పెనుబల్లి, జూన్ 23: భార్యాభర్తలు సహా కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం మామిడితోటలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కారాయిగూడేనికి చెందిన పోట్రు వెంకటకృష్ణారావు (40), సుహాసిని (35) భార్యాభర్తలు. వీరికి కుమార్తె అమృత (16), కుమారుడు కార్తీక్. వెంకటకృష్ణారావు లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తెను ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. కుమారుడిని సాఫ్ట్వేర్ ఉద్యోగ ప్రయత్నాల కోసం బెంగళూరుకు పంపించాడు. కొద్దిరోజుల క్రితం భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా ఓ ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్లు చేయించాడు. వైద్యులు సుహాసినికి క్యాన్సర్గా నిర్ధారించారు. తర్వాత ఆమెకు క్యాన్సర్కు సంబంధించిన ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ విఫలం కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. తాజాగా గురువారం భర్త ఏపీలోని తిరువూరు పట్టణంలోని ఓ ఆసుపత్రిలో భార్యకు వైద్యపరీక్షలు చేయించాడు. వైద్యులు సుహాసిని మెడికల్ రిపోర్టులు చూసి క్యాన్సర్ చివరి స్టేజీకి వచ్చిందని, ఆమె ఎక్కువ కాలం బతకదని నిర్ధారించారు.
సుహాసిని లేని జీవితాన్ని ఊహించుకుని భర్త, కుమార్తె మానసికంగా కుంగిపోయారు. చివరకు ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉరి వేసుకోవడానికి తిరువూరులోనే మూడు తాళ్లు, చిన్న స్టూళ్లు కొనుగోలు చేసి స్వగ్రామానికి వచ్చారు. తమ స్వగ్రామం శివారులోని సొంత మామిడి తోటకు వచ్చారు. అక్కడ ఓ మామిడి చెట్టుకు ఉరివేసుకుని ముగురూ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు తోటలో ముగ్గురినీ విగత జీవులుగా చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సూరజ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఒకే కుటుంబానికిచెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కార్తీక్ను అనాథ చేసి ప్రాణం తీసుకున్నారంటూ బంధువులు విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.
భార్య ఎక్కువ కాలం బతకదని గురువారం వైద్య పరీక్షలు చేయించి నిర్ధారించుకున్న వెంకట కృష్ణారావు వెంటనే బెంగళూరులో ఉంటున్న కుమారుడు కార్తీక్కు ఫోన్ కాల్ చేశాడు. ‘అమ్మకు ఆరోగ్యం బాలేదు.. ఒకసారి ఇంటికి వచ్చేయ్’ అని చెప్పాడు. దీంతో కార్తీక్ హుటాహుటిన స్వస్థలానికి బయల్దేరాడు. కార్తీక్ సొంతూరికి చేరుకునే లోపే అమ్మానాన్న చెల్లి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి నిర్ఘాంతపోయాడు. స్వస్థలానికి చేరుకున్న కారీక్ ముగ్గురి మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించాడు. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.