సత్తుపల్లి, డిసెంబర్ 15 : పరమపవిత్రమైన ధనుర్మాసం ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతికి నెల ముందు నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ఆరంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్ని పల్లెల్లో సంక్రాంతి నెల అని కూడా అంటారు. అందుకే ఇంతటి పవిత్రమైన ధనుర్మాసం కోసం కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యమీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి అది వచ్చాకే మరణించారన్నది పురాణోక్తి. భక్తవత్సలుడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ ధనుర్మాసం. ఈ మాసంలో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాదిక్రతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తున్న దివ్యోక్తి. ఈ మాస దివ్య ప్రభావం వల్ల గోదాదేవి సాక్షాత్తూ ఆ రంగనాయకుని పరిణయమాడిందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ భూదేవి అవతారమూర్తయిన ఆండాళ్లు రచించిన దివ్యప్రబంధమే తిరుప్పావై. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అని అర్థం. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజింజి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లీడు యువతులు తమ ఇళ్ల ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. ఈ నెలలో ప్రతిరోజూ సూర్యోదయానికి ఐదు గడియలు ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి సంధ్యావందనాలు ముగించి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ నెల రోజులు హరిదాసుల కీర్తనలతో, జంగమదేవరులతో, గంగిరెద్దుల ఆటపాటలతో సందడిగా ఉంటుంది. పందిళ్లలో ముత్యాల ముగ్గులు కనువిందుగా చేస్తుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్లకు చేర్చిన రైతులు.. సంబరాలతో సంక్రాంతి పండుగ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ధనుర్మాస ఉదయ సంధ్యల్లో ఇళ్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహిస్తుందని నమ్మకం. మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది. ఆ భగవత్ప్రాప్తి కోసం భూమిపైనే భక్తి, ప్రవృత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని నమ్మకం. ఈ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే ధనుర్మాస వ్రత ఉద్దేశం. ఈ మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో, అంతరానుభవంతో 30 రోజులు ఆధ్యాత్మికత చెందుతూ పాశురాలను ధ్యానం చేస్తే సత్సంగం వల్ల భగవత్ సంకల్పం ప్రాప్తిస్తుందని ఈ పాశురాల ద్వారా నిరూపితమైంది. తిరుప్పావై అంటే శ్రీవ్రతం. ఈ వ్రతాన్ని తిరునోము అంటారు. మార్గశిర మాసంలో ధనురాశిలో సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మార్గం అంటే దారి లేదా ఉపాయం. శీర్షం అంటే శిరం. మార్గశిరం అంటే భగవత్ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మార్గం. ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి తన పాశురాలను గానం చేసి దైవాన్ని చేరింది. ఈ నెల 17 నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14న గోదాదేవి కల్యాణంతో పరిసమాప్తమవుతుంది. గోదాదేవి ఆచరించిన తిరుప్పావై వ్రతం ద్వారా భక్తులు తాము కోరిన కోర్కెలను తీర్చుకోవచ్చన్నది ప్రతీతి. ఈ ప్రకారంగానే గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి శ్రీరంగనాథుని చెంతకు చేరి విగ్రహరూపాన్ని పొందింది. ఇది శ్రీవైష్ణవ సంప్రదాయంలో అద్భుతమైన వ్రతం. పరమాత్మున్ని పొందడానికి ఎక్కడో వెళ్లాల్సిన అవసరంలేదని, మన ఆరాధనలు అందుకోవడానికి వచ్చిన అద్భుతరూపం ఆ విగ్రహమని, పరమాత్మున్ని విశ్వసించి మనం ఏది కోరినా అది పొందవచ్చని గోదాదేవి నిరూపించిందన్నది పురాణోక్తి.
ధనుర్మాసం అంటేనే పరమపవిత్రమైన మాసం అని అర్థం. ఈ నెల రోజులు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 14 వరకు ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు, గోదాదేవి పాశురాలు చేయడం ఆనవాయితీ. ఈ నెల రోజులు గోదాదేవి చరిత్రను తెలుసుకుంటూ పూజలు చేయడం ద్వారా ఆ దేవదేవుడు మనకు అంతఃకరణ శుద్ధిని ప్రసాదిస్తాడని నమ్మకం. తద్వారా భక్తిపారవశ్యం పొందుతూ ఆ కేశవనామాలు వింటూ తరించడం భక్తకోటికి మంగళకరం.