జూలూరుపాడు, జూన్ 30: పప్పు ఇంత పలచగా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని కలెక్టర్ అంకిత్ పాఠశాల హెచ్ఎం, భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పూర్తి పరిశుభ్రంగా, పోషక విలువలతోపాటు ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, జడ్పీ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. కేజీబీవీలో కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించారు.
7, 8వ తరగతి విద్యార్థినులతో మాట్లాడుతూ వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన, వసతిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినుల ఔటింగ్ రిజిస్టర్ను పరిశీలించి బాలికల భద్రత విషయంలో రాజీ పడొద్దన్నారు. ఆర్వో ప్లాంట్ మరమ్మతులు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలన సందర్శించిన ఆయన భోజనం, కూరలను పరిశీలించారు.
పప్పు పలచగా ఉండటంతోపాటు భోజనంలో నాణ్యత లోపించినట్లు గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతలో లోపాలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశుభ్రత, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుతోపాటు వారి ఆరోగ్యం, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.