గోదావరిఖని, డిసెంబర్ 24 : సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నారని, దీనికి కార్మికులంతా తరలిరావాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ నెల 26న ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరిఖని చౌరస్తాలో తలపెట్టిన నిరసన పోరు దీక్షకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ నాయకుడు పీటీ స్వామి పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని చెప్పి వెళ్లి తీరా గనుల ప్రైవేటీకరణకు తలుపులు తెరిచాడని మండిపడ్డారు. అందులో భాగంగానే సింగరేణి సంస్థకు చెందాల్సిన నాలుగు బొగ్గు బ్లాకులను రాత్రికి రాత్రే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి వేలం వేయడాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్లో సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని, ఇప్పటి నుంచే కేంద్రం వైఖరిని ఎండగట్టాలని సూచించారు. 26న గోదావరిఖని చౌరస్తాలో జరిగే పోరు దీక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పార్లపల్లి రవి, జేవీ రాజు, మారుతి, టీ శంకర్, శ్రీను, శ్రావణ్, శ్రీకాంత్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ చైతన్యంతో అడ్డుకుందాం..
తెలంగాణ ఉద్యమ చైతన్యంతో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుందామని, సింగరేణి ఉద్యమ సెగ కేంద్రానికి తాకాలని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నాయకత్వంలో జరిగే పోరు దీక్షను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి మూల విజయారెడ్డి కోరారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. గత నెలలో ప్రధానమంత్రి హోదాలో రామగుండానికి వచ్చిన నరేంద్ర మోడీ ఈ ప్రాంత అభివృద్ధిపై తమకు విశ్వాసం ఉందని మాట్లాడుతూనే సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని కచ్చితమైన హామీ ఇచ్చారన్నారు. వెంటనే ఢిల్లీ వెళ్లాక మాట మార్చి నేడు కేంద్ర మంత్రితో సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు టెండర్లు ఆహ్వానించారని వాపోయారు. తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ ఈ నెల 26న గోదావరిఖనిలో ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో చేపడుతున్న సింగరేణి పోరు దీక్ష విజయవంతానికి ప్రతి ఇంటి నుంచి మహిళలు, సింగరేణీయులు పార్టీలకతీతంగా తరలిరావాలని కోరారు. కార్పొరేటర్లు కృష్ణవేణి, జనగామ కవిత సరోజని, నాయకులు కళావతి, సంధ్యారెడ్డి, శాంత, సరిత, నాగమణి, స్వాతి, సరజ పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం
ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధమవుదామని కేరళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, సీఐటీయూ నాయకులు శివన్కుట్టి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22, 23వ తేదీల్లో సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. కార్మికులపై చిన్నచూపు చూస్తూ హక్కులు పెద్దలకు తాకట్టు పెడుతున్న ప్రభుత్వాల నిరంకుశ విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందని, భవిష్యత్లో మరింత ఎక్కువగా ఐక్య ఉద్యమాలు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా టీ రాజారెడ్డి, కార్యదర్శిగా ఎరవెల్లి ముత్యం రావు, వర్కింగ్ కమిటీ సభ్యులుగా వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్, రామాచారి, జ్యోతి, వడ్లకొండ నాగమణిని ఎన్నుకున్నారు. వీరి ఎన్నికపై పలువురు హర్షం వ్యక్తంచేశారు.
సభకు తరలిరండి
సింగరేణి గనుల పరిరక్షణ కోరుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ నెల 26న తలపెట్టిన పోరుసభకు పారిశ్రామిక ప్రాంతంలోని గంగపుత్రులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గంగపుత్ర సంఘం నాయకులు బంగారి సుభాష్ కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఈ నెల 26న ఎమ్మెల్యే చందర్ నాయకత్వంలో తలపెట్టిన పోరు సభకు రామగుండం కార్పొరేషన్ పరిధి 50 డివిజన్ల నుంచి గంగపుత్రులు హాజరై మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సాంబమూర్తి, సదానందం, కిరణ్, రామకృష్ణ, శ్రీనివాస్, నారాయణ ఉన్నారు.
దీక్షను జయప్రదం చేయండి
యైటింక్లయిన్కాలనీ డిసెంబర్ 24 : సింగరేణి పరిరక్షణ కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తలపెట్టిన పోరు దీక్షను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేడి సదానందం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శనివారం టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్, బదావత్ శంకర్నాయక్, డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్తో కలిసి పోరు దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేసేందుకు పన్నుతున్న కుట్రలో భాగంగా సింగరేణిని ప్రైవేట్ పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. కేంద్రం పన్నుతున్న కుట్రలకు నిరసనగా ఈ నెల 26న గోదావరిఖని చౌరస్తాలో ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో సింగరేణి పోరు దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ దీక్షలో పారిశ్రామిక ప్రాంత ప్రజలు, కార్మిక వర్గం పెద్దసంఖ్యలో పాల్గొని కేంద్రం కుట్రలను తిప్పికొట్టేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు విజయ, ఎరవెల్లి గోపాల్రావు, గౌస్పాషా, పోగుల వీరారెడ్డి, గూడెల్లి రాంచందర్, పులి రాకేశ్, ప్రశాంత్గౌడ్, సారయ్యనాయక్, బుర్ర తిరుపతి, కుమార్యాదవ్, మధు, రమేశ్, కుమార్, ఎలుకలపల్లి సదయ్య తదితరులు పాల్గొన్నారు.