ఖమ్మం, మే 21: ఖమ్మం నగర పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దీంతో జర్నలిస్టుల కల నెరవేరిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మంత్రికి నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇండ్ల స్థలాల కేటాయింపునకు 23 ఎకరాలు ఇచ్చిందన్నారు. తాను దశాబ్దాల నుంచి జర్నలిస్టుల కష్టాలను చూస్తున్నానని, వారి కోరిక నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానన్నారు.
ఇండ్ల స్థలాల కేటాయింపునకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్రావు, ప్రభుత్వ సీఎస్ శాంతకూమారి, ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులు సహాయ సహకారాలు అందించారన్నారు. బీపీఎల్ విభాగంలో ఒక్కొక్కరికీ కేవలం 70 గజాల స్థలం మాత్రమే ఇవ్వడం కుదురుతున్నదని, ఈ సమస్యను అధిగమించేందుకు కేసీఆర్ పేరిట సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. స్థలాల కేటాయింపు తర్వాత జర్నలిస్టులు నిరభ్యంతరంగా ఇండ్లు నిర్మించుకోవచ్చన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో తనకు స్థానం లభించడం తన అదృష్టమన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నదని కొనియాడారు. జర్నలిస్టు కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.2 కోట్ల స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) నిధులు విడుదల చేస్తున్నామన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కలను నెరవేర్చి మంత్రి అజయ్కుమార్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాంనారాయణ అన్నారు. మంత్రి అజయ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఉమ్మడి పాలకులు జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు స్థలాలు అందబోతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా ఛైర్మన్ బచ్చు విజయకుమార్, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మాటేటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు మైసా పాపారావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, అక్రిడేషన్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పరిటాల సత్యనారాయణ, యూనియన్ జిల్లా కోశాధికారి నాగండ్ల శివానంద, కెమెరామెన్ అసోసియేషన్ నాయకుడు అప్పారావు, నాయకులు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తదిరులు పాల్గొన్నారు.