ఖమ్మం వ్యవసాయం, మార్చి 12: ఆడపిల్లలు అదృష్టానికి చిరునామాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో భాగంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా సంక్షేమ అధికారి రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మహిళలు పురుషులతోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు, షీటీం వంటి వ్యవస్థలు మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా నిలిచాయని గుర్తుచేశారు.
అనంతరం ట్రైనీ ఐపీఎస్ మౌనిక మాట్లాడుతూ.. సమాజంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలంటే ఆర్థిక వనరులతో పనిలేదని, కేవలం కృషి, పట్టుదల ఉంటే సరిపోతుందని అన్నారు. అవి మాత్రమే మహిళలకు విజయసోపానాలుగా నిలుస్తాయని అన్నారు. బాలికలు ముఖ్యంగా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయా రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను అధికారులు సత్కరించారు. తరువాత కేజీబీవీలు, టీఎస్ఆర్జీసీ విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫాతిమా జోహార్, భారతీరాణి, భూలక్ష్మి, నీలోహన, కవిత, కమలప్రియ, బాలాత్రిపురసుందరి తదితరులు పాల్గొన్నారు.