మధిర : మధిర కోర్టులో శనివారం జాతీయ మెగాలోక్అదాలత్లో భాగంగా మండల న్యాయసేవాఅధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ డీ.ధీజర్కుమార్ ఆధ్వర్యంలో మెగా లోక్అదాలత్ నిర్వహించారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జీ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టులలో వివిధ కేసులను పరిష్కరించారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జీ కోర్టులో 425 కేసులు పరిష్కారం కాగా, 4 సివిల్ కేసులు, 8 ఎక్సైజ్ కేసులు, 412 క్రిమినల్ కేసులు పరిష్కరిస్తూ రూ.2,55,000 జరిమానా విధించారు. అదేవిధంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జీకోర్టులో 199 క్రిమినల్ కేసులు పరిష్కారం కాగా రూ.2,06,600 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ క్షణికావేశంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకొని సహృద్భావ వాతావరణంలో కేసులు పరిష్కరించాలని, ప్రశాంతంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భైరవభట్ల శ్రీనివాసరావు, మధిర పట్టణ ఎస్సై సతీష్, రూరల్ ఎస్సై రవికుమార్, పోలీస్స్టేషన్లకు సంబంధించిన ఎస్హెచ్వోలు, ఏపీపీ నాగలక్ష్మీ, కోర్టు సూపరిండెంట్ కృష్ణమోహన్, న్యాయవాది గంధం శ్రీనివాసరావు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.