మధిర రూరల్, జూలై 20: మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మిర్చి నిల్వ రైతులకు వంద శాతం బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు, బాధిత రైతులు పలువురు మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు నెలలు గడుస్తున్నా.. మిర్చి నిల్వ చేసి నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వానకాలం సీజన్, విద్యాసంవత్సరం పునఃప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడులకు, పిల్లల చదువులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సీఎం జోక్యం చేసుకొని, బీమా ప్రతినిధులతో చర్చించి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేశ్, కన్వీనర్ దివెల్ల వీరయ్య, సీతారాంరెడ్డి, నాయకులు మడిపల్లి గోపాలరావు, మందడపు ఉపేంద్ర, పడకంటి మురళి, బాధిత రైతులు పాల్గొన్నారు.