ఉదయాన్నే స్టీరింగ్ పట్టి, లీటర్ పెట్రోల్, గ్యాస్ పోయించి సాయంత్రానికి నాలుగు పైసలు ఇంటికి తీసుకెళ్లే ఆటోడ్రైవర్ల బతుకులు నేడు ప్రశ్నార్థకంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి ఎదురవుతున్న సవాళ్లు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇస్తామని హామీఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికి మొండిచేయి చూపించింది. ఇదేగాక మహిళలకు ‘ఉచిత బస్సు’ పథకం పెట్టడంతో ఆ ప్రభావం ఆటోల మీద పడి వారి జీవనం దుర్భరంగా మారింది. రోజంతా కష్టపడినా కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో బతుకీడుస్తున్నారు. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆపన్న‘హస్తం’ అందించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. నేడు (సోమవారం) ఆటోల బంద్కు పూనుకున్నారు. బంద్కు కార్మిక సంఘాలు, పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే, ఆదివారం రాత్రి జరిగిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆటో కార్మికులు బంద్ విరమించుకున్నారు.
-మధిర, ఆగస్టు 23
ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 15,000 మందికి పైగా ఆటో కార్మికులు తమ జీవనోపాధి కోసం ఆటోలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కుటుంబాల పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు అన్ని ఈ మూడంచెల బండి నడిస్తేనే గడిచే పరిస్థితి. ఆటో కార్మికుల సమస్యల పరిషారం కోసం పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు సైతం ఉద్యమాలు చేపట్టారు. ఆటోడ్రైవర్ల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రూ.12 వేలు ప్రకటనకే పరిమితం..
కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో, టాక్సీడ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. అయితే, అధికారంలోకి వచ్చి సంవత్సరాల సమయం గడుస్తున్నా ఈ పథకం అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడం, ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దెబ్బతీసిన ‘ఉచిత బస్సు’..
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటో కార్మికుల ఆదాయం సగానికి పైగా పడిపోయింది. గతంలో స్వల్ప దూరాలకు కూడా ఆటోలను ఆశ్రయించే మహిళా ప్రయాణికులు, ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. దీనివల్ల నిత్యం రూ.700 నుంచి రూ.1,000 వరకు వచ్చే నికర ఆదాయం ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ ఖర్చులు పోను రూ.200, రూ.300కి పడిపోయిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు.. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆర్టీసీయే సొంతంగా లేదా అనుబంధంగా ఆటో సేవలను ప్రారంభించబోతోందనే వార్తలు ఆటో కార్మికుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే జరిగితే సాధారణ ఆటోడ్రైవర్ల ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని వాపోతున్నారు.
ఫైనాన్స్ భారంతో ఆటోడ్రైవర్లు ఉకిరిబికిరి
చాలామంది ఆటోడ్రైవర్లు ప్రైవేట్ ఫైనాన్షియర్లు, బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు లోన్లు తీసుకుని ఆటోలు కొనుగోలు చేశారు. రోజువారీ ఆదాయం పడిపోవడంతో ప్రతి నెలా ఈఎంఐ చెల్లించలేకపోతున్నారు. ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు, ఫెనాల్టీల భయంతో అనేకమంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆదాయంలేక, లోన్లు తీర్చలేక ఖమ్మంజిల్లాలో కొందరు ఆటోలను అమ్ముకుంటుంటే, మరికొందరు ప్రత్యామ్నాయ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ఆటో కార్మికులకు ప్రత్యేక జీవనభృతి అందించాలి. నెలకు రూ.3 వేల భత్యం లేదా సంవత్సరానికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించాలి. ఆర్టీసీ ద్వారా ఆటోలు నడిపే ఆలోచనను విరమించుకోవాలి. ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే భరోసా కల్పించాలి.
-తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ నాయకుడు
కుటుంబ పోషణ భారమైంది..
మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటోరంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆటో ఎకేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కుటుంబపోషణ భారంగా మారింది. ఒకవైపు ఆదాయం లేక, మరోవైపు నెలవారీ వాయిదాలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఆర్థిక సహాయాన్ని అందించి ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి.
-శివ, ఆటోడ్రైవర్, మధిర
కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది..
ఆటోడ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల ఆటోడ్రైవర్ల ఆదాయం పడిపోయింది. కనీసం వాహనాల ఈఎంఐలు, డీజిల్ ఖర్చులు కూడా వెళ్లదీయలేని పరిస్థితి. నిత్యావసరాలు తీరక, పిల్లల సూల్ ఫీజులు కట్టలేక కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఫైనాన్సియర్లు, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేకపోతున్నాం.
-షేక్ అప్సర్, ఆటోడ్రైవర్, మధిర