యాదగిరిగుట్ట, జనవరి 31: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబందమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని చేపట్టారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించాలని వేడుకోవడమే స్వస్తివాచనం అని అర్చకులు తెలిపారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయం ఆధ్యాత్మికతను సంతకరించుకుంది. ఆలయాన్ని విశేష పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఆలయం ముఖ మండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్టించి పూజలు చేశారు.
రక్షా బంధనం.. పుణ్యాహవాచనం
శ్రీవారికి, ఉత్సవ నిర్వాహకులకు రక్షాబంధనం కార్యక్రమాన్ని చేపట్టారు.
పారాయణికులు, రుత్వికులకు ఆలయ ఈవో ఎన్. గీత దీక్షా వస్ర్తాలను అందజేశారు. జగద్రక్షకుడైన పరమాత్రమను మూలవరులకు, ఉత్సవమూర్తులకు ఆగమశాస్ర్తానుసారం రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో కల్యాణ సంబురాలు, స్థల, ద్రవ్య శుద్ధ్యర్థం పూజించిన జలాలతో శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యం చేపట్టారు. పంచామృత కలశాలకు వేదమంత్రాలతో దర్బలతో పూజలు నిర్వహించి పుణ్యజలంగా సంప్రోక్షణ జరిపారు.
అంకురారోపణం.. మృత్సంగ్రహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఆలయంలో అంకురారోపణ, మృత్సంగ్రహణంవేడుకలను ఆగమ శాస్త్రరీతిలో చేపట్టారు. తొలిపూజకు ఆలయ ఈఓ గీత, డీఈవో దోర్బాల భాస్కర్శర్మ హాజరుకాగా ఉత్సవాల్లో ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకుడు మాధవాచార్యులు, ముఖ్య అర్చకుడు భాస్కరాచార్యులు, అర్చకులు నరేశాచార్యులు, సంపతాచార్యులు, సత్యనారాయణాచార్యులు, పరిచారకులు వినయ్కుమారాచార్యులు, ఫణికుమారాచార్యులు, వేద పండితులు ఫణికుమారశర్మ, పవన్కుమారాచార్యులు, వినయ్కుమారాచార్యులు, పారాయణికులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణం, సాయంత్రం 6 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.
వైభవంగా సాగుతున్న చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు
నార్కట్పల్లి, జనవరి 31: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి నిప్పుల గుండం నుంచి నడిచేందుకు పోటీపడ్డారు. శివ సత్తుల నాట్య విన్యాసాలు, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి ఏకాంత సేవ, పుప్పోత్సవం నిర్వహించనున్నట్లు దేవాదాయ సహాయక కమిషనర్ మహేంద్ర కుమార్, ఆలయ ఇన్చార్జి ఈవో నవీన్ తెలిపారు.