ఖమ్మం సిటీ/ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 13 : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు.
రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాల, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మద్దులపల్లిలో శంకుస్థాపన చేయనున్న నర్సింగ్ కళాశాల ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మద్దులపల్లిలో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకు తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి రూ.25కోట్లు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం మెడికల్ కళాశాలతోపాటు యూత్ ట్రైనింగ్ సెంటర్లో నర్సింగ్ కళాశాల తాత్కాలిక భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, ఖమ్మం ఆర్డీవో జీ.గణేశ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రత్నకుమారి, టీఎస్ఎంఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రామకృష్ణ, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.