ఖమ్మం, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగర విస్తరణలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ముఖ్యభూమిక పోషిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నగరంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని నగరాభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తున్నారు. ఇప్పుడు నగరం రాష్ర్టానికే ఐకాన్గా నిలుస్తున్నది. ఇప్పటికే నగరంలో చేపట్టిన అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు, అధికారులు స్వయంగా ఇక్కడికి వచ్చి వీక్షించారు. ఖమ్మం నగర అభివృద్ధి మోడల్కు అనుగుణంగా తమ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే సుడా పరిధిలోని గ్రామాలూ ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. సుడా ఏర్పడి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
రెండు దశాబ్దాల విజన్తో..
ఉమ్మడి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత వాటి సంఖ్య 10కి చేరింది. దీనిలో భాగంగా ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం 24 అక్టోబర్ 2017న స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్గా విజయ్కుమార్, పాలకవర్గ సభ్యులుగా 15 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం సుడా పరిధిలో నగరపాలక సంస్థతో పాటు 46 గ్రామాలు ఉన్నాయి. పాలకవర్గం రానున్న 20 ఏళ్లలో భౌగోళికంగా నగరంలో స్థితిగతులు, జనాభా పరంగా అంచనా వేసి అభివృద్ధి పనులు చేపడుతున్నది. ఆ పాలనకు ముచ్చటగా మూడేళ్లు పూర్తయింది.
రూ. 43.97 కోట్లతో అభివృద్ధి..
సుడా ఇప్పటివరకు రూ.43.97 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. నగరంతో పాటు ఆయా గ్రామాల్లో ఇప్పటికే రోడ్లు, డ్రెయిన్లు, డివైడర్స్, లైటింగ్, సెంట్రల్ లైటింగ్ బృహత్ ప్రకృతి వనం వంటి 90శాతం పనులు పూర్తయ్యాయి. వి.వెంకటాయపాలెంలోనూ రూ.2 కోట్లతో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డివైడర్ల నిర్మాణం పూర్తయింది. రఘునాథపాలెం సమీపంలోని 14 ఎకరాల సువిశాల స్థలంలో రూ.2 కోట్లతో సుడా పార్ అందుబాటులోకి వచ్చింది. పార్క్ ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సుడా చొరవతో రియల్ వ్యాపార రంగమూ దూసుకుపోతున్నది. సుడా ఏర్పడక ముందు స్థానిక సంస్థలకు గిఫ్ట్ చేసిన ఓపెన్ స్పేస్, గ్రీన్ బెల్ట్ స్థలాల వైశాల్యం 21.26 ఎకరాలు ఉండగా ప్రస్తుతతం ఆ వైశాల్యం 100 ఎకరాలకు చేరుకున్నది. ఇప్పటివరకు సుడా 79 వెంచర్లకు అనుమతులు ఇచ్చింది. మూడేళ్లలో సుడా పరిధిలోని గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. ప్రతి గ్రామంలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు అందుబాటులోకి వచ్చాయి.
బాధ్యతలు సంతృప్తికరం..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలు, మంత్రి అజయ్కుమార్ చొరవతో సుడా అభివృద్ధి పనులు చేపట్టింది. అభివృద్ధి పనుల విషయంలో పాలక వర్గ సభ్యుల నిర్ణయాలకూ ప్రాధాన్యం ఇచ్చాం. అన్ని ప్రాంతాల అభివృద్ధికీ మేం కట్టుబడి పనిచేశాం. మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు మాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
– బచ్చు విజయ్కుమార్, సుడా చైర్మన్