలో తనదైన శైలిలో జాతీయ పతాకం ప్రాధాన్యం వివరించారు.
విజయలక్ష్మీ పండిట్
విజయలక్ష్మీ పండిట్ అలహాబాద్లో జన్మించారు. జాతీయవాద నాయకుడు మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి తల్లిదండ్రులు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ తోబుట్టువు ఆమె.అలహాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా మొదలైన విజయలక్ష్మి రాజకీయ ప్రస్థానం ఐక్యరాజ్య సమితి వరకు సాగింది. 1937 1939 యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభలో స్థానిక సంస్థలు, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. దౌత్యవేత్తగా మారిపోయారు. ఐక్యరాజ్య సమితిలో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. వివిధ దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ‘ద స్కోప్ ఆఫ్ హ్యాపినెస్’ విజయలక్ష్మీ పండిట్ స్వగతం.
పూర్ణిమా బెనర్జీ
గాంధీజీ పిలుపు మేరకు వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. అలహాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పూర్ణిమా బెనర్జీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల అనుసంధానానికి కృషిచేశారు. రైతులు, కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. సభలో ప్రవేశిక, నివారక నిర్బంధం (ప్రివెంటివ్ డిటెన్షన్), రాజ్యసభ సభ్యుల అర్హతలు మొదలైన అంశాల గురించి చర్చించారు.
రాజకుమారి అమృత్ కౌర్
కపుర్తలా రాజ కుటుంబానికి చెందిన రాజకుమారి అమృత్ కౌర్ స్వతంత్ర భారత తొలి ఆరోగ్య శాఖ మంత్రి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. తన 20వ ఏట భారత్ తిరిగొచ్చారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. పర్దా పద్ధతి, బాల్య వివాహాలు, దేవదాసి సంప్రదాయం లాంటి సామాజిక సమస్యలపై పోరాడారు. 1927లో ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ స్థాపకుల్లో ఒకరు. 1934లో వార్ధాలోని గాంధీజీ సేవాగ్రామ్
ఆశ్రమంలో చేరారు. దానికి పదహారేండ్లపాటు కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్ తరఫున సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగ రూప కల్పన సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు. 1956లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అలా దేశంలో వైద్యవిద్య మెరుగుపడేందుకు కృషిచేశారు.
బేగం ఐజాజ్ రసూల్
పంజాబ్లోని మాలేర్కోట్ల సంస్థాన వారసురాలు బేగం ఐజాజ్ రసూల్. చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేశారు. పర్దా పద్ధతిని నిరాకరించారు. యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభ సభ్యురాలిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. బ్రిటిష్ ఇండియాలో అన్-రిజర్వ్డ్ స్థానం నుంచి ఎన్నికైన అతికొద్ది మహిళా శాసనసభ్యుల్లో ఒకరు. జమీందారీ విధానం లాంటి భూస్వామ్య లక్షణాలను వ్యతిరేకించారు. రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం కలిగిన ఏకైక ముస్లిం మహిళ.. ఐజాజ్ రసూల్. ముస్లిం లీగ్ తరఫున యునైటెడ్ ప్రావిన్సెస్ (ఇప్పటి ఉత్తరప్రదేశ్) నుంచి సభకు ప్రాతినిధ్యం వహించారు. దేశ విభజన అనంతరం భారత్లో ముస్లిం లీగ్ రద్దు కావడంతో.. కాంగ్రెస్లో చేరిపోయారు. జాతీయ భాష, కామన్వెల్త్ కూటమిలో భారత్ సభ్యత్వం, రిజర్వేషన్లు, ఆస్తి హక్కులు, మైనారిటీ హక్కులపై రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్నారు. పదునైన వ్యాఖ్యానాలు చేశారు. స్వాతంత్య్రం తర్వాత కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారామె. ఐజాజ్ రసూల్ ఆత్మకథ ‘పర్దా టు పార్లమెంట్’ నాటి సమాజాన్ని కళ్లకు కడుతుంది.
రేణుకా రాయ్
బెంగాల్లో జన్మించిన రేణుకా రాయ్ కలకత్తాలో చదివారు. చిన్నప్పటి నుంచే భారత రాజకీయాలను గమనిస్తూ వచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ పిలుపు అందుకుని ఆయన ఆశ్రమంలో చేరిపోయారు. మహాత్ముని సారథ్యంలో జరిగిన సత్యాగ్రహాల్లో భాగమయ్యారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లారు. మహిళల హక్కుల కార్యకర్తగా రేణుకా రాయ్ ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్కు కార్యదర్శిగా ఉన్నారు.
మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కృషిచేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. మహిళల హక్కులు, మైనారిటీల అంశాలు, మైనారిటీ హక్కులు, చట్టసభల్లో రెండు సభలు ఉండటం లాంటి అంశాలపై చర్చించారు. భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు వెళ్లారు.
అనీ మాస్కరీన్
అనీ మాస్కరీన్ త్రివేండ్రంలో జన్మించారు. చరిత్ర, ఆర్థికశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. న్యాయశాస్త్రం కూడా చదివారు. ట్రావెన్కోర్- కొచ్చిన్ స్వదేశీ సంస్థానం తరఫున రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించారు. సభలో ఆమె సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడారు. ట్రావెన్కోర్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మాస్కరీన్ తొలి లోక్సభకు ఎన్నికయ్యారు. అంతేకాదు కేరళ నుంచి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళ కూడా ఆమే. రాజకీయాల్లో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమైన విషయమంటూ మాస్కరీన్ లేవనెత్తిన చర్చ అందర్నీ ఆలోచింపపేసింది.